హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియా హ్యాండ్బాల్ క్లబ్ లీగ్ చాంపియన్షిప్ హోరాహోరీగా సాగుతున్నది. ఆసియాలో అత్యుత్తమ క్లబ్ల మధ్య గచ్చిబౌలి స్టేడియం వేదికగా పోరు అభిమానులను ఆకట్టుకుంటున్నది. గురువారం ఆల్నజ్మా 31-25 తేడాతో మెస్ కిర్మణ్పై అద్భుత విజయంతో బోణీ కొట్టింది. ఆది నుంచే దూకుడు కనబరిచిన ఆల్నజ్మా తొలి అర్ధభాగం ముగిసేసరికి 14-10తో ఆధిక్యంలో నిలిచింది.
అదే జోరును కీలకమైన ద్వితీయార్ధంలోనూ కొనసాగిస్తూ పాయింట్లు కొల్లగొట్టింది. స్టార్ ప్లేయర్ అలీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మరో మ్యాచ్లో ఆల్కువైట్ 33-23తో ఆల్ వక్రాపై గెలిచింది. టోర్నీ రెండో రోజు మ్యాచ్లకు అంతర్జాతీయ హ్యాండ్బాల్ సంఘం ఉపాధ్యక్షుడు బదర్అలీ తీయాబ్, జాసిమ్ఆల్, హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్మోహన్రావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.