గిరిజనులు ప్రకృతి సంపదలైన నీటిని, అడవిని, భూమిని నమ్ముకొని జీవనం సాగించే ఆది మూలవాసులు. ప్రకృతి పూజారులుగా, ప్రకృతి సంరక్షకులుగా వారికి పేరున్నది. అనాదిగా ప్రకృతినే సంస్కృతిగా మలుచుకొని జీవనం సాగిస్తూ తమ భాషను, ప్రాచీన కట్టుబాట్లను, సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్న చరిత్ర వాళ్లది. కాలమాన పరిస్థితులను అధిగమిస్తూ, విదేశీ పాలకులను ఎదిరించి ఈ దేశ నిర్మాణంలో పునాదిరాళ్లుగా ఒదిగిపోయారు.
జానపద కళారూపాల వారసత్వాన్ని వేల సంవత్సరాలుగా మౌఖికంగా కొనసాగిస్తూ ప్రపంచ దేశాల్లో మన ప్రతిష్ఠను ఉన్నత శిఖరాల మీద నిలబెడుతున్నారు. ఇంతగొప్ప ప్రాధాన్యం సంతరించుకున్న ఈ భూమి పుత్రులను పరాయి పాలనలో ఆదుకునే నాథుడు లేక అన్నిరంగాల్లో వెనుకబడిపోయారు. ప్రజానాయకుడు కేసీఆర్ రాకతో వారి జీవితాల్లో వెలుగులు విరిశాయి. స్వపరిపాలనలో, సుపరిపాలనలో విద్య, ఉపాధిలో అభ్యున్నతి సాధిస్తున్నారు.
కల్యాణలక్ష్మి పథకం.. ఒక లంబాడీ కుటుంబం ఆవేదన నుంచి ఉద్భవించింది. ములుగు మండలం, రామచంద్రపురం గ్రామంచాయతీ పరిధిలోని భాగ్యతాండ 2002 ఏప్రిల్ మాసంలో కాలిపోయినప్పుడు ఉద్యమనేత కేసీఆర్ పరామర్శించడానికి వెళ్లారు. బానోత్ భీమా నాయక్ అనే బాధితుడు ఏడుస్తూ.. అయ్యా నా కూతురు పెళ్లికి దాచుకున్న డబ్బు, వస్తువులు, ధాన్యం కాలిపోయాయి. మేము పెళ్లి చేయలేం, మాకు ఆత్మహత్యే శరణ్యం అన్న మాటలు కేసీఆర్ను కలవరపర్చాయి. ఆడబిడ్డ పెండ్లికి రూ.1,00,116 ఆర్థిక సాయం అందించేందుకు ప్రస్తుతం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకానికి ఆ రోజే బీజం పడింది.
ఆంధ్ర పాలకుల చేతిలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు తెలంగాణ గిరిజనులకు చేసిందేమీ లేదు. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక గానీ, దూరదృష్టి గానీ లేక గిరిజన ఆవాసాల్లో మౌలిక సదుపాయాల కల్పన వైపు అడుగులు పడలేదు. మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధి ఆంధ్ర పాలకులకు పట్టలేదు. గిరిజన గ్రామపంచాయతీల ఏర్పాటు, రిజర్వేషన్ శాతం పెంపుదల, విద్యకు ప్రాధాన్యం ఇవ్వలేదు. 2014లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 32 గిరిజన తెగలు మిగిలాయి. 2021 జనాభా లెక్కల అంచనా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల జనాభా 42 లక్షలు. ఇందులో ఒక్క బంజారా గొర్బొలి భాష మాట్లాడే లంబాడాలు దాదాపు 32 లక్షలున్నారు.
2014లో రాష్ట్ర పగ్గాలు చేపట్టిన కేసీఆర్ 48 ఏండ్లుగా తీరని తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో పాటు గిరిజనుల అభివృద్ధి, వారి చిరకాల కోరికల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. గిరిజనుల ఆత్మగౌరవానికి, స్వావలంబనకు వరుసగా చొరవలు చేపట్టారు.
గిరిజనుల చిరకాల వాంఛ అయిన ‘మావే నాటే మావే రాజ్’ (మా తండాల్లో మా రాజ్యం) నినాదాన్ని అర్థం చేసుకున్న గిరిజన పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ 500 జనాభా కలిగిన తండాలు, గూడేలను 3,146 ప్రత్యేక గిరిజన గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయం గిరిజన జీవితాల్లో గొప్ప మలుపు. ఇది గిరిజనుల అభివృద్ధికి సంకేతం. ఏ రాష్ట్రంలో లేని ప్రత్యేక గిరిజన గ్రామపంచాయతీల ఏర్పాటు ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఈ నిర్ణయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల హృదయాల్లో ఎల్లప్పుడూ కొలువై ఉం టారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల పెంపుదల. వారి అభివృద్ధికి మూలమైన విద్య, ఉద్యోగాల్లో 1986 తర్వాత పెరుగని రిజర్వేషన్ శాతాన్ని 6 నుంచి 10 శాతానికి పెంచిన సీఎం కేసీఆర్ మేలును గిరిజన జాతి ఎప్పుడూ మరచిపోదు. పెంచిన రిజర్వేషన్ను మొదటగా వైద్య విద్యార్థుల అడ్మిషన్లో వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అమలుచేయడం విశేషం.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కమ్యూనిటీ భవనాలు నిర్మించుకోవాలనేది రాష్ట్రవ్యాప్త గిరిజనుల కోరిక. బంజారా జాతి ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ కాలిడిన నేల నేడు బంజారాహిల్స్గా సంపన్నులకు నిలయమైనది. నవాబుల పాలనలో బంజారాలు మన్ననలు పొంది వారిచే ‘రంజన్ కా పాని.. చప్పర్ కా ఘాస్.. దీన్ కా తీన్ ఖూన్ మాఫ్.. జహా అసఫ్జాహీకా ఘోడా వహా జంగి- భంగికా బయల్’ అనే ఫర్మాన పొందారు.
