న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించినట్లు మహిళా రెజ్లర్లు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. బ్రిజ్ భూషణ్ అకృత్యాల గురించి అంతర్జాతీయ రెజ్లింగ్ రెఫరీ జగ్బీర్ సింగ్(Referee Jagbir Singh) కొన్ని కీలక ఆరోపణలు చేశాడు. గత ఏడాది లక్నోలో జరిగిన ఓ ఈవెంట్ సమయంలో.. బ్రిజ్ భూషణ్ ఓ మహిళా రెజ్లర్ను అనుచిత రీతిలో టచ్ చేసినట్లు పేర్కొన్నాడు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగ్బీర్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
బ్రిజ్ లైంగిక వేధింపులపై ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు సుమారు 200 మంది నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. పాటియాలాలో ఉన్న రెఫరీ జగ్బీర్ నుంచి కూడా మే 20వ తేదీన స్టేట్మెంట్ తీసుకున్నారు. గత ఏడాది మార్చి 25వ తేదీన లక్నోలో జరిగిన ఆసియా చాంపియన్షిప్ ట్రయల్స్ ముగింపు వేడుక సందర్భంగా జరిగిన ఫోటో సెషన్ సమయంలో బ్రిజ్ వేధించినట్లు ఓ మహిళా అథ్లెట్ తన రిపోర్టులో తెలిపింది. ఫోటో సెషన్ సమయంలో బ్రిజ్ అనుచిత రీతిలో అనుమతి లేకుండా తన పిరుదులపై చేయి వేసినట్లు ఆ అథ్లెట్ ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. అయితే బ్రిజ్ ఆ పనిచేసినట్లు ఇంటర్నేషనల్ రెఫరీ జగ్బీర్ కన్ఫర్మ్ చేశాడు. ఫోటో దిగకుండా ఆగ్రహంగా వెళ్లిపోతుంటే తన భుజాన్ని గట్టి పట్టి లాగేసినట్లు కూడా ఆమె ఆరోపించింది.
రెఫరీ జగ్బీర్ సింగ్ మరి కొన్ని ఉదంతాలను కూడా పోలీసులకు వెల్లడించారు. థాయిలాండ్లోని పుకెట్లో టోర్నీ జరిగిన సమయంలో.. ఓ డిన్నర్ ప్రోగ్రామ్లో బ్రిజ్ అభ్యంతరకంగా ప్రవర్తించినట్లు తెలిపాడు. తాగినమత్తులో మహిళా ప్లేయర్లను బ్రిజ్ వేధించినట్లు ఆరోపించాడు. రెజ్లింగ్ చీఫ్ ఆగడాలను తట్టుకోలేకపోయినట్లు వెల్లడించాడు. బ్రిజ్, అతని అనుచరులు తాగి వచ్చి మహిళా రెజ్లర్లను ఎక్కడపడితే అక్కడ తాకారని, బలవంతంగా హత్తుకున్నారని జగ్బీర్ ఆరోపించాడు.