న్యూఢిల్లీ: ఈ విశ్వం గురించి అంతుబట్టని రహస్యాలను తెలుసుకోవడానికి ఖగోళ శాస్త్రజ్ఞులు తోక చుక్కలపై ఆధారపడతారు. అందుకే ఆ అతిథుల కోసం ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఇప్పుడు సైంటిస్టులు అనుకోని అతిథిని గుర్తించారు. అది బయటి నక్షత్ర మండలం నుంచి మన సౌర కుటుంబంలోకి దూసుకొస్తున్న తోక చుక్క.
నిజానికి ఇది సాధారణ తోక చుక్కల కంటే కూడా చాలా పెద్దగా ఉన్నట్లు తేల్చారు. 2014 యూఎన్271గా పిలుస్తున్న ఈ తోక చుక్క సూర్యుడికి దగ్గరగా వెళ్లనుంది. మన శని గ్రహ కక్ష్యలోకి కూడా 2031లో వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. 2014 నుంచి 2018 మధ్య డార్క్ ఎనర్జీ సర్వేలో ఈ తోక చుక్కను తొలిసారి చూశారు. దీని వెడల్పు 100 నుంచి 370 కిలోమీటర్లు ఉంది.
6 లక్షల ఏళ్ల కక్ష్య
2014లో తొలిసారి దీనిని చూసినప్పుడు అది సూర్యుడికి 29 ఆస్ట్రోనామికల్ యూనిట్స్(ఏయూ) దూరంలో ఉంది. ఒక ఏయూ అంటే భూమికి, సూర్యుడికి మధ్య దూరం. తాజాగా చూసినప్పుడు అది 7 ఏయూలు ప్రయాణించి ప్రస్తుతం సూర్యుడికి 22 ఏయూల దూరంలో ఉంది. అంటే ఇది నెప్ట్యూన్ గ్రహం కంటే కూడా దగ్గరగా వచ్చేసింది. సూర్యుడికి 10.9 ఏయూల దూరం నుంచి ఇది వెళ్లనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
అయితే ఈ భారీ తోకచుక్క కక్ష్య ఆశ్చర్యపరుస్తోంది. ఇది సౌర కుటుంబం లోపలి నుంచి నక్షత్ర మండలం సరిహద్దులోని ఊర్ట్ మేఘం వరకూ విస్తరించి ఉంది. అంటే సుమారు 6,12,190 ఏళ్లు. ప్రస్తుతం ఓ చిన్నసైజు గ్రహంలా కనిపిస్తున్న ఇది.. శని గ్రహ కక్ష్యను దాటి సూర్యుడికి దగ్గరవుతున్న కొద్దీ పూర్తిగా తోకచుక్కలా మారిపోతుందని వాళ్లు చెప్పారు. ఈ తోక చుక్కను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికే అన్ని అబ్జర్వేటరీలు, టెలిస్కోపులను సిద్ధం చేసి ఉంచారు.