న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో కీలకమైన ఐదో టెస్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్శర్మకు తాజాగా జరిపిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో మళ్లీ పాజిటివ్ అని తేలడంతో టీమ్ మేనేజ్మెంట్ బుమ్రా వైపు మొగ్గుచూపుతోంది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు అనధికారికంగా ధృవీకరించాయి. గతంలో కరోనా వైరస్ విజృంభణ కారణంగా వాయిదాపడ్డ ఐదో టెస్టు వచ్చే నెల 1 నుంచి బర్మింగ్హామ్ వేదికగా మొదలవుతుంది.
ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా ఆఖరి మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను ఒడిసిపట్టుకోవాలన్న పట్టుదలతో కనిపిస్తున్నది. మరోవైపు న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్ను క్లీన్స్వీప్ చేసి ఇంగ్లండ్ దూకుడు మీదుంది. దీంతో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశముంది. రోహిత్ గైర్హాజరీలో ఒకవేళ బుమ్రా పగ్గాలు అందుకుంటే కొత్త రికార్డు నమోదుకానుంది. 35 ఏండ్ల(1987లో) తర్వాత కపిల్దేవ్ తదనంతరం టెస్టుల్లో భారత్కు సారథ్యం వహించనున్న కెప్టెన్గా బుమ్రా అరుదైన ఘనత సొంతం చేసుకోనున్నాడు. ఇదిలా ఉంటే రోహిత్శర్మ జట్టులో చేరికపై చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరోలా స్పందించాడు.
‘టెస్టు మ్యాచ్ మొదలుకావడానికి ఇంకా 36 గంటల సమయముంది. గురువారం మరోమారు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ఫలితాన్ని పరిశీలిస్తాం. రోహిత్ ఆరోగ్యాన్ని ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షిస్తున్నది. అతడు ఇంకా జట్టుకు దూరం కాలేదు. రోహిత్ జట్టుతో చేరేది లేనిది నిర్ణయించాల్సి నేను కాదు. పరీక్షలకు అనుగుణంగా అతడు జట్టులోకి వస్తాడు’ అని అన్నాడు. బుమ్రా సారథ్యంపై మాట్లాడుతూ ‘అధికారిక వర్గాల నుంచి సమాచారం వస్తే సరిగ్గా ఉంటుంది. సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్శర్మ నుంచి ఇంకా నిర్ణయం వెల్లడి కాలేదు. రోహిత్ ఆడేది లేనిది నేను నిర్ణయం తీసుకోలేను’ అని పేర్కొన్నాడు.
రోహిత్, రాహుల్ గైర్హాజరీలో చతేశ్వర్ పుజారా, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోహిత్కు బ్యాకప్గా మయాంక్ అగర్వాల్ను ఎంపిక చేసినా..తుది జట్టులో తీసుకోవడం అనుమానంగానే ఉంది. పుజారా, గిల్, కోహ్లీ, అయ్యర్, విహారి, పంత్తో బ్యాటింగ్ లైనప్ బరిలోకి దిగనుండగా, బుమ్రా, షమీ, సిరాజ్తో పాటు అశ్విన్, జడేజాలో ఒక్కరిని తీసుకునే చాన్స్ ఉంది. బౌలింగ్ ఆల్రౌండర్గా శార్దూల్ ఠాకూర్కు చోటు దక్కుతుందో లేదో చూడాలి.
అదే జట్టుతో: ఐర్లాండ్తో సిరీస్ ఆడిన జట్టునే ఇంగ్లండ్తో తొలి మ్యాచ్లో ఆడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తొలి టెస్టు జూలై 5న ముగియనుండగా, 7 నుంచి ఇంగ్లండ్తో తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. దీంతో ప్రధాన జట్టు ప్లేయర్లు మొదటి మ్యాచ్కు అందుబాటులో ఉండే చాన్స్ లేదు. మిగిలిన మ్యాచ్లకు స్టార్ ప్లేయర్లు జట్టుతో కలుస్తారని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఇంగ్లండ్తో మూడు టీ20లతో పాటు భారత్ మూడు వన్డేలు ఆడనుంది.