ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత వినియోగదారులను వేధిస్తున్నది.సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల ఎదుట ఖాళీ సిలిండర్లతో పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ కొరత లేదంటూ ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే, హైదరా బాద్లోని చాలా బంకులలో పెట్రోల్, డీజిల్ లేదని నో స్టాక్ బోర్డులను ఏర్పాటు చేయడం తో దాని ప్రభావం హైదరాబాద్ శివారులోని బంకులపై పడింది.
ఈ నేపథ్యంలోనే గత రెం డు రోజులుగా ఉమ్మడి జిల్లాలోని బంకులకు వాహనాలు క్యూ కడుతున్నాయి. బుధవారం ఉదయం నుంచే మొయినాబాద్, శంకర్పల్లి, తుర్కయాంజాల్, ఇంజాపూర్తోపాటు పలు ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకులకు వెహికిల్స్ బారులుతీరాయి. క్యూలైన్లు కిలోమీటర్ల మేర ఉన్నా వాహనదారులు అప్పటివరకు నిరీక్షించి వాహనాల్లో ట్యాంక్ ఫుల్ చేయించుకోవడం తోపాటు డబ్బాల్లోనూ పెట్రోల్, డీజిల్ను నింపుకెళ్తున్నారు. ఇంజాపూర్లోని బంకు దగ్గరు పెద్ద ఎత్తున వాహనాలు లైన్లో ఉండడంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ను నియంత్రించారు.

రంగారెడ్డి, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఓ వైపు ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉన్నది. ఇంధనం కోసం బుధవారం ఉదయం నుంచే పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు వేలాదిగా బారులు తీరారు. కొంతమంది వాహనదారులు రోజంతా నిరీక్షించినా పెట్రోల్, డీజిల్ దొరక్కపోవడంతో వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేసి ఇండ్లకు, ఆఫీసులకు వెళ్లిపోయారు. బంకులకు పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు రాకపోవటంతో అనేక చోట్ల బంకులు మూతపడ్డాయి. ముఖ్యంగా హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్-నాగార్జునసాగర్, హైదరాబాద్-శ్రీశైలం, హైదరాబాద్ -బెంగళూరు రహదారులపై ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వందలాది వాహనాలు బారులు తీరాయి. మరోవైపు సీఎన్జీ(గ్యాస్) కోసం ఆటోలు, కార్లు కిలోమీటర్ల మేర క్యూలో నిలిచినా దొరుకని పరిస్థితి ఏర్పడింది.
కదలని వాహనాలు..
జిల్లా పరిధిలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో నడిచే బస్సులు డీజిల్ కొరతతో అవి బయటికి వెళ్లకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాల్సి వచ్చింది. అలాగే, పలు ప్రాంతాల నుంచి నగరానికి పాలు, కూరగాయలను తీసుకెళ్లే వాహనాలు కూడా డీజిల్ కొరతతో రోడ్డెక్కలేని పరిస్థితి ఏర్పడింది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన గూడ్స్ వాహనాలూ పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
ఆగిన సరఫరా..
జిల్లాలోని పలు బంకులకు సకాలంలో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు రాకపోవటంతో అవి మూతపడ్డాయి. జిల్లా పరిధిలోని జాతీయ రహదారులతోపాటు అంతర్రాష్ట్ర రోడ్లపై ఉన్న బంకులు గత మూడు నాలుగు రోజులుగా తెరుచుకోవటంలేదు. ఈ బంకులకు నాలుగైదు రోజులకు ఒక ట్యాంకర్ డీజిల్, పెట్రోల్ మాత్రమే వస్తుండగా.. ఆ ఇంధనం వచ్చిన గంటలోపే అయిపోతున్నదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. పెట్రో ల్, డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
