IND vs ENG 5th Test | భారత్-ఇంగ్లండ్ మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భాగంగా తొలిరోజు భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇదివరకే సిరీస్ కోల్పోయి చివరి మ్యాచ్లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని తంటాలుపడుతున్న ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్లో దారుణంగా విఫలమైంది. టాస్ ఓడి మొదట బౌలింగ్ చేసిన భారత్.. ఇంగ్లండ్ను ఫస్ట్ ఇన్నింగ్స్లో 218 పరుగులకే కట్టడి చేసింది. టీమిండియా స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్.. ఫైఫర్ (5/72)తో మెరవగా వందో టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ నాలుగు (4/51) వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన భారత్.. తొలి ఇన్నింగ్స్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 135 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (58 బంతుల్లో 57, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (83 బంతుల్లో 52 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) లు ఫిఫ్టీలతో మెరిశారు.
తొలి రోజు ఆటలో భాగంగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రెండున్నరేండ్లుగా ఆడుతున్న తమ సహజసిద్ధమైన (బజ్బాల్) ఆటకు విరుద్ధంగా ఆడింది. ధాటిగా ఆడే జాక్ క్రాలే (79), బెన్ డకెట్(58)లు తొలి వికెట్కు 17 ఓవర్లలో 64 పరుగులు మాత్రమే జోడించారు. ఇదే ఓవర్లో ఆఖరి బంతికి బెన్ డకెట్ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయడంతో ఇంగ్లీష్ జట్టు వికెట్ల పతనం మొదలైంది. కుల్దీప్ బౌలింగ్లోనే ఒలీ పోప్ (11)ను ధృవ్ జురెల్ స్టంపౌట్ చేశాడు. లంచ్ లోపు ఆ జట్టు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది.
175-3 నుంచి 183-8కు..
లంచ్ తర్వాత అసలు ఆట మొదలైంది. సెంచరీ దిశగా సాగుతున్న జాక్ క్రాలే ను కుల్దీప్ బౌల్డ్ చేశాడు. జో రూట్ (26) – వందో టెస్టు ఆడుతున్న బెయిర్ స్టో (18 బంతుల్లో 29, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) నాలుగో వికెట్కు 38 పరుగులు జోడించారు. బెయిర్ స్టో ను కూడా కుల్దీప్ పెవిలియన్కు పంపాడు. 43 ఓవర్లకు బెయిర్ స్టో ఔట్ అవడానికి ముందు 175-3గా ఉన్న ఇంగ్లండ్ స్కోరు.. 49 ఓవర్లు ముగిసేసరికి 183-8గా నిలిచింది. కుల్దీప్ టాపార్డర్, మిడిలార్డర్ వెన్ను విరియగా అశ్విన్ టెయిలెండర్ల పనిపట్టాడు. బెన్ ఫోక్స్ (24) పుణ్యమా అని ఆ జట్టు 200 మార్కు దాటింది. చివరికి టీ విరామానికి ముందే 57.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది.
ఇండియా ధనాధన్..
ఇంగ్లండ్ను తక్కువస్కోరుకే కట్టడిచేసిన భారత్.. ఆ జట్టు బ్యాటర్లు స్పిన్కు తడబడిన చోట స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసింది. పేసర్లు అండర్సన్, మార్క్ వుడ్తో తలా మూడు ఓవర్లు వేయించిన స్టోక్స్.. 7 వ ఓవర్ నుంచి స్సిన్నర్లను బరిలోకి దించాడు. షోయబ్ బషీర్ వేసిన 10వ ఓవర్లో జైస్వాల్ మూడు సిక్సర్లు బాదాడు. రోహిత్ కూడా వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు. బషీర్ వేసిన 15వ ఓవర్లోనే మూడో బంతికి ఫోర్ కొట్టడం ద్వారా జైస్వాల్.. టెస్టులలో వినోద్ కాంబ్లీ (14 ఇన్నింగ్స్) తర్వాత అత్యంత వేగంగా (16 ఇన్నింగ్స్లలో) వెయ్యి పరుగులు పూర్తిచేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు. బషీర్ వేసిన 21వ ఓవర్లో రెండో బంతికి ఫోర్ కొట్టి అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న జైస్వాల్.. నాలుగో బంతికి స్టంపౌట్ అయ్యాడు. తొలి వికెట్కు ఈ ఇద్దరూ సెంచరీ (104) భాగస్వామ్యం నెలకొల్పారు. కొద్దిసేపటికే రోహిత్ కూడా హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసేటప్పటికీ రోహిత్తో పాటు శుభ్మన్ గిల్ (39 బంతుల్లో 26 నాటౌట్ 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది.