న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చాట్జీపీటీ (ChatGPT)కి టెక్ ప్రపంచంలో విశేష ఆదరణ లభిస్తుండటంతో ఏఐ టూల్స్పై హాట్ డిబేట్ సాగుతోంది. ఏఐ టూల్స్తో వాణిజ్య ముఖచిత్రమే మారనుండటంతో ఈ రంగంలో నిపుణులకు భారీ డిమాండ్ నెలకొంది. చాట్జీపీటీ నిపుణుల కోసం కంపెనీలు అన్వేషణ సాగిస్తున్నాయి. సమర్ధులైన చాట్జీపీటీ నిపుణులకు ఏడాదికి రూ. కోటిన్నర వరకూ ఆఫర్ చేసేందుకు కంపెనీలు సంసిద్ధంగా ఉన్నాయి.
చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్ మనుషుల కంటే వేగంగా మానవ తరహాలో అనేక పనులు చక్కబెడుతుండటంతో ఉద్యోగుల స్ధానంలో ఏఐ టూల్స్ను వినియోగించేందుకూ కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. టెక్నాలజీ రంగంలో చాట్జీపీటీ అవసరం పెరుగుతుండటంతో ఏఐ చాట్బాట్ను ఉపయోగించే నిపుణులకు పెద్దసంఖ్యలో కొలువులు అందుబాటులోకి వస్తున్నాయి. ఉద్యోగ ఖాళీలున్న కంపెనీల్లో 91 శాతం కంపెనీలు చాట్జీపీటీ నైపుణ్యాలున్న ప్రొఫెషనల్స్ను నియమించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని రెజ్యూమ్బిల్డర్ చేపట్టిన అధ్యయనం వెల్లడించింది.
ఏఐతో ఉత్పాదకత పెరగడంతో పాటు సమయం ఆదా కావడం, కంపెనీ సామర్ధ్యం మెరుగవడం వంటి సానుకూల ఫలితాలు ఉంటాయని సర్వేలో పాల్గొన్న ప్రతినిధులు చెప్పుకొచ్చారు. లింక్డిన్లో పలు కంపెనీలు చాట్జీపీటీ నిపుణులకు ఏకంగా ఏడాదికి రూ. కోటిన్నర చెల్లించేందుకూ సిద్ధమయ్యాయి. ఉదాహరణకు అమెరికాకు చెందిన ఓ హెచ్ఆర్ కంపెనీ చాట్జీపీటీ, మిడ్జర్నీ వంటి ఏఐ టూల్స్పై పట్టున్న అభ్యర్ధులు సీనియర్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ పోస్టుకు అవసరమని ఏడాదికి రూ. కోటి నుంచి రూ. కోటిన్నర వరకూ వార్షిక వేతనం చెల్లిస్తామని వెల్లడించింది. మరో టెక్ కంపెనీ ఇంటర్ఫేస్.ఏఐ రిమోట్ మెషీన్ ఇంజనీర్కు రూ. కోటిపైన వార్షిక వేతనం చెల్లించేందుకు సిద్ధమైంది.
Read More :
Telangana IT | తెలంగాణలో మారుమూల పట్టణాలకు కూడా దారులు వెతుక్కున్న ఐటీ తీగలు