షాబాద్, జూలై 11: జిల్లాలో ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్ డివిజన్లలో ఉదయం నుంచి ఆకాశం మబ్బులతో కమ్ముకున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముసురు కురిసింది. కేశంపేట్, ఆమనగల్, కడ్తాల్ మండలాల్లో భారీ వర్షాలు పడడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. షాబాద్ మండలం నాగరగూడ, వెంకటాపూర్ ఈసీ వాగు పారింది.
ఈసీ వాగులోకి వరద..
మొయినాబాద్, జూలై 11 : ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఈసీ వాగులోనికి వరద నీరు వచ్చి చేరింది. శనివారం రాత్రి ఎగువ ప్రాంతాలైన చేవెళ్ల, షాబాద్, పరిగి, పూడురు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద నీరు ఈసీ వాగుకు వరద వచ్చింది. మొయినాబాద్ మండల పరిధిలోని నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, వెంకటపూర్ గ్రామాల రెవెన్యూను తాకుతూ ఉన్న ఈసీ వాగు ప్రహించింది. ఈ సీజన్లో మొదటి సారి వాగులోనికి వరద నీరు వచ్చి చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కేశంపేటలో భారీ వర్షం
కేశంపేట, జూలై 11 : మండలంలోని గ్రామాల్లోని శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మండలంలోని భైర్ఖాన్పల్లి, ఎక్లాస్ఖాన్పేట, అల్వాల పరిధిలో భారీగా వర్షం కురవడంతో అల్వాల, కేశంపేట, లేమామిడి, నిర్దవెళ్లి, తొమ్మిదిరేకుల గ్రామాల మీదుగా ఉన్న వాగు పొంగిపొర్లింది. వాగు సాగడంతో ఆయా గ్రామాల ప్రజలు, అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాగును చూసేందుకు యువకులు, రైతులు తరలివచ్చారు. మండలంలో 74.1 ఎంఎం వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
యాచారంలో..
యాచారం, జూలై 11 : మండలంలో ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా మండల కేంద్రంలో సుమారు రెండుగంటల పాటు వర్షం కురిసింది. మండలంలోని చౌదర్పల్లి, గాండ్లగూడ, మేడిపల్లి, నానక్నగర్, మొండిగౌరెల్లి, తక్కళ్లపల్లి, గున్గల్ కొత్తపల్లి, మాల్, తమ్మలోనిగూడ, మల్కీజ్గూడ గ్రామాల్లో భారీ వర్షం కురువడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటలు నిండి భూములన్నీ సస్యశ్యామలం కావాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.
కడ్తాల్లో..
కడ్తాల్, జూలై 11 : మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజాము భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు సగం వరకు నిండాయి. గ్రామాల్లోని కాలనీలు జలమయం అయ్యాయి. మండలంలో విస్తారంగా వాన కురుస్తుండటంతో భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.