మంచాల : వరుణుడు కరుణించి సకాలంలో వర్షాలు కురియడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. దీంతో వ్యవసాయ బోరు బావుల్లోకి పెద్ద ఎత్తున నీరు రావడంతో వానకాలం పంటను భారీగా సాగు చేశారు. మంచాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న బోరుబావుల కింద సుమారు 4వేల ఎకరాల్లో వరి సాగు చేయడంతో ఎటు చూసిన పచ్చని పొలాలతో కనువిందు చేస్తున్నాయి. రెండు సంవత్సరాల క్రితం వర్షాలు సమృద్ధిగా కురియకపోవడంతో వరి సాగుపై రైతులు మక్కువ చూపలేదు.
ఈ వానకాలం పంటకు అనుకున్న స్థాయిలో వర్షాలు కురియడంతో అధిక మొత్తంలో వరి సాగు చేశారు. ప్రతి రైతుకు పంటసాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ. 5వేల చొప్పున పంటపెట్టుబడి సాయం అందజేస్తుంది. సబ్సిడీపై ఎరువుల, విత్తనాలను వ్యవసాయ బావులకు 24గంటల ఉచిత విద్యుత్ను అందజేస్తున్నది. గతంలో కంటే ఈసారి మండలంలో అత్యధిక స్థాయిలో వరి సాగు చేయడంతో మండలంలోని ఎల్లమ్మతండా నుంచి లోయపల్లి వరకు పచ్చని పొలాలతో కనుచూపు మేరలో చూపరులకు కనువిందు చేస్తున్నాయి. పంటపొలాలను చూస్తూ రైతన్నలు ఆనందంతో మురిసిపోతున్నారు. మంచాల మండలంలో 3వేల వ్యవసాయ బావుల కింద 4వేల 2వందల ఎకరాల వరి పంటతో పాటు ఇతర పంటలను సాగుచేశారు.