Cricket Legends – Sledging : మైదానంలోకి దిగాక ఏ జట్టు విజయం కోసం శ్రమించాల్సిందే. ఆటగాళ్లు పొట్లగిత్తల్లా తలపడాల్సిందే. అయితే.. కొందరు మాత్రం ప్రత్యర్థి జట్టు గెలుపు దిశగా అడుగులేస్తుంటే తట్టుకోలేక ఆటగాళ్లను రెచ్చగొడతారు. వాళ్ల దృష్టి మరల్చి పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తారు. కొందరైతే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లపైకి దూసుకెళ్లిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.ఇదంతా స్లెడ్జింగ్ (Sledging)భాగం.అయితే.. ఈ వ్యూహాలు కొన్నిసార్లు విజయం సాధిస్తే.. మరికొన్నిసార్లు బూమరాంగ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. జెంటిల్మన్ గేమ్ క్రికెట్లో అలాంటి కొన్ని మర్చిపోలేని సంఘటనలు ఇవే.
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎంత ఉద్రిక్తత ఉంటుందో తెలిసిందే. 1996 ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో దాయాదులు తలపడ్డాయి. ఆ మ్యాచ్లోనూ ఇలాంటి పరిస్థితే తలెత్తింది. పాక్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో వెంకటేశ ప్రసాద్ సంధించిన బంతిని ఆమిర్ సోహైల్ బౌండరీకి తరలించాడు. ఆ వెంటనే ఓవర్ కాన్ఫిడెన్స్తో బ్యాట్ను వెంకటేశ్ ప్రసాద్వైపు చూపిస్తూ స్లెడ్జింగ్ ప్రారంభించాడు. అయితే, ఆ తర్వాతి బంతికే ప్రసాద్ అతడిని పెవిలియన్ పంపి నోరుమూసుకునేలా చేశాడు.
చిరకాల ప్రత్యర్థులైన భారత్ – పాకిస్థాన్ మ్యాచ్కు ముందే వాతావరణం గంభీరంగా మారుతుంది. 2007 నవంబర్లో ఐదు వన్డేలు, మూడు టెస్టుల సిరీస్ కోసం పాకిస్థాన్ జట్టు భారత్లో పర్యటించింది. అప్పటికే చెరో వన్డే గెలిచిన ఇరు జట్లు కాన్పూరులో మూడో వన్డేకు సిద్ధమయ్యాయి. భారత్ ఇన్నింగ్స్ 20వ ఓవర్ మూడో బంతికి గౌతం గంభీర్-షాహిద్ అఫ్రిది కలబడ్డారు. ఇద్దరూ తమ నోటికి పనిచెప్పారు.
గౌతం గంభీర్ – షాహిద్ అఫ్రిది
వివాదం మరింత ముదిరడంతో ఆ తర్వాత బంతికి ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లారు. అయితే.. ఈ మ్యాచ్లో భారత్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ తర్వాత మైదానంలో గంభీర్, అఫ్రిది ప్రవర్తనకు ఐసీసీ జరిమానా విధించింది. స్లెడ్జింగ్ ఘటనల్లో దీనికి టాప్ ప్లేస్ దక్కింది.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య 2000వ సంవత్సరంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరిగింది. ఆ ట్రోఫీలో కంగారూ జట్టు స్లెడ్జింగ్ను ఆయుధంగా చేసుకుని విజయం సాధించింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 2021 గబ్బా టెస్టులో భారత్ చేతిలో ఆసీస్కు పరాభవం ఎదురైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో టీమిండియా 407 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. త్వరగానే ఐదుగురు టాప్ బ్యాటర్లు పెవిలియన్ చేరారు. క్రీజులో కుదురుకున్న హనుమ విహారి-రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ను డ్రా దిశగా నడిపిస్తున్నారు.
