సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసింగ్కు కౌంట్డౌన్ మొదలైంది. అందరూ ఎప్పుడెప్పుడంటూ ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. భారత్ వేదికగా తొలిసారి జరుగుతున్న ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు హైదరాబాద్ నగరం అన్ని హంగులతో సిద్ధమవుతున్నది. ఎలాంటి కాలుష్యానికి ఆస్కారం లేకుండా పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ కార్లతో జరుగనున్న రేసింగ్ కోసం ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది.హుసేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్పై రివ్వున దూసుకుపోయేందుకు రేసింగ్ కార్లు సిద్ధమవుతున్నాయి. మొత్తం 11 ప్రపంచ ప్రముఖ జట్లు హైదరాబాద్ గ్రాండ్ప్రిలో దుమ్మురేపనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై ప్రత్యేక కథనం.
ప్రపంచ ఫార్ములా-ఈ చాంపియన్షిప్ తొమ్మిదో సీజన్లో భాగంగా నాలుగో రేసుకు హైదరాబాద్ వేదిక కాబోతున్నది. ఈ నెల 11న నగరం నడిబొడ్డున రేసింగ్ జరుగనుంది. రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్కో సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాట్లు యుద్ధప్రాతిపాదికన జరుగుతున్నాయి. రేసింగ్కు మరో ఆరు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్(హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో పనులు చకచకా సాగుతున్నాయి. రేసింగ్లో పోటీపడే 11 జట్లకు చెందిన 22 కార్ల విడిభాగాలు ప్రత్యేకమైన ఎయిర్కార్గో ద్వారా గురువారం హైదరాబాద్కు చేరుకున్నాయి. ఎఫ్ఐఏకు చెందిన నిపుణుల సమక్షంలో భారీ ట్రక్లలో కార్లను ఐమ్యాక్స్ పరిసర ప్రాంతంలో ప్రత్యేకంగా నిర్మిస్తున్న గ్యారేజీలకు చేర్చారు.
ప్రత్యేక గ్యారేజీలు:
రేసింగ్ కోసం గ్రీన్కో సంస్థ కస్టమ్బిల్ట్ గ్యారేజీలను నగరానికి తీసుకొచ్చింది. హైమ్యాక్స్ పక్కన ఏర్పాటు చేసిన స్థలంలో వీటిని ఉంచారు. పోటీల నిర్వహణలో భాగంగా అవసరమైన కార్లను విదేశాల్లోనే తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఎక్కడా ఎలాంటి సాంకేతిక పరమైన ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వ అనుమతితో బోయింగ్ విమానాల్లో సౌదీ అరేబియా నుంచి ఇక్కడికీ తరలించామని తెలిపారు. జీరో కర్బన ఉద్గారాలతో రూపుదిద్దుకున్న ఎలక్ట్రిక్ కార్లను పర్యావరణానికి అనుకూలంగా ఉండే రీతిలో తీర్చిదిద్దారు. పోటీ పడుతున్న ప్రతీ కారును ఒకే రకమైన సాంకేతికతో రూపొందించారు. వేగం, బరువు విషయంలో తేడాల్లేకుండా అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేశారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలుగనివ్వని ఈ ఎలక్ట్రిక్ కార్లు హైదరాబాద్ రోడ్లపై దూసుకుపోయేందుకు సర్వహంగులతో సిద్ధమవుతున్నాయి.
సూపర్ కార్స్!
హైదరాబాద్లో జరిగే ఫార్ములా-ఈ రేసింగ్లో పోటీపడే కార్లు సాంకేతిక విషయంలో సూపర్ అని చెప్పొచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)కు పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో రూపుదిద్దుకున్న వీటిని జనరేషన్-3 కార్లుగా అభివర్ణిస్తున్నారు. జనరేషన్-2 కార్లతో పోల్చుకుంటే ఈ కార్లు బరువు విషయంలో చాలా తేలిక(53కి)గా ఉంటాయి. వేగం విషయానికొస్తే గంటకు 322కి.మీల వేగంతో రాకెట్లా దూసుకుపోతాయి. గతంలో ఉన్న బ్యాటరీ సామర్థ్యాన్ని 250కేడబ్ల్యూ నుంచి 350కేడబ్ల్యూకు పెంచడం ద్వారా ఈ కార్ల సామర్థాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు.
ఎనిమిదేండ్ల తర్వాత భారత్లో రేస్: ఆనంద్ మహీంద్రా
దాదాపు ఎనిమిది ఏండ్ల తర్వాత ప్రపంచ ఫార్ములా-ఈ చాంపియన్షిప్నకు భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్నది. ఈ ప్రతిష్ఠాత్మక రేసును మన దేశానికి తీసుకురావడంలో విశేష కృషి చేసిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు. చీర్ ఫర్ టీమ్ మహీంద్రా అంటూ ఆనంద్ ట్వీట్ చేశారు. ఇందుకు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ‘వెల్కమ్ టు హైదరాబాద్ ఆనంద్జీ’ అంటూ మహీంద్రాను ఆహ్వానించారు.
హైదరాబాద్ నాలుగో
ఫార్ములా-ఈ ప్రపంచ రేసింగ్ చాంపియన్షిప్లో ఇప్పటికే రెండు (మెక్సికో, దిరియా) నగరాల్లో రేసులు ముగిశాయి. తొలుత మెక్సికోలో జనవరి14న జరుగగా, జనవరి 27, 28 తేదీల్లో దిరియా(సౌదీ) వేదికగా రౌండ్-2, రౌండ్-3 పోటీలు జరిగాయి. హైదరాబాద్లో నాలుగో రేసు జరుగనుండగా, కేప్టౌన్, సావోపౌలో ఆ తర్వాత రేసులు జరుగుతాయి.