Flipkart | సాధారణంగా ఫ్లిప్కార్ట్ అనేది ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ఈకామర్స్ ప్లాట్ఫామ్. కానీ.. ఇక నుంచి ప్లిఫ్కార్ట్లో పాత ఫోన్లు, వాడిన ఫోన్లు అమ్మేయచ్చు. అవును.. ఫ్లిప్కార్ట్ తాజాగా న్యూ సెల్ బ్యాక్ అనే కొత్త ప్రోగ్రామ్ను లాంచ్ చేసింది.
ఈ ప్రోగ్రామ్ ద్వారా కస్టమర్లు తమ ఫోన్లను ఫ్లిప్కార్ట్లో అమ్మేయొచ్చని ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. అయితే.. ఈ ప్రోగ్రామ్ను ఫ్లిప్కార్ట్ ప్రారంభించడం వెనుక ఉన్నది యంత్ర అనే ఎలక్ట్రానిక్స్ రీ కామర్స్ సంస్థ. యంత్రను ఇటీవల ఫ్లిప్కార్ట్ సొంతం చేసుకుంది. యంత్ర వెబ్సైట్లోకి వెళ్లి కూడా వాడిన ఫోన్లను అమ్ముకోవచ్చు. ఇప్పుడు యంత్ర సంస్థ ఫ్లిప్కార్ట్ సొంతం కావడంతో.. ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ద్వారా వాడిన ఫోన్ల కొనుగోళ్లను ఫ్లిప్కార్ట్ త్వరలో ప్రారంభించనుంది.
ప్రస్తుతానికి స్మార్ట్ఫోన్లను మాత్రమే ఫ్లిప్కార్ట్ ద్వారా అమ్మేయొచ్చు. త్వరలోనే ఇతర వస్తువులను కూడా కస్టమర్లు అమ్ముకునే సౌకర్యాన్ని ఫ్లిప్కార్ట్ కల్పించనుంది. ఏ బ్రాండ్ స్మార్ట్ఫోన్ అయినా సరే.. దేశంలో ఎక్కడున్నా సరే.. తమ ఫోన్ను అమ్ముకునే చాన్స్ను ఫ్లిప్కార్ట్ కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా 1700 పిన్కోడ్స్ ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రోగ్రామ్ను లాంచ్ చేయనుంది. ఒకసారి కస్టమర్ తమ ఫోన్ను అమ్మేశాక.. ఫ్లిప్కార్ట్ ఒక ఈవోచర్ను అందిస్తుంది.
ఫోన్కు సంబంధించిన మూడు ప్రశ్నలను మాత్రమే ఫోన్ను అమ్మే సమయంలో ఫ్లిప్కార్ట్లో అడుగుతారు. వాటికి సమాధానాలు చెప్పి.. కస్టమర్ తమ ఫోన్ బ్రాండ్, మోడల్ను కన్ఫమ్ చేసిన తర్వాత 48 గంటల్లో ఫ్లిప్కార్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంటికే వచ్చి ఫోన్ను కలెక్ట్ చేసుకుంటారు. ఫోన్ను ఎగ్జిక్యూటివ్ రిసీవ్ చేసుకున్న తర్వాత కస్టమర్కు ఫ్లిప్కార్ట్ ఈవోచర్ను పంపిస్తుంది. ఆ ఈవోచర్ ద్వారా ఫ్లిప్కార్ట్లో కొత్త ఫోన్ తీసుకోవచ్చు. లేదా ఇతర ప్రొడక్ట్స్ ఏవైనా కొనుగోలు చేయొచ్చు.
ఇటీవల జరిగిన ఓ సర్వే ప్రకారం.. భారత్లో సంవత్సరానికి 125 మిలియన్ల ఫోన్లను ఇండియన్స్ కొనుగోలు చేస్తున్నారట. అంటే 12.5 కోట్ల ఫోన్లు అన్నమాట. అందులో 20 మిలియన్ ఫోన్లు అంటే 2 కోట్ల ఫోన్లు సెకండ్ హ్యాండ్ మార్కెట్కు వెళ్తున్నాయట. మిగితా ఫోన్లు ఈ వేస్ట్ కింద జమ అవుతున్నాయట.