టిమ్ పైన్, అశ్విన్
వారిద్దరూ తమ నుంచి విజయాన్ని దూరం చేస్తుండడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్() తట్టుకోలేకపోయాడు. అశ్విన్ వద్దకు వచ్చి ‘‘నిన్ను గబ్బాకు తీసుకెళ్లకుండా ఉండలేను. బూడిద.. ఊది పడేస్తాను’’ అని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ సహనం కోల్పోని అశ్విన్ ‘‘అచ్చం మీలానే, నిన్ను ఇండియాకు తీసుకెళ్లకుండా ఉండలేను. నీకిదే చివరి సిరీస్’’ అని తాపీగా బదులిచ్చాడు. అశ్విన్ను రెచ్చగొట్టి పెవిలియన్ పంపాలన్న పైన్ వ్యూహం ఫలించలేదు. ఈ గేమ్లో భారత జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 33 సంవత్సరాల తర్వాత గబ్బా కోటను భారత్ బద్దలుగొట్టి రికార్డులకెక్కింది.
ఇంగ్లండ్ సక్సెస్ఫుల్ టెస్ట్ బౌలర్ అయిన జేమ్స్ అండర్సన్() ఎప్పుడూ నోరు పారేసుకోడు. అయితే, అతడు నోరెత్తితే మాత్రం అది హెడ్లైన్స్కు ఎక్కేస్తుంది. ఆసీస్ పేసర్ మిచెల్ జాన్సన్ కూడా అంతే. 2011లో ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ను చేజిక్కించుకున్న ఇంగ్లండ్ 24 సంవత్సరాల తర్వాత ఆ ఘనత సాధించింది. ఇంగ్లిష్ జట్టు విజయంలో అండర్సన్ కీలక పాత్ర పోషించాడు. ఐదు మ్యాచుల్లో ఏకంగా 24 వికెట్లు సాధించాడు.
మిచెల్ జాన్సన్, జేమ్స్ అండర్సన్
పెర్త్లో జరిగిన మూడో టెస్టులో అండర్సన్ను జాన్సన్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. తొలి రోజు ఆస్ట్రేలియా అప్పటికే ఆరు వికెట్లు కోల్పోయింది. జాన్సన్, ర్యాన్ హారిస్ క్రీజులో ఉన్నారు. నాన్ స్ట్రెకర్ జాన్సన్.. అండర్సన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ‘‘వికెట్లు తీయకున్నా ఎందుకలా కిలకిలా నవ్వుతున్నావ్ మిత్రమా?’’ అని అన్నాడు. అతడి మాటలతో అండర్సన్కు ఉక్రోషం పొడుచుకు వచ్చింది. ఆ తర్వాతి బంతికే హారిస్ను ఔట్చేసి జాన్సన్ నోరు మూయించాడు. అంతేకాదు నోటిపై వేలు ఉంచి జాన్సన్ వైపు చూస్తూ హెచ్చరికలు జారీ చేశాడు.
మైఖేల్ క్లార్క్, వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరూ ఎవరికి వారే. తమ బ్యాటింగ్తో అభిమానులను ఉర్రూతలూగించారు. 2004లో ఆస్ట్రేలియా జట్టు భారత్లో పర్యటించింది. 35 ఏళ్ల తర్వాత టీమిండియాను సొంతగడ్డపైనే మట్టికరిపించిన ఘనత సొంతం చేసుకుంది. ఆ సిరీస్లో సచిన్ టెండూల్కర్ను క్లార్క్ ఇలానే ఇబ్బంది పెట్టాలని చూశాడు. ‘‘చూడ్డానికి నువ్వు చాలా పెద్దాడిలా కనిపిస్తున్నావ్. సరేలే.. ఆ విషయం మర్చిపో. ఏది ఏమైనా నువ్వు ఆడాలి కదా’’ అని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే, సచిన్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. ఆ సమయంలో మరో ఎండ్లో ఉండి సచిన్ వైపు వస్తున్న సెహ్వాగ్ మాత్రం వదల్లేదు. క్లార్క్ను ఆడేసుకున్నాడు. అతడిని సమీపించి.. నీ వయసెంత? అని అడిగాడు. దానికి క్లార్క్.. ‘‘23 ఫ్రెండ్’’ అని బదులిచ్చాడు.
