కైరో: షూటింగ్ ప్రపంచకప్లో భారత యువ షూటర్ ఇషాసింగ్ అదరగొట్టింది. జూనియర్ షూటర్గా జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో ఇప్పటికే లెక్కకు మిక్కిలి పతకాలు కొల్లగొట్టిన ఇషాసింగ్..సీనియర్గా బరిలోకి దిగిన తొలి పోటీలో తన సత్తా ఏంటో చూపించింది. మంగళవారం ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హైదరాబాదీ షూటర్ ఇషాసింగ్ రజత పతకంతో మెరిసింది. తనకంటే అత్యుత్తమ స్థాయి షూటర్లతో కడదాకా పోరాడిన ఈ యువ సంచలనం భారత్కు వెండి పతకాన్ని అందించింది. స్వర్ణ పతక పోరులో గ్రీస్కు చెందిన ప్రపంచ చాంపియన్, నంబర్వన్ షూటర్ అన్నా కొరాకకి(16 పాయింట్లు) చేతిలో ఇషా(4) పోరాడి ఓడింది. అంతకుముందు జరిగిన అర్హత, మెడల్ రౌండ్లలో ఇషా అద్భుత ప్రదర్శన కనబరిచింది. ప్రపంచవ్యాప్తంగా 80 మంది షూటర్లు హోరాహోరీగా తలపడ్డ ఈ పోరులో ఇషా అంచనాలకు మించి రాణించింది. అర్హత రౌండ్లో 578 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచిన ఈ తెలుగు షూటర్.. వెనుదిరిగి చూసుకోలేదు. రౌండ్రౌండ్కు ప్రత్యర్థులకు దీటైన సమాధానమిస్తూ కీలక పాయింట్లు కొల్లగొట్టింది. ఈ క్రమంలో అన్నా కొరాకకి(40), టోక్యో ఒలింపిక్స్ రజత విజేత విటాలినా(39.5) అధిగమిస్తూ ఈ హైదరాబాదీ (41.5) అగ్రస్థానంలో నిలిచింది. అయితే పతక పోరులో గ్రీస్ షూటర్ తన అనుభవాన్ని ఉపయోగించి కచ్చితమైన గురితో విజృంభించడంతో ఇషా తృటిలో పసిడి పతకం చేజార్చుకోవాల్సి వచ్చింది. షూటింగ్ ప్రపంచకప్లో రజతం సాధించిన ఇషాసింగ్ను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి ట్విట్టర్లో అభినందించారు. మరోవైపు పురుషుల 10మీటర్ల ఎయిర్ పిస్టల్లో సౌరభ్ చౌదరీ స్వర్ణ పతకం దక్కించుకున్నాడు. ఇదే కేటగిరీలో మైఖేల్ స్కీవాల్డ్, అర్టెమ్ వరుసగా రజత, కాంస్యాలు కైవసం చేసుకున్నారు. ఓ స్వర్ణం, రజతంతో భారత్ ప్రస్తుతం పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.