తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం భగవద్ రామానుజులవారి సన్నిధిలో జీయర్ స్వాములు సాత్తుమొర నిర్వహిస్తారు. భగవద్ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ‘శ్రీభాష్యం’ పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు. భాష్యకారుల ఉత్సవాల మొదటిరోజున ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.