సిటీబ్యూరో, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ): నగరంలోని నాంపల్లిలో నిర్మిస్తున్న పూర్తి స్థాయి ఆటోమేటెడ్, కంప్యూటరైజ్డ్ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ (ఎంఎల్పీ) పనులు దాదాపు పూర్తికావచ్చాయని, త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తామని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన మెట్రో అధికారులతో కలిసి పీపీపీ విధానంలో నిర్మిస్తున్న మల్టీ లెవల్ కార్ పార్కింగ్ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు పార్టనర్ షిప్ విధానంలో నిర్మిస్తున్న ఎల్ఎల్పీ కోసం సుమారు రూ.80 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మన దేశంలో ప్రపథమంగా జర్మనీ పాలిస్ పార్కింగ్ విధానంలో, తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా ఈ ప్రాజెక్టును చేపట్టామన్నారు.
కాంప్లెక్స్లోని గ్రౌండ్ ప్లోర్లో 4 లోపలకు, బయటకు వెళ్లే టర్మినల్స్ ఉన్నాయి. వాహనాల నిలుపుదల కోసం టర్న్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఈ టేబుల్పై వాహనదారుడు తమ వాహనాన్ని వదిలి తమ నిర్ధేశిత పనులకు వెళ్లిపోవచ్చు. ఎంఎల్పీలోనికి వాహనం ప్రవేశించిన సమయంలో వాహనదారులకు స్మార్ట్ కార్డు జారీ అవుతుంది. తరచూ ఎంఎల్పీ నియోగించే వారికి ఆర్ఎఫ్ఐడీ కార్డులు జారీ చేస్తారు. వాహనం యొక్క కొలతల ఆధారంగా కంప్యూటరైజ్డ్ పార్కింగ్ సిస్టమ్ ద్వారా వాహనాల వర్గీకరణ జరుగుతుంది.
ఎస్యూవీ లేదా సెడాన్ వాహనానికి తగినట్లుగా పార్కింగ్ సదుపాయం కేటాయించబడుతుంది. ఆ తర్వాత ట్రాన్స్పోర్టర్ షటిల్ ఆ వాహనాన్ని లిఫ్ట్ ద్వారా నిర్ణీత అంతస్తులో కేటాయించిన స్తలంలో పార్క్ చేస్తుంది. ఈ మేరకు విశాలమైన, సౌకర్యవంతమైన టర్న్ టేబుల్స్ ఏర్పాటు చేశామని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ముంబాయి, ఢిల్లీలో ఉన్న ఎంఎల్పీ పార్కింగ్ వ్యవస్థతో వాహనదారులు కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, ఆ పరిస్థితి ఇక్కడ ఉండదని అన్నారు.
పార్కింగ్ చేసిన వాహనాన్ని తిరిగి పొందడానికి డ్రైవర్ పార్కింగ్ రుసును చెల్లించి, పార్కింగ్ టికెట్ను కార్డ్ రీడర్కు చూపగానే ట్రాన్స్పోర్టర్ షటిల్ ఆటోమేటిక్గా కారును వాహనదారుడికి అందజేస్తుంది. పార్కింగ్ కోసం కేవలం ఒక నిమిషం కంటే తక్కువ సమయం, తిరిగి పొందడానికి 2 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. ఎంఎల్పీ డెవలపర్లు అయిన డాక్టర్ హరికిషన్ రెడ్డి, భావనారెడ్డిలకు ఆయన పలు సూచనలు చేశారు. నిర్మాణ పనులను పూర్తి చేసి ఒక నెలలోగా ట్రయల్ రన్ ప్రారంభించాలని కోరారు.
నాంపల్లి మెట్రో స్టేషన్కు సమీపంలో హెచ్ఎంఆర్కు చెందిన అర ఎకరం స్థలంలో 15 అంతస్తుల్లో ఈ కాంప్లెక్సు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఇందులో 10 అంతస్తుల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం, ఐదు అంతస్తుల్లో కమర్షియల్ షాపులు, రెండు స్క్రీన్లతో కూడిన సినిమా థియేటర్ ఉంటుందని చెప్పారు. మొత్తం 1,44,440 చదరపు అడుగుల విస్తీర్ణంలో 68శాతం పార్కింగ్, 32 శాతం వాణిజ్య సముదాయాలకు కేటాయిస్తున్నామన్నారు. పార్కింగ్ స్థలంలో 250 కార్లు, 200 ద్విచక్ర వాహనాలు నిలిపేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.