అసత్య ఆరోపణలను సహించం
టీఆర్ఎస్ దళిత నాయకుల హెచ్చరిక
జనగామ, నమస్తే తెలంగాణ, మార్చి 30 : ‘నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా ప్రజల మధ్య ఉంటున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం ఖబర్ధార్..’ అని టీఆర్ఎస్ దళిత నాయకులు హెచ్చరించారు. మంగళవారం జనగామలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, టీఆర్ఎస్ దళిత నాయకులు ఉడుగుల నర్సింహులు, పానుగుంటి ప్రవీణ్కుమార్, మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మిద్దెపాక లెనిన్ మాట్లాడారు. దళిత నాయకుడిగా చెప్పుకుంటున్న తిప్పారపు విజయ్కుమార్ తన స్థాయి మరిచి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్లు అమ్ముకునే స్థితిలో టీఆర్ఎస్ లేదన్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి, క్లీన్ చీట్ ఇమేజ్ ఉన్న వారికి మాత్రమే టికెట్ ఇచ్చిందన్నారు. సాధారణ దళిత మహిళ, అంగన్వాడీ టీచర్ను ఉమ్మడి వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా చేసిన ఘనత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి దక్కిందన్న సంగతి దళిత జాతి మరిచిపోదన్నారు.
ఎమ్మెల్యే సహకారంతో దళిత, బహుజన, గిరిజన సంఘాలతో క్యాంపు కార్యాలయంలో కూర్చుని అనేక సార్లు చర్చించి అందరి అభిప్రాయం, సమిష్టి నిర్ణయంతో అంగీకరించిన తర్వాతనే అంబేద్కర్ భవన నిర్మాణం కోసం హైవేపై హన్మకొండ ప్రధాన రహదారిలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ముందు స్థలాన్ని కేటాయించారని గుర్తు చేశారు. స్థల కేటాయింపు కోసం ఎమ్మెల్యే స్వయంగా దళిత సంఘాలను మంత్రి వద్దకు తీసుకువెళ్లి హామీ ఇప్పించారని గుర్తు చేశారు. ప్రస్తుతం స్థలం కేటాయింపు అంశం కలెక్టర్ పరిశీలనలో ఉందని, ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆలస్యమవుతున్నది తప్ప ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై మరోసారి ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. మోడల్ మార్కెట్లో దుకాణాల కేటాయింపు కోసం కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసి అర్హులైన వారికి మాత్ర మే ఇస్తారని, ఇందులో ఎవరి పైరవీ, ప్రమేయం ఉండదన్న సంగతి తెలుసుకోవాలన్నారు. పానుగంటి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పార్టీ ఏమీ ఆశించకుండా తన భార్యకు కౌన్సిలర్ టికెట్ ఇచ్చి గౌరవించిందని, ఒక్క ఓటు తేడాతో ఓటమి చెందితే మా కుటుంబంలో ఒకరికి మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలిగా అవకాశం కల్పించిన దళిత పక్షపాతి ముత్తిరెడ్డి అని అన్నారు. ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేసిన విజయ్కుమార్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గూడెపు కరుణాకర్, రాజు, రాజేశ్ పాల్గొన్నారు.