వికారాబాద్ : జిల్లాలో అక్రమ రవాణాను అరికట్టుటకు నాకాబంది ఏర్పాటు చేస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమ ఇసుక, రేషన్ బియ్యం రవాణా, ప్రభుత్వ నిషేద గుట్కా, గంజాయి, రాత్రి సమయంలో దొంగతనాలు, పేకాట, మట్కా, అసాంఘీక కార్యకలాపాలపై నాకాబందీ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపడం జరుగుతుందన్నారు. జిల్లాలో నెలకు రెండు లేదా మూడు సార్లు ఈ నాకాబందీ ఏర్పాటు చేయాలన్నారు. దీని కోసం కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిర్వహించడం జరుగుతుందన్నారు.
జిల్లా పోలీసు అధికారులు ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చని, జిల్లా ప్రజలందరూ తమ వాహనాలకు సంబంధించిన పత్రాలను, గూడ్స్ వాహనాలకు సంబంధించిన పత్రాలను అందుబాటులో పెట్టుకోవాలని తెలపారు. జిల్లాలో ఇదివరకే మోమిన్పేట, కరణ్కోట్, బషీరాబాద్, పెద్దేముల్, యాలాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మున్సిపాలిటీలోని పోలీస్ స్టేషన్లలో నాకాబందీ నిర్వహించి సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడం జరిగిందని గుర్తు చేశారు. అనుమానాస్పదంగా రాత్రి సమయంలో తిరిగిన, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందన్నారు.
మొదటిసారి నాకాబందీ చేసి వికారాబాద్టౌన్లో 133, కరణ్కోట్లో 79, బషీరాబాద్లో 32, పెద్దేముల్లో 30, యాలాలలో 70 మొత్తం 344 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు ప్రాంతాల్లో నిర్వహించగా మొత్తం 429 వాహనాలను తనిఖీ చేసి, 16వాహనాలను సీజ్ చేయడం జరిగిందని వివరించారు. నాకాబందీలో పట్టుబడిన వాహనాలు వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, ఏమైన అనుమానం కలిగితే పోలీసులకు, 100కు ఫోన్ చేయాలని సూచించారు.