ఓస్లో: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ అన్షు మాలిక్ (57 కిలోలు) చరిత్ర సృష్టించింది. ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్కు వెళ్లిన తొలి భారత మహిళ రెజ్లర్గా రికార్డులకెక్కింది. బుధవారం జరిగిన మహిళల 57 కిలోల సెమీస్లో సొలొమియా వింక్ (ఉక్రెయిన్)ను 11-0తో చిత్తు చేసి అన్షు సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో భారత ఆశలు సన్నగిల్లుతున్న వేళ అన్షు ఏకంగా ఫైనల్కు వెళ్లి పతకం పక్కా చేసి ఆశలు చిగురింపజేసింది. 19 ఏండ్ల ఈ యువ రెజ్లర్ బౌట్లోకి దిగిన వెంటనే యూరోపియన్ జూనియర్ చాంపియన్ అయిన వింక్పై ఆధిపత్యం ప్రదర్శించింది. ఒక్క నిమిషంలోనే 2-0తో పైచేయి సాధించింది. ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ దీటుగా దాడి చేస్తూ స్కోర్ను పెంచుకుంటూ పోయింది. అన్షు ప్రతాపానికి వింక్ విలవిలలాడి స్కోర్ చేయకుండానే పరాజితురాలైంది. ఫైనల్లో డబుల్ ఒలింపిక్స్ విజేత హెలెన్ మరోలిస్ (అమెరికా)తో గురువారం తలపడనుంది.
అంతకుముందు క్వార్టర్ ఫైనల్లోనూ అన్షు వీరోచిత పోరాటం చేసింది. నిలుఫర్ రైమోవా (కజకిస్థాన్)పై 5-1 తిరుగులేని విజయం నమోదు చేసుకుంది. మరోవైపు సరిత మోర్ కూడా సత్తా చాటింది. లిండా మోరైస్ (కెనడా)ను 8-2తో ఓడించిన అనంతరం శాండ్రా పరజెవ్స్కీ (జర్మనీ)ను 3-1తో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్కు చేరింది. యూరోపియన్ చాంపియన్ జివ్కోవా డుయోదోవా (బల్గేరియా)తో పోరాడి ఓడింది. అన్షు చేతిలో ఓడిన వింక్కు మన రెజ్లర్ సరిత మోర్ (59 కిలోలు)కు మధ్య కాంస్య పతక పోరు జరుగనుంది.