బీఆర్ఎస్ పార్టీ మరో సంకల్పానికి పునాది వేసింది. అదే ‘భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్’. ఒక ప్రాంతీయ పార్టీ రాజకీయ శిక్షణ కోసమే పూర్తిస్థాయి సెంటర్ను నెలకొల్పడం దేశంలోనే ఇది ప్రథమం. విశ్వనగరం హైదరాబాద్లో రాజకీయ అవగాహనా కార్యక్రమాలు, శిక్షణా తరగతుల నిర్వహణ, కార్యకర్తలు, నాయకులకు అవసరమైన సమస్త, సమగ్రమైన సమాచారం లభించే కేంద్రంగా ఈ భవనం తయారు కాబోతున్నది.
దేశంలోని ఏ ప్రాంత ప్రజలకైనా ఈ భవనంలో సమస్త సమాచారం లభిస్తుంది. పెద్ద సమావేశ మందిరాలు, అత్యాధునికమైన డిజిటల్ లైబ్రరీ, పలు భాషా పత్రికలు, వాటిలో వచ్చే వార్తల సమాచారాన్ని క్రోడీకరించడం, పార్టీ నేతలకు అవసరమైన సమాచారాన్ని అందించడం వంటివి ఈ శిక్షణ కేంద్రంలో జరగాలనే భావనలో ప్రభుత్వం ఉన్నది. ప్రాంతీయ, జాతీ య, అంతర్జాతీయ అంశాలపై లోతైన పరిశోధన జరిగేలా భారత్ భవన్కు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని డైరెక్టర్గా నియమించబోతున్నారు. దాదాపు 56 మంది విజిటింగ్ ప్రొఫెసర్లు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచస్థాయి ఆర్థికవేత్తలు, పర్యావరణ, వాతావరణ, రాజకీయ, తదితర రంగాలకు చెందిన నిపుణులు, నోబెల్ విజేతలు కూడా ఈ శిక్షణల్లో పాల్గొంటారని చెప్పడం శుభ పరిణామం. 30, 35 దేశాల నుంచి పలురంగాల నిపుణులు భారత్ భవన్ కార్యక్రమాలను చూసుకుంటా రు. ఇక్కడ శిక్షణ పొందినవారికి దేనిపైనైనా, ఎక్కడైనా మాట్లాడగలిగే సామర్థ్యం వస్తుంది. సమస్యలకు లోతైన అవగాహనతో వినూత్న పరిష్కారాలు చూపించి, ప్రజల కోసం అంకితభావం, నైపుణ్యం గల అధికారులను, నాయకులను తయారుచేసే ఒక విజ్ఞాన కేంద్రంగా ఈ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రజాస్వామ్యం, రాజకీయాలు ప్రజా జీవితంలోని రెండు ముఖ్యమైన రంగాలు. ఈ రంగాల్లో సామర్థ్యం పెంపొందించే యంత్రాంగాలు లేకపోవడం వల్లే రాజకీయంగా నేడు అనేక మార్పులు వస్తున్నాయి. ఉద్యోగం పొందాకా చాలామంది అధికారులు, ఉద్యోగులు దాదాపు తప్పనిసరిగా కొంత శిక్షణ పొందుతుంటారు. కానీ, రాజకీయరంగంలో పూర్తిస్థాయి శిక్షణ లేదు. కొన్ని ప్రత్యేక జాతీయ పరిశోధన సంస్థలు, జాతీయ మానవ వనరుల కేంద్రాలు మాత్రమే ఎన్నికైన నాయకులకు పలు ప్రత్యేక అంశాలపైన శిక్షణ ఇస్తున్నాయి. కానీ ఇది కూడా తాత్కాలికమే. గతంలో ఏ జాతీయ పార్టీకి లేనివిధంగా శాశ్వత పార్టీ కార్యాలయాలను ఏర్పాటుచేసుకొని, నేడు నిరంతర శిక్షణ, రాజకీయ సామర్థ్యాలను పెంపొందించే పూర్తి రాజకీయ పార్టీ స్థాయి సెంటర్ అవసరాన్ని గుర్తించింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. దేశంలో మొదటిసారి మన రాష్ట్రంలో ఏర్పాటుచేయాలనే నిర్ణయం తీసుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం.
ఏదేమైనా పార్టీలకతీతంగా దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ మార్పులపై ముఖ్యంగా నేటి యువత అవగాహన పెంచుకోవాలి. పార్టీలకతీతంగా ఇలాంటి శిక్షణ కేంద్రాలు నేటి యువతకు ఎంతగానో దోహదపడుతాయి. యువతీ యువకులు అగ్ర నాయకులుగా ఎదగడానికి ఉపయోగపడతాయి.
జాతీయస్థాయిలో కార్యక్రమాలను మొదలు పెట్టి, పలు రాష్ర్టాల్లో విస్తరిస్తున్న బీఆర్ఎస్ పార్టీకే కాకుండా, అన్ని పార్టీలకు ఈ శిక్షణ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. యువతలో రాజకీయ చైతన్య పరిజ్ఞానం పెంపొందించటానికి చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్ దేశ నాయకులను తయారు చేసేలా, ముఖ్యంగా యువతకు దేశ రాజకీయంపై పట్టు సాధించేలా ‘భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్’ పార్టీలకతీతంగా కృషిచేస్తుందని ఆశిద్దాం.
డాక్టర్ కందగట్ల
శ్రవణ్కుమార్
8639374879