టోక్యో: విశ్వక్రీడల్లో కోటి ఆశలతో అడుగుపెట్టిన భారత్కు ఆరంభంలో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రోజు ఆర్చరీ పోటీల్లో బరిలోకి దిగిన మన అథ్లెట్లు భారీ అంచనాలను అందుకోలేకపోయారు. మహిళా స్టార్ ఆర్చర్ దీపికా కుమారి టోక్యోలో భారత్ యుద్ధానికి అంకురార్పన చేసింది. శుక్రవారం మహిళల ఆర్చరీ ర్యాంకింగ్ విభాగంలో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్వన్ దీపిక తొమ్మిదో స్థానంతోనే సరిపెట్టుకుంది. మొత్తం 72 అవకాశాలతో దీపిక 663 పాయింట్లు సాధించగలిగింది. తదుపరి తొలిరౌండ్లో భూటాన్కు చెందిన కర్మపై దీపిక విజయం సాధించడం దాదాపు ఖాయం కాగా.. ఒలింపిక్స్ రికార్డు బద్దలుకొట్టిన ఆన్ సాన్.. క్వార్టర్స్లో ఎదురయ్యే అవకాశం ఉంది. కాగా వ్యక్తిగత ర్యాంకింగ్ విభాగంలో భారత పురుష ఆర్చర్లు బాణాలను సరిగా సంధించడంలో విఫమలమయ్యారు. ప్రవీణ్ జాదవ్ (656 పాయింట్లు) 31వ స్థానం సాధించగా ఎన్నో ఆశలు పెట్టుకున్న అతానుదాస్ (653) 35వ, తరుణ్దీప్ రాయ్ (652) 37వ స్థానాలతో సరిపెట్టుకున్నారు.
భారత పురుషుల, మిక్స్డ్ టీమ్ జట్లు ర్యాంకింగ్ రౌండ్లో తొమ్మిదో స్థానాన్ని సాధించాయి. అతాను దాస్, ప్రవీణ్ జాదవ్, తనూదీప్ రాయ్తో కూడిన భారత త్రయం 11 జట్ల ర్యాంకింగ్ రౌండ్లో 1961 పాయింట్లతో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. మిక్స్డ్ టీమ్ విభాగంలో భర్త అతాను దాస్తో కాకుండా దీపిక కుమారి.. ప్రవీణ్ జాదవ్తో బరిలోకి దిగింది. మొత్తంగా దీపిక – జాదవ్ ద్వయం 1319 పాయింట్లు సాధించింది. తదుపరి రౌండ్లో చైనీస్ తైపీతో తలపడనున్న దీపిక జోడీకి.. క్వార్టర్స్లో కఠినమైన దక్షిణకొరియా ఎదురుపడే అవకాశాలు ఉన్నాయి.
టోక్యో విశ్వక్రీడల తొలి రోజే దక్షిణ కొరియా యువ ఆర్చర్ అన్ సాన్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో 680 పాయింట్లు సాధించి ఒలింపిక్ రికార్డు బద్దలుకొట్టింది. 36సార్లు 10కి 10 పాయింట్లు కొల్లగొట్టడం సహా.. ఉక్రెయిన్ అథ్లెట్ లినా హెరాసిమెంకో (673 పాయింట్లు – 1996 ఒలింపిక్స్) పేరిట ఉన్న విశ్వక్రీడల రికార్డును చెరిపేసింది.