అంతటి చరిత్ర సంతరించుకున్న బంజారాహిల్స్ ప్రాంతంలో సుమారు 100 కోట్ల విలువైన ఎకరం స్థలంలో 25 కోట్ల వ్యయంతో నిర్మించిన సంత్ శ్రీ సేవాలాల్ బంజారా భవనం, అంతే వ్యయంతో ఆదివాసి కుమ్రంభీం భవనాలు గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మాణాలు జరుపుకొన్నాయి. ఈ భవనాలు మాకు, మా రాబోయే తరాలకు మా అపురూపమైన సంస్కృతి, సంప్రదాయాలు, గిరిజన జానపద కళారూపాల పరిరక్షణకు ఉపకరిస్తాయి. దాంతోపాటు దేశవ్యాప్త గిరిజనుల మనోభావాలను, సదస్సులు, సమావేశాల ద్వారా పంచుకునే గొప్ప వేదిక అవుతుందని ఆశిస్తున్నాం.
గిరిజన జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపును నిర్ధారించడానికి ఎస్టీల అభివృద్ధి నిధి చట్టం 2017లో రూపొందించబడింది. ఈ చట్టం ప్రకారం విధిగా 10 శాతం నిధులను గిరిజన సంక్షేమం కోసం కేటాయించి ఖర్చుచేయాలి. ఒకవేళ చేయకుంటే ఆ నిధులను తర్వాతి సంవత్సరానికి అదనంగా కేటాయించాలి. ఈ చట్టం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉపయోగపడుతున్నది. ఎక్సైజ్ రిటైల్ షాపుల్లో గిరిజనులకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా వారి కోసం 5 శాతం దుకాణాలను కేటాయించింది. గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విద్యను ప్రాధాన్యరంగంగా గుర్తించి, ప్రాథమిక విద్యలోనే గిరిజన యువతకు మంచి విద్యావకాశాలు కల్పించడానికి పూనుకున్నది. నూతన రాష్ట్రంలో అదనంగా 92 కొత్త గురుకుల పాఠశాలలను ప్రారంభించి 74,953 మంది గిరిజన విద్యార్థులకు సకల సౌకర్యాలతో విద్యనందిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం సైనిక పాఠశాల మంజూరుకు నిరాకరించినా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి సైనిక్ స్కూల్ నెలకొల్పడం గొప్ప విశేషం.
ఎస్టీ విద్యార్థుల ఉన్నత విద్య కోసం మొత్తం 22 డిగ్రీ కళాశాలలను కొత్తగా ఏర్పాటుచేశారు. ఇందులో 15 మహిళా డిగ్రీ కళాశాలలు మహిళల ఆకాంక్షలను నెరవేరుస్తూ, బాల్య వివాహాలను రూపుమాపడానికి తోడ్పడుతున్నాయి. వీటితో పాటు గిరిజన ఉద్యోగినుల కోసం ప్రత్యేక వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు ఏర్పాటుచేశారు. విద్యానిధి పేరుతో విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి గిరిజన యువతకు 20 లక్షల ఆర్థిక సహాయం అందించడం
అదృష్టంగా భావిస్తున్నాను.
గత ప్రభుత్వ హయాంలో గిరిజన ఆవాసాలకు విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తామని తప్పించుకున్నారు. 2014 నాటికి కోట్ల రూపాయల బకాయిలను మాఫీ చేయడమే కాకుండా 2014 నుంచి ఇప్పటివరకు గృహావసరాల కోసం 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడకానికి కేసీఆర్ ప్రభుత్వం అనుమతించింది. డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం ద్వారా గిరిజన యువతకు డ్రైవింగ్ శిక్షణను ఇప్పించి వాహనాల కొనుగోలుకు సహకరించి, ఉబెర్ వంటి సంస్థలతో సాంకేతిక సహాయం అందించి సుమారు రూ.33 కోట్లతో 441 మంది గిరిజన యువతను యజమానులుగా మార్చింది. అనేక నూతన ఆర్థిక, జీవన స్థితిగతుల మెరుగుదల ప్రోత్సాహక పథకాలు అమలుచేస్తున్నారు. నిరుద్యోగ గిరిజన యువత ప్రారిశ్రామికవేత్తగా ఎదగడానికి సబ్సిడీ సహాయం అందిస్తున్నారు. పోటీ పరీక్షల శిక్షణ కోసం శిక్షణా కేంద్రాలు ఏర్పాటుచేశారు. గిరిజన గ్రామాలకు మౌలిక వసతులు కల్పించారు. గిరిజన ఉత్పత్తుల విలువ జోడింపు కోసం సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆరోగ్యరక్షణ, పౌష్ఠికాహార సరఫరా వంటి పథకాలూ వచ్చాయి. గిరిజన సంస్కృతిని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసేందుకు మ్యూజియంలు ఏర్పాటయ్యాయి. గిరిజన కళలు, చేతివృత్తులకు ఆదరణ కల్పిస్తున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న ఈ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఎస్టీల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చింది.
(వ్యాసకర్త: పార్లమెంట్ మాజీ సభ్యులు)
-ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్
98492 35055