దుబాయ్: సన్రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది ఐపీఎల్( IPL 2021 )లో ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎప్పుడో తప్పుకుంది. ఎలాగూ ఇక ఆ చాన్స్ లేదు కదా అని రాజస్థాన్ రాయల్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. ఈ సీజన్ మొదట్లో వార్నర్ను కెప్టెన్సీ నుంచి తప్పించిన ఫ్రాంచైజీ.. ఇప్పుడు తుది జట్టులోనూ అతనికి స్థానమివ్వలేదు. అతని స్థానంలో టీమ్లోకి వచ్చిన జేసన్ రాయ్.. రాజస్థాన్పై విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ఇక ఈ సీజన్లో వార్నర్ మొత్తంగా హోటల్ రూమ్కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై మ్యాచ్ తర్వాత సన్రైజర్స్ కోచ్ బేలిస్ స్పందించాడు.
వార్నర్ను పక్కన పెట్టాలన్న నిర్ణయం టీమ్ ఎంతో ముందుగానే తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే అతడు ఈ మ్యాచ్ కోసం కనీసం స్టేడియానికి కూడా రాలేదు. వార్నర్ హోటల్ రూమ్లో కూర్చొని మ్యాచ్ చూస్తున్నాడని ఆ తర్వాత కోచ్ బేలిస్ చెప్పడం విశేషం. ఇక నుంచి యువకులకు చాన్స్ ఇవ్వాలని నిర్ణయించాం. ఎంతోమందికి కనీసం టీమ్తో కలిసి స్టేడియానికి కూడా వచ్చే అవకాశం దక్కలేదు. అలాంటి వారికి ఇక నుంచి చాన్స్ ఇస్తాం. హోటల్ దగ్గరే వదిలేసిన అనుభవజ్ఞులైన ప్లేయర్స్లో వార్నర్ ఒక్కడే లేడు అని బేలిస్ చెప్పాడు.
ఈ సీజన్లో రానున్న మ్యాచ్లలోనూ యువకులనే తుది జట్టులో కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు బేలిస్ చెప్పాడు. ఐపీఎల్లో 5449 పరుగులు చేయడంతోపాటు సన్రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన వార్నర్.. ఈ సీజన్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 8 మ్యాచ్లలో కేవలం 195 పరుగులే చేశాడు. దీంతో ఇక అతన్ని ఈ సీజన్లో మొత్తంగా హోటల్ రూమ్కే పరిమితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాగూ టీమ్ ఫైనల్ చేరే అవకాశం లేదు కాబట్టి సాధ్యమైనంత వరకూ యువకులకు చాన్సివ్వాలని అనుకుంటున్నట్లు కోచ్ బేలిస్ చెప్పాడు. ఇక మెగా వేలం రానున్న నేపథ్యంలో వార్నర్ను టీమ్తోపాటు కొనసాగిస్తారా లేదా అన్నదానిపైనా బేలిస్ స్పష్టంగా చెప్పలేదు.
మ్యాచ్ సమయంలో వార్నర్ స్టేడియంలో ఉన్నాడా.. అతడు మాకు కనిపించలేదు అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు వార్నర్ స్పందించిన విధానం కూడా ఇక అతడు సన్రైజర్స్కు ఆడతాడా లేదా అన్న అనుమానాలను పెంచింది. దురదృష్టవశాత్తూ మళ్లీ కనిపించను.. అయినా దయచేసి సపోర్ట్ చేస్తూనే ఉండండి అని ఆ అభిమానికి వార్నర్ బదులిచ్చాడు. దీనిని బట్టి ఈ సీజన్లో అతడు కనీసం స్టేడియానికి కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.