బొంరాస్పేట, మార్చి 1 : దుద్యాల మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ జాతరలో శుక్రవారం ప్రధాన ఘట్టమైన సిడె కార్యక్రమం శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. మమ్మల్ని చల్లంగా చూడు ఎల్లమ్మ తల్లీ.. అంటూ భక్తుల కేరింతలు, జయ జయ ధ్వానాలు చేశారు. మేళతాళాలు, డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో సిడె కార్యక్రమం శోభాయమానంగా జరిగింది. జల్ది ఉత్సవంలో భాగంగా దేవాలయంలోని అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఉంచి గుడికి సమీపంలో ఉన్న బావి దగ్గరికి మేళతాళాలు, కొమ్ము వాయిద్యాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లారు.
అక్కడ బావిలో విగ్రహానికి స్నానం చేయించిన తరువాత మళ్లీ గుడికి చేరుకున్నారు. గుడి ముందు కుంభం పోసిన తరువాత ఆలయ కమిటీ చైర్మన్ ఏదుల జయరాములు, మేనేజరు రాజేందర్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించిన రథానికి ఉన్న పొడవైన స్తంభానికి చివరన ఏర్పాటు చేసిన తొట్టెలలో ఉంచి ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయించారు. ఈ సమయంలో అమ్మవారి రథాన్ని లాగడానికి భక్తులు వేల సంఖ్యలో పోటీ పడ్డారు. సిడె తిరుగుతున్న సమయంలో మహిళలు, పురుషులు సవారి నిండి ముందు నడిచారు. భక్తులు వేపాకు, పసుపు, గవ్వలు కలిపిన గవ్వల భండారును అమ్మవారిపైకి విసిరారు. కింద పడిన గవ్వలను తీసుకోవడానికి కూడా భక్తులు పోటీ పడ్డారు.
సిడె కార్యక్రమాన్ని తిలకించడానికి ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు పొరుగు జిల్లాలు, మహారాష్ట్రలోని షోలాపూర్, భీవండి, గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్ల నుంచి రెండు లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారు. సిడె జరిగినంత సేపూ ఆలయం కనుచూపు మేరలో ఇసుకేస్తే రాలనంత జనం కనిపించారు. అమ్మవారికి బోనాలు, మేకపోతులు, కోడి పుంజులతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించి కోనేరులో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు జాతర ప్రాంగణంలో విడిది చేశారు. అమ్మవారి దర్శనభాగ్యంతో భక్తులు తన్మయత్వం చెందారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఎల్లమ్మ జాతరకు ఆర్టీసీ వారు కోస్గి, తాండూరు, పరిగి, నారాయణపేట డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు. షోలాపూర్ నుంచి తాండూరు బస్సు స్టేషన్ కిటకిటలాడింది. కొందరు భక్తులు ప్రైవేటు వాహనాలు, బండ్లపై వచ్చారు. తాగునీటి సమస్య రాకుండా ఆలయ కమిటీ ట్యాంకర్లను ఏర్పాటు చేసింది. వైద్యాఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.