శ్రీహరికోట : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని షార్ నుంచి ఆర్హెచ్- 560 సౌండింగ్ రాకెట్ను శుక్రవారం రాత్రి నింగిలోకి పంపింది. ఈ మేరకు ఇస్రో అధికారిక ఖాతా ట్వీట్ చేసింది. రాకెట్ వివిధ ఎత్తుల్లోని తటస్థ గాలుల్లో తేడాలు, ప్లాస్మా గతిశాస్త్ర వివరాలను తెలుసుకునేందుకు ఈ ప్రయోగాన్ని చేసినట్టు ఇస్రో వెల్లడించింది. సౌండింగ్ రాకెట్లను అంతరిక్ష పరిశోధనల కోసం.. పర్యావరణంలోని వాతావరణ వివరాలను తెలుసుకునేందుకు ప్రయోగిస్తుంటారు. ఇవి ఒకటి లేదా రెండు దశలుండే ఘన ఇంధన రాకెట్లు. వాహక నౌకలు, ఉపగ్రహాల్లో వాడే ఉప వ్యవస్థలు లేదా కొత్త పరికరాల ప్రొటోటైప్ల పనితీరును తెలుసుకునేందుకు సౌండింగ్ రాకెట్లను వినియోగిస్తుంటారు. ఇస్రో 1965 నుంచి దేశీయంగా తయారుచేసిన రాకెట్లను ప్రయోగించడం ప్రారంభించింది. ప్రస్తుతం ఇస్రో వద్ద మూడు రకాల సౌండింగ్ రాకెట్లున్నాయి. ఇందులో ఆర్హెచ్ 200, ఆర్హెచ్ 300 మార్క్2, ఆర్హెచ్ 560 మార్క్ 2 రాకెట్లు ఉన్నాయి. ఇవి 80 నుంచి 100 కిలోల వరకు పేలోడ్లను మోసుకెళ్లగలవు. 80 కిలోమీటర్ల నుంచి 475 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించగలవు.