మొయినాబాద్ : గర్బిణులు, బాలింతలు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు గ్రామంలో పోషకాహార వారోత్సవాల్లో భాగంగా బుధవారం గ్రామ సర్పంచ్ గునుగుర్తి స్వరూపతో కలిసి గర్బిణులకు శ్రీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నక్షత్రం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్బిణులకు, బాలింతలకు మంచి పోషకాహారం అందతుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వారి కోసం ఆరోగ్యలక్ష్మి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. అదే విధంగా మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో చేవెళ్ల ప్రాజెక్టు సీడీపీవో శోభారాణి, సూపర్వైజర్ భారతిరత్నం, అంగన్వాడీ టీచర్ అనుసూజలు గర్బిణులకు శ్రీమంతాలు చేశారు.
ఈ సందర్భంగా సీడీపీవో శోభారాణి మాట్లాడుతూ పోషకాహారం తీసుకోవడంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటూ కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రభుత్వ దవాఖానలో కాన్పు అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవాలని, బిడ్డకు జన్మనిచ్చిన అర గంట లోపు ముర్రు పాలు బిడ్డకు పట్టించాలని సూచించారు. ముర్రు పాలతో బిడ్డకు రోగ నిరోదక శక్తి పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అనుసూజ, భవిష్యవాణి, అమరావతి, చంద్రిక, సురేఖ, అంజు, వార్డు సభ్యులు భవాని, అంజమ్మ పాల్గొన్నారు.