ఢాకా : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడిగా ఆ జట్టు మాజీ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ నియమితుడయ్యాడు. ఇటీవల కాలంలో వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచిన బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాంను తొలగించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం.. తమీమ్కు ఆ బాధ్యతలను అప్పగించింది. నిరుడు అక్టోబర్లో ముగిసిన బీసీబీ ఎన్నికల్లో అవకవతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల విచారణ కమిటీ అవి నిజమేనని తేల్చడంతో పాటు బోర్డు డైరెక్టర్ల ఎన్నిక సక్రమంగా జరుగలేదని తెలపడంతో అమినుల్కు ఉద్వాసన తప్పలేదు.
ఇదీగాక ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ మంకుపట్టు పట్టి టోర్నీ నుంచి వైదొలగడంలో తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు అసిఫ్ నజ్రుల్, అమినుల్ పాత్ర ఉన్నదని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం అతడిపై వేటు వేసి 11 మందితో కూడిన అడ్హక్ కమిటీని నియమించింది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా తమీమ్ వ్యవహరించనున్నాడు.