IND vs BAN : మొదటి టెస్టులో ఓటమి నుంచి తప్పించుకునేందుకు బంగ్లాదేశ్ పోరాడుతోంది. నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. షకిబుల్ హసన్ (40), మెహిదీ హసన్ మిరాజ్ (9) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. వీళ్లిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడడంతో చివరి సెషనల్ భారత బౌలర్లకు వికెట్ దక్కలేదు. దాంతో టీమిండియా 4 వికెట్ల దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్ గెలవాలంటే చివరిదైన ఐదో రోజు బంగ్లాదేశ్ 241 రన్స్ చేయాలి. ఇరు జట్లకు ఐదో రోజు తొలి సెషన్ కీలకం కానుంది.
నాలుగో రోజు కూడా బంగ్లా ఓపెనర్లు శాంటో, జకిర్ హసన్ భారత బౌలర్లను విసిగించారు. తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేసిన ఈ ఇద్దరూ శతక భాగస్వామ్యం నెలకొల్పారు. మొదటి వికెట్ కోసం భారత్ లంచ్ సెషన్ వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. శాంటోను 67 రన్స్ వద్ద అవుట్ చేసి ఉమేశ్ యాదవ్ భారత్కు తొలి వికెట్ అందించాడు. ఆరంగ్రేటం మ్యాచ్లోనే జకిర్ హసన్ సెంచరీ సాధించాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న అతను సెంచరీ తర్వాత అశ్విన్ బౌలింగ్లో వికెట్ సమర్పించుకున్నాడు. అక్షర్ పటేల్ 87వ ఓవర్లో ముష్ఫికర్ రహిం, నురుల్ హసన్ను అవుట్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్ 5 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్న కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.
మొదటి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 150కి ఆలౌట్ అయింది. ముష్ఫికర్ రహిం (28 రన్స్) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీశాడు. సిరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. దాంతో భారత్కు 221 పరుగుల అధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (110), వైస్ కెప్టెన్ పూజారా (102) సెంచరీలతో కదం తొక్కారు. 258 రన్స్ వద్ద కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. బంగ్లాదేశ్ ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.