మైఖేల్ క్లార్క్, సచిన్ టెండూల్కర్
దానికి వెంటనే స్పందించిన సెహ్వాగ్.. ‘‘నీకీ విషయం తెలుసా? సచిన్కు టెస్టులు, వన్డేల్లో నీ వయసుకు మించిన సెంచరీలు ఉన్నాయి. నీ వయసుకు సరిపడా ఏదైనా చెయ్యి ఫ్రెండ్’’ బదులివ్వడంతో క్లార్క్ మారు మాట్లాడకుండా వెళ్లిపోయాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ టెండూల్కర్తో మాటల యుద్ధం మొదలుపెట్టాడు. మరోసారి కల్పించుకున్న సెహ్వాగ్ ఈ సారి అతడి నోరు మూయించాడు. ‘‘నీ ఫ్రెండ్స్ నిన్ను పప్ (కుక్కపిల్ల) అని పిలుస్తారట నిజమేనా?’’ అని ప్రశ్నించాడు. ‘‘అవును’’ అని క్లార్క్ బదులిచ్చాడు. దీనికి సెహ్వాగ్ ‘‘బ్రీడ్ ఏంటి?’’ అని ప్రశ్నించడంతో క్లార్క్ ముఖం పాలిపోయింది. అది విన్న సచిన్కు నవ్వాగలేదు. ఆఫ్ ఫీల్డ్ ఘటనల గురించి మాట్లాడినప్పుడు సెహ్వాగ్ ఈ విషయాన్ని ఇప్పటికీ ప్రస్తావిస్తూ ఉంటాడు.
విరాట్ కోహ్లీ-స్టీవ్ స్మిత్.. ఇద్దరూ దిగ్గజ ఆటగాళ్లే. బ్యాటింగ్లో పులులే. ఇద్దరి మధ్య మంచి అనుబంధం కూడా ఉంది. అయితే, 2014-15 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇద్దరూ పలుమార్లు నోటికి పని చెప్పారు. అడిలైడ్ టెస్టులో రోహిత్శర్మ వేసిన ఓవర్లో స్మిత్ ఓ బంతిని ఆడడంలో ఇబ్బంది పడ్డాడు. దానిని ఎల్బీగా భావించిన రోహిత్ అంపైర్ వైపు తిరిగి అవుట్ అంటూ అప్పీల్ చేశాడు.
విరాట్ కోహ్లీ – స్టీవ్ స్మిత్
అంపైర్ నిరాకరించడంతో అప్పీల్ చేసిన రోహిత్పై స్మిత్ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో రోహిత్ అతడివైపు కోపంగా చూశాడు. ఇద్దరి మధ్య ఏదో జరగబోతోందని ఊహించిన కోహ్లీ అక్కడికి వెళ్లి.. ‘‘నువ్వు నీ హద్దుల్లో ఉంటే మంచిది’’ అని స్మిత్కు వార్నింగ్ ఇచ్చాడు.
మంకీ గేట్ కుంభకోణం క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. 2008-09లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం కంగారూ జట్టు భారత్లో పర్యటించింది. భారత జట్టు సిరీస్ గెలవడం ద్వారా ఏడేళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై విజయాన్ని అందుకుంది. ఈ సిరీస్లో చాలా డ్రామా జరిగింది.
