లండన్ : పాకిస్థాన్ దిగ్గజ సారథి, ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన కుమారులు సులేమాన్, కాసిం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మాజీ కెప్టెన్ను జైల్లోనే చంపే కుట్రలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. లండన్లోని ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు బ్రేక్ సందర్భంగా స్కైస్పోర్ట్స్ (బ్రాడ్కాస్టర్) ఆహ్వానం మేరకు ఈ ఇద్దరూ మాట్లాడారు. ఇంగ్లండ్ మాజీ సారథి మైఖేల్ అథర్టన్తో వారు మాట్లాడుతూ.. ‘వాళ్లేం (ప్రభుత్వం) చేస్తున్నారో సుస్పష్టంగా కనిపిస్తున్నది. మా నాన్నను అక్కడే (జైల్లో) చంపేయాలనే కుట్ర చేస్తున్నారు.
ఆయనను వీలైనంత ఎక్కువకాలం అక్కడే ఉంచి ఆయన నోరు మూయించాలనే ప్రణాళికతో ఉన్నారు. మా నాన్న మా అత్తలతో చివరిసారిగా మాట్లాడినప్పటికంటే ఇటీవల పరిస్థితులు మరింత దిగజారాయి. రోజుకు 23 గంటలకు పైగా ఒక గదిలో పూర్తి ఏకాంతంగా ఆయనను ఉంచుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఒక తటస్థ వైద్యుడితో నివేదిక ఇప్పించడానికి వాళ్లెందుకు భయపడుతున్నారు. కోర్టు ఆయనకు వైద్యసేవలపై ఆదేశించినప్పుడు మా తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుందని ఆశించాం. కానీ ప్రైవేట్ ఆస్పత్రికి బదులుగా ఆయనను ప్రభుత్వ దవాఖానాకు తీసుకెళ్లి అక్కడ్నుంచి కొద్దిగంటల్లోనే నేరుగా జైలుకు తీసుకెళ్లడంతో మా భయాలు నిజమయ్యాయి’ అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా మ్యాచ్ జరుగుతుండగా ఈ వీడియోను బ్రేక్ సమయంలో ప్రసారం చేయడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)ఆగ్రహం వ్యక్తం చేసింది.