Twitter : ట్విట్టర్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఎలన్ మస్క్ ప్రయత్నిస్తున్న సమయంలో యూజర్లకు పెద్ద షాక్. ఈమధ్యే దాదాపు 50 కోట్లమంది వాట్సాప్ యూజర్ల డేటాను ఆన్లైన్ అమ్మకానికి పెట్టిన హ్యాకర్లు తాజాగా ట్విట్టర్లోనూ భారీగా డేటా చోరీకి పాల్పడ్డారు. ఇంటర్నెట్ బగ్ సాయంతో దాదాపు 50.4 లక్షల మంది ట్విట్టర్ యూజర్ల డేటాను దొంగిలించారు. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ద్వారా మరో 10 లక్షల మంది యూజర్ల వ్యక్తిగత వివరాలను కాజేశారని బ్లీపింగ్ కంప్యూటర్ అనే వెబ్సైట్ ఒక నివేదికలో తెలిపింది.
ట్విట్టర్ యూజర్ల ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్లను ‘హ్యాకర్వన్బగ్ బౌంటీ ప్రోగ్రామ్’ అనే ఆన్లైన్ వేదికలో అమ్మకానికి పెట్టారు. 2021 డిసెంబర్లో డేటాను కాజేశారని బ్లీపింగ్ కంప్యూటర్ నివేదిక వెల్లడించింది. అయితే.. డేటా చోరీ గురించి ట్విట్టర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ చాడ్ లోడర్ ముందుగానే హెచ్చరించాడు. కానీ, అతడి మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు.
‘అమెరికా, యూరప్ దేశాలకు చెందిన ట్విట్టర్ యూజర్ల డేటా చోరీకి గురవడం నేను ఈమధ్య గమనించాను. హ్యాకర్ల బారిన పడిన కొందరు యూజర్లతో మాట్లాడాను. తమ వివరాలను హ్యాకర్లు కాజేశారని వాళ్లు చెప్పారు’ అంటూ లోడర్ పై అధికారులకు ఒక పోస్ట్ పంపాడు. కానీ, వాళ్లు లోడర్ పోస్ట్ను సీరియస్గా తీసుకోక పోగా అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తీసేశారు.