లక్నో: దేశం తరపున చివరి మ్యాచ్ ఆడిన భారత వెటరన్ టెన్నిస్ ప్లేయర్ రోహాన్ బోపన్న విజయంతో కెరీర్ ముగించాడు. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్-2లో భాగంగా ఆదివారం మొరాకొతో జరిగిన పోరులో భారత్ 4-1తో ఘనవిజయం సాధించింది. శనివారం జరిగిన రెండు మ్యాచ్ల్లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. మిగిలిన మూడు మ్యాచ్లను భారత్ కైవసం చేసుకుంది.
మొదట జరిగిన పురుషుల డబుల్స్ పోరులో రోహాన్ బోపన్న-యూకీ బాంబ్రీ జోడీ 6-2, 6-1తో యూనస్-ఎలియాస్ జంటను చిత్తుచేసింది. అనంతరం పురుషుల సింగిల్స్లో సుమిత్ నాగల్ 6-3, 6-3తో యాసీన్పై గెలుపొందగా.. దిగ్విజయ్ ప్రతాప్ సింగ్ 6-1, 5-7, 10-6తో వాలిద్ అహూడాను మట్టికరిపించాడు. ఈ ప్రదర్శనతో భారత్ వరల్డ్ గ్రూప్-1 ప్లేఆఫ్స్ స్థాయికి అర్హత సాధించింది.
సుదీర్ఘ కాలంగా డేవిస్కప్ భారత జట్టులో సభ్యుడిగా ఉన్న 43 ఏండ్ల బోపన్న ఈ ‘టై’తో జాతీయ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మొరాకొపై విజయం అనంతరం బోపన్నను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు రోహాన్ను భూజాలపై ఎత్తుకొని కోర్టులో కలియతిరిగారు.