ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సత్తుపల్లి, మార్చి 12: బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్ష నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు. ఓటు అడగడానికి వారికి ముఖం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నదన్నారు. తాజాగా విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నదన్నారు. నిరుద్యోగుల పొట్టగొట్టే బీజేపీకి ఓటు అడిగే హక్కులేదన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ఇప్పటివరకు ఎన్ని కొలువులు ఇచ్చారో లెక్క తేల్చాలన్నారు. సీఎం కేసీఆర్ కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. గురుకులాలను బలోపేతం చేశారన్నారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీతారామప్రాజెక్టునూ త్వరలో పూర్తిచేస్తారన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు మట్టా దయానంద్ విజయ్కుమార్, మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, ఉమామహేశ్వరరావు, చాంద్పాషా, రఘు, రఫీ, సాగర్, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
పల్లాకు ఓటు వేయండి
సత్తుపల్లి రూరల్, మార్చి 12: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జర్నలిస్టులను కోరారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టులకు బ్యాలెట్ నమూనా పత్రం చూపుతూ ఓటు అభ్యర్థించారు. జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మాదిరాజు సుధాకర్, ఖాదర్, బాలకృష్ణ, షైబుద్దీన్, త్రిమూర్తులు పాల్గొన్నారు.