రికీ పాంటింగ్, గంభీర్
ఆసీస్ స్కిప్పర్ రికీ పాంటింగ్తోనూ గౌతం గంభీర్ మాటల యుద్ధానికి దిగాడు. తొలి టెస్టులో గంభీర్పై పాంటింగ్ నోరు పారేసుకున్నాడు. సైలెంట్గా ఉండే రకంకాని గంభీర్ అంతే వేగంగా ఆసీస్ కెప్టెన్కు బదులిచ్చి నోరు మూయించాడు. ఢిల్లీలో జరిగిన మూడో టెస్టులో షేన్ వాట్సన్పై గంభీర్ రెచ్చిపోయాడు. ఫలితంగా, నాగ్పూర్లో జరిగిన నాలుగో టెస్టుకు నిషేధానికి గురయ్యాడు.
డిసిప్లిన్ బౌలింగ్కు ఆసీస్ స్పీడ్స్టర్ గ్లెన్ మెక్గ్రాత్ పెట్టింది పేరు. అంతేకాదు, మాటల యుద్ధంలోనూ ఆరితేరినవాడే. 1996లో సింగర్ వరల్డ్ సిరీస్లో ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించింది. ఆ టోర్నీలో మెక్గ్రాత్ స్లెడ్జింగ్ బాధితుడిగా మిగిలాడు. ఆస్ట్రేలియా-జింబాబ్వే మధ్య తొలి మ్యాచ్తో టోర్నీ ప్రారంభమైంది. ఆసీస్ 125 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మెక్గ్రాత్-ఎడ్డో బ్రాండెస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. అప్పటికే జింబాబ్వే 9 వికెట్లు కోల్పోయింది.
మెక్గ్రాత్ – ఎడ్డో బ్రాండెస్
120 పరుగుల వద్ద బ్రాండెస్ చివరి ఆటగాడిగా మైదానంలో అడుగుపెట్టాడు. ఓటమి అంచుల్లో ఉన్నప్పటికీ బ్రాండెస్ కొన్ని అద్భుతమైన షాట్లతో అలరించాడు. దీంతో అతడి దృష్టి మరల్చేందుకు మెక్గ్రాత్ స్లెడ్జింగ్కు దిగాడు. ‘‘ఎందుకు నువ్వు లావుగా ఉన్నావు’’ అని ప్రశ్నించాడు. దీనికి జింబాబ్వే ప్లేయర్ ఘాటుగా స్పందించాడు. ‘‘నేను మీ ఆవిడపై ప్రేమ ఒలకబోసిన ప్రతిసారీ ఆమె ఓ బిస్కెట్ ఇస్తోంది. అవి తిని లావయ్యా’’ అని సమాధానం ఇచ్చాడు. అయితే, ఆ సమాధానం అతడిని బాధించలేదు. ఎందుకంటే అప్పటికి మెక్గ్రాత్ ఇంకా బ్యాచిలరే. క్రికెట్ హిస్టరీలో ఈ రిప్లై బిగ్గెస్ట్ కమ్బ్యాక్స్లో ఒకటిగా నిలిచిపోయింది.
ఇటీవలి కాలంలో జరిగిన ఘటన ఇది. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ తొలిసారి టెస్టు సిరీస్ను సొంతం చేసుకుంది. 2018-19 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆతిథ్య ఆసీస్ను టీమిండియా 2-1తో చిత్తు చేసింది. ఈ సిరీస్లో ఇరు జట్లు పలుమార్లు మాటల యుద్ధానికి దిగాయి. ఆటగాళ్లు పైపైకి దూసుకెళ్లారు. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్-టిమ్ పైన్ మధ్య మధ్య జరిగిన మాటల యుద్ధం మాత్రం బాగా హైలైట్ అయింది. రెండు మ్యాచ్ల తర్వాత ఇరు జట్లు 1-1తో సమ ఉజ్జీలుగా నిలిచాయి.
