ఆదిబట్ల, నవంబర్ 27 : పాఠశాల స్థాయిలో బాలికలకు భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. దీంట్లో భాగంగా పాఠశాలల్లో బాలిక సాధికారత సంఘాలు (క్లబ్లు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో 92 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. దీంతో విద్యాశాఖ అధికారులు జిల్లాలో 20 కేజీబీవీలు, 72 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో క్లబ్లను ఏర్పాటు చేశారు.
బాలికలకు భరోసాగా కమిటీలు
పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసిన బాలిక సాధికారత కమిటీలు బాలికల భద్రతకు భరోసాను కల్పించనున్నాయి. పాఠశాలలతోపాటు బయట కూడా ఎలాంటి వేదింపులకు గురైనా కూడా ఈ కమిటీలు చర్చించవచ్చు. ఈవ్ టీజింగ్, అనుచిత ప్రవర్తన, తిట్టడం, బెదిరించడం, లైంగిక వేదింపులకు గురి చేయడం వాటి నుంచి బాలికలకు రక్షణ కల్పించడంతో పాటు బాలికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో చదువుకోవడానికి ఈ కమిటీలు ఎంతో దోహదపడుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కమిటీల పనితీరు ఇలా..
ప్రతి స్కూల్లో హెడ్మాస్టర్ కమిటీ చైర్మన్గా, కన్వీనర్గా కూడా ఉంటారు. గర్ల్ చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్ సభ్యురాలిగా ఆమెతోపాటు 10 నుంచి 12 ఏండ్ల వయస్సు గల బాలికలు ప్రతి సెక్షన్ నుంచి ఇద్దరు చొప్పున ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు స్థానిక పోలీస్స్టేషన్కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్, షీ టీం ఇన్చార్జి సభ్యులుగా ఉంటారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ దీనికి చైర్మన్గా ఉండి ఎప్పటికప్పుడు సంఘాలను పర్యవేక్షిస్తుంటారు.
కమిటీలు చేయాల్సిన పనులు
ప్రతి నెలా విద్యార్థినులతో సమావేశాలు నిర్వహించడం.. విద్యార్థినుల్లో కౌమార దశలో వచ్చే శారీరక మార్పుల గురించి తెలియజేయడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తారు. లింగ సమానత్వంపై కూడా శిక్షణ ఇవ్వనున్నారు. కౌమార దశలోనే బాలికలకు హక్కుల గురించి కూడా తెలియ జేస్తారు. ఏదైనా ఘటన జరిగితే వెంటనే విశ్వాసాన్ని నింపుతాయి. ఇలా ప్రతి నెలా సమావేశాలు నిర్వహించి స్కూల్ బయట, లోపల జరిగిన సంఘటనలు, బాలికలు ఎదుర్కునే సమస్యలపై చర్చించడంతోపాటు అన్ని విషయాలను ఫ్రెండ్లీ టీచర్ ద్వారా విద్యార్థినులు పంచుకునేలా కమిటీలు పనిచేయనున్నాయి.
బాలికల్లో ధైర్యం నింపేలా..
బాలికల్లో ధైర్యం నింపేలా పాఠశాలల్లో సాధికారత కమిటీలు ఏర్పాటు చేశాం. బాలికలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా ఫ్రెండ్లీ టీచర్ ద్వారా చర్చించవచ్చు. విద్యార్థుల్లో మానసిక ైస్థెర్యాన్ని పెంపొందించేలా కమిటీలు దోహదపడుతాయి. తద్వారా బాలికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో చదువుకునేందుకు అవకాశం లభించనుంది.
బాలికల రక్షణకు ప్రత్యేక చర్యలు
బాలికల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. వారి భద్రత కోసమే బాలికల సాధికారత సంఘాలను ఏర్పాటు చేశాం. బాలికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పాఠశాలల్లో చదువుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి సమస్య ఎదురైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాం.