బొంరాస్పేట, ఫిబ్రవరి 21 : ఈ ఏడాది ఏప్రిల్లో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల్లో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా గిరిజన సంక్షేమాధికారి(డీటీడబ్ల్యూవో) కోటాజీ అన్నారు. మంగళవారం మండలంలోని బొట్లవానితండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఒక ఆల్ ఇన్ వన్ బుక్, రెండు స్పెషల్ నోట్ బుక్కులు, కెరీర్ గైడెన్స్, ఒక గడియారం, క్యాలికులేటర్, పెన్నులు, పెన్సిళ్లు, రైటింగ్ ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోటాజీ మాట్లాడుతూ.. బొట్లవానితండా ఆశ్రమ పాఠశాల విద్యార్థులు గత మూడేండ్లుగా వందశాతం ఉత్తీర్ణత సాధిస్తూ వస్తున్నారని.. దీనిని ఈ ఏడాది కూడా అలాగే కొనసాగించాలన్నారు. ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో కనీసం ఐదుగురు బాలికలు 10 జీపీఏ గ్రేడు సాధించాలని తెలిపారు. వార్షిక పరీక్షల్లో చేసిన మార్పులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థినులు బాగా చదువుకోవాలన్నారు. బుధవారం నుంచి జరిగే ప్రీ-ఫైనల్-1 పరీక్షలకు కూడా సిద్ధం కావాలని కోటాజీ సూచించారు. పదిలో మంచి ఫలితాలు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేకంగా అల్పాహారం అందిస్తున్నామని.. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక తరగతుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, ఏ ఒక్క విద్యార్థి కూడా పరీక్షల్లో వెనుకబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్ఎం విక్రంసింగ్ రాథోడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
10 జీపీఏ వచ్చినవారికి రూ.5116
బొట్లవానితండా ఆశ్రమ పాఠశాల హెచ్ఎం విక్రంసింగ్ రాథోడ్ పదో తరగతి విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. ఏప్రిల్లో జరిగే ఎస్సెస్సీ వార్షిక పరీక్షల్లో పాఠశాల నుంచి ఎంత మంది విద్యార్థినులు 10 జీపీఏ మార్కులు సాధిస్తే అంతమందికి రూ.5116 చొప్పున నగదు బహుమతి అందజేస్తానని ప్రకటించారు.