WPL 2023 | ప్రత్యర్థితో సంబంధం లేకుండా.. ముంబై ఇండియన్స్ దూసుకెళ్తున్నది! మహిళల ప్రీమియర్ లీగ్లో ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన ముంబై 10 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. బ్యాటింగ్లో హర్మన్ప్రీత్ కౌర్, యస్తిక భాటియా మెరుపులకు.. బౌలింగ్లో బ్రంట్, మాథ్యూస్ కృషి తోడవడంతో ముంబై పాంచ్ పటాకా మోగించింది.
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతున్నది. తొలిసారి నిర్వహిస్తున్న లీగ్లో పరాజయం అన్నదే ఎరుగకుండా దూసుకెళ్తున్న హర్మన్ప్రీత్ సారథ్యంలోని ముంబై మంగళవారం జరిగిన పోరులో 55 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్ను చిత్తు చేసింది. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ నెగ్గిన ముంబై ఇండియన్స్.. పది పాయింట్లతో పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడంతో పాటు.. మరో మూడు మ్యాచ్లు మిగిలుండగానే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది.
తాజా పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించగా.. యస్తిక భాటియా (44; 5 ఫోర్లు, ఒక సిక్సర్), స్కీవర్ బ్రంట్ (36; 5 ఫోర్లు, ఒక సిక్సర్) సత్తాచాటారు. గుజరాత్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులు చేసింది. కెప్టెన్ స్నేహ్ రాణా (20), హర్లీన్ డియోల్ (22), సుష్మ వర్మ (18 నాటౌట్), సబ్బినేని మేఘన (16) కాస్త పోరాడినా.. ముంబై బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి గుజరాత్ పనిపట్టారు. బ్రంట్, మాథ్యూస్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. హర్మన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా బుధవారం యూపీ వారియర్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.
లీగ్ ఆరంభం నుంచే ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోతున్న ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించింది. విధ్వంసక ఓపెనర్ హీలీ మాథ్యూస్ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరగగా.. యస్తిక, బ్రంట్ ఇన్నింగ్స్ను నిలబెట్టారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలతో స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. రెండో వికెట్కు 74 పరుగులు జోడించిన అనంతరం బ్రంట్ ఔట్ కాగా.. కాసేపటికే యస్తిక రనౌట్ రూపంలో వెనుదిరిగింది. ఈ దశలో గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ఆకట్టుకోవడంతో పరుగుల రాక కష్టమైంది.
14 ఓవర్లు ముగిసేసరికి ముంబై 101/3తో నిలిచింది. ఇక భారీ స్కోరు చేయడం కష్టమే అనుకుంటున్న తరుణంలో హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకుంది. గార్డ్నర్, సదర్లాండ్ ఓవర్లలో రెండేసి ఫోర్లు బాదిన హర్మన్ చివరి ఓవర్లో ఔటయ్యేంత వరకు అదే దూకుడు కొనసాగించింది. సదర్లాండ్ వేసిన 19వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన హర్మన్.. ఆఖరి ఓవర్లో బౌండ్రీతో 29 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. అనంతరం గుజరాత్ ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. జట్టు ఎంపిక విషయంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుజరాత్ కనీస ప్రతిఘటన లేకుండానే పరాజయాన్ని ఆహ్వానించింది.
ముంబై: 162/8 (హర్మన్ప్రీత్ 51, యస్తిక 44; గార్డ్నర్ 3/34), గుజరాత్: 20 ఓవర్లలో 107/9 (హర్లీన్ 22, స్నేహ్ రాణా 20; బ్రంట్ 3/21, హీలీ మాథ్యూస్ 3/23).