రిషభ్ పంత్ – టిమ్ పైన్
మెల్బోర్న్ మ్యాచ్లో పంత్ను ఉద్దేశించి.. ‘‘వన్డేల్లోకి ధోనీ వచ్చేశాడుగా. నువ్వేం చేస్తావ్? ఒక పని చెయ్.. హరికేన్స్కు బ్యాటర్ కూడా కావాలి. కాబట్టి నువ్వు హోబర్ట్ వెళ్లు. అది అందమైన పట్టణం. బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే, నేను నా భార్యను తీసుకుని సినిమాలకు వెళ్తాను. నువ్వు నా పిల్లల్ని చూసుకో’’ అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అంతకుముందు పంత్ కూడా వికెట్ల వెనకుండి పైన్ను రెచ్చగొట్టాడు. అరంగేట్ర ఆటగాడు మయాంక్తో మాట్లాడుతూ.. ‘‘నువ్వెప్పుడైనా తాత్కాలిక కెప్టెన్ అనే పదం విన్నావా?’’ అని ఎగతాళి చేశాడు. ఆ మ్యాచ్లో భారత జట్టు 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎంసీజీలో భారత జట్టు 37 ఏళ్ల తర్వాత విజయం సాధించింది. విచిత్రంగా పంత్ ఆ తర్వాత పైన్ పిల్లలను ఎత్తుకుని కనిపించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో గ్లెన్ మెక్గ్రాత్ బెస్ట్ పేసర్గా ఖ్యాతిగాంచాడు. 1999-2007 మధ్య ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. మైదానంలో దూకుడుగా ఉండే గ్లెన్ మాటల యుద్ధానికి ఎప్పుడూ వెనకాడలేదు. 2003లో ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్లో పర్యటించింది. అంటిగ్వాలో జరిగిన ఫైనల్ టెస్టులో రామ్నరేశ్ శర్వాన్తో మెక్గ్రాత్ స్లెడ్జింగ్కు దిగాడు. రెండో ఇన్నింగ్స్ ఆడుకున్న విండీస్ 237 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.
రామ్నరేశ్ శర్వాన్, మెక్గ్రాత్
క్రీజులో ఉన్న శర్వాన్ జట్టును తిరిగి గాడిలో పెట్టాడు. రామ్నరేశ్ను ఎలాగైనా దెబ్బకొట్టాలని భావించిన మెక్గ్రాత్.. ఓ అసభ్యకర ప్రశ్న అడిగాడు. రామ్నరేశ్ దానికి అంతే వేగంగా స్పందించి..‘‘నాకేం తెలుసు.. నీ భార్యను అడుగు’’ అనడంతో బిత్తరపోయాడు. ఆ సమయంలో మెక్ భార్య కేన్సర్తో బాధపడుతోంది. నరేశ్ రిప్లైతో తీవ్ర ఆగ్రహావేశానికి గురైన మెక్ రామ్పైకి దూసుకెళ్తూ.. ఇంకోసారి నా భార్య గురించి మాట్లాడితే.. అంటూ మరోమారు బూతులు మాట్లాడాడు.
భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్ ఎప్పుడూ ఉద్రిక్తంగానే సాగుతుంది. 2005లో పాక్ జట్టు భారత్లో పర్యటించింది. కోల్కతాలోని ఈడెన్గార్డెన్స్లో రెండో టెస్టు జరిగింది. పాక్ 394 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. అప్పటికే పర్యాటక జట్టు 115 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన మహమ్మద్ యూసుఫ్ డిఫెన్స్ ఆడుతూ జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు.
మహ్మద్ కైఫ్, మహమ్మద్ యూసుఫ్
87 బంతుల్లో 22 పరుగులతో ఉన్న వేళ షార్ట్లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ కైఫ్ అతడిని రెచ్చగొట్టాడు. ’’87 బంతులాడి ఒక్క ఫోర్ కూడా కొట్టలేకపోయావా?’’ అని ఎగతాళి చేశాడు. అతడి ప్లాన్ వర్కౌట్ అయింది. ఆ తర్వాత రెండో బంతికే భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి యూసుఫ్ అవుటయ్యాడు. ఆ తర్వాత పాకిస్థాన్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. ఆ మ్యాచ్లో భారత్ 195 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.