ప్రపంచస్థాయి ఔషధ కంపెనీలు భారత్లో పరిశోధనలు చేపట్టాలంటే దేశంలో మేధో హక్కుల పరిరక్షణ వ్యవస్థ మరింత మెరుగుపడాలని ప్రఖ్యాత ఫార్మా కంపెనీ నోవార్టిస్ సీఈఓ వసంత్ నరసింహన్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ దిశగా భారత్ కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కృత్రిమ మేధో రంగం ఎంత అభివృద్ధి చెందినా.. మనుషుల పర్యవేక్షణలోనే అది ఉండాలని, లేదంటే ప్రమాదకర ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నదన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న బయో ఏషియా సదస్సు నేపథ్యంలో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్, వసంత్ నరసింహన్ పరస్పరం మాట్లాడుకున్నారు. ఆ వివరాలు..
కేటీఆర్: హైదరాబాద్ అనుకూలతను చాటడంలో నాకన్నా ముందు వచ్చిన వారు బాగా కృషిచేశారు. ఆ అనుకూలతలను మరింత పటిష్ఠపరచుకొని ముందుకుపోతున్నాం. దేశమంతటి నుంచి కంపెనీలను ఆహ్వానించగలిగాం. మా టెక్నిక్ మార్చడం కన్నా, మా అనుకూలతలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాం. స్విట్జర్లాండ్లోని బేసిల్ తర్వాత నోవార్టిస్కు అతిపెద్ద క్యాంపస్ ఉన్నది హైదరాబాద్లోనే కదా? మీకు పార్సల్లో ఒక ఇల్లు ఉన్నది. మరి హైదరాబాద్లో కూడా ఒకటి ఉండాలి కదా!
వసంత్ నరసింహన్: ఉండవచ్చు. కానీ నాకు ఎప్పుడూ హైదరాబాద్ అంటే ఇల్లు తరువాత మరో ఇల్లు వంటిది. ఇక్కడ ఉంటే ఎంతో శక్తిసామర్థ్యాలతో ఉన్నట్టు అనిపిస్తుం ది. ఇక్కడ ఎందరో నిపుణులున్నారు. ఆ శక్తే మా కంపెనీని నడిపిస్తున్నది. మా అంతర్జాతీయ ప్రక్రియలతో వీరు కలగలసిపోయారు. కీలక ఉత్పత్తులపై దృష్టిసారించాం. దాని ప్రాతిపదికగా కీలకమైన పరివర్తన తేగలుగుతున్నాం. గత పద్దెనిమిదేండ్లుగా మాకు ఇది ఎంతో ఉపకరించింది.
కేటీఆర్: ఫార్మా కంపెనీల వారిని కలిసినప్పుడు, ఏడాదిగా ప్రాసెస్లలో వచ్చిన మార్పులపై మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎంతో పని కంప్యూటర్ మాడల్స్ (సిమ్యులేషన్స్) ద్వారా సాగించడం ఆసక్తి కలిగిస్తున్నది. పరిశ్రమకు బయో మెడికల్ ఇంజినీరింగ్ కొత్త రూపు ఎలా ఇచ్చిందనేది ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. లభ్యత సంభావ్యత, అందుబాటు అంశాలపై ఫార్మా పరిశ్రమ దృష్టిసారించింది. మీ అభివృద్ధికి హైదరాబాద్ ఎలా తోడ్పడిందంటారు?
వసంత్: మేం అడుగిడిన అతిపెద్ద ప్రాంతాల్లో హైదరాబాద్ ఒకటి. ఇక్కడినుంచి గ్లోబల్ డెవలప్మెంట్ ప్రొగ్రామ్స్ కొనసాగుతున్నాయి. ఎంతో డేటా అనాలిసిస్ జరుగుతున్నది. నోవార్టిస్ వాల్యూచైన్లో హైదరాబాద్ ఒక భాగం. ప్రపంచస్థాయి ఔషధ వృద్ధి ప్రాజెక్టు ఇక్కడే నడుస్తున్నది. ఎన్నో ట్రాన్స్ఫామేటివ్ ప్రాజెక్టులను ఇక్కడ చేపడుతున్నాం. ఐటీ, ఫైనాన్స్, ఈఎస్జీ వంటి రంగాలలో అంతర్జాతీయ స్థాయి సారథులు ఇక్కడినుంచి వస్తున్నారు. కర్బన ఉద్గారాలు, గ్రీన్హౌజ్ వాయువుల దుష్ప్రభావాలు ఏమీ లేకుండా కృషిచేస్తున్నాం. పర్యావరణంపై కృషిచేస్తున్న అంతర్జాతీయ బృందాలు కూడా హైదరాబాద్లో ఉన్నాయి. కృత్రిమ మేధ కొన్ని ప్రాసెస్లకు ఉపయోగపడుతుంది. కానీ మానవ మేధ స్థానాన్ని అది భర్తీ చేయలేదు. డేటాకు సంబంధించిన మౌలిక వసతులు ఉండేలా చూస్తున్నాం.
కేటీఆర్: నోవార్టిస్లో కొనసాగుతున్న పరిశోధన, అభివృద్ధిని (ఆర్అండ్డీని) వివరిస్తారా?
వసంత్: బేసిక్ సైన్స్, ఆవిష్కరణలు, కొత్త ఔషధ పదార్థాలను గుర్తించడం, వాటిని ప్రీ క్లినికల్ పరిశోధన ద్వారా వృద్ధి చేయడం, అంతర్జాతీయ పరిశీలనకు సిద్ధం చేయడం మొదలైనవన్నీ మా పరిశోధనలో భాగంగా జరుగుతాయి. ఆ తర్వాత ఔషధ వృద్ధి విభాగానికి వీటిని పంపిస్తాం. ఆ క్రమంలో క్లినికల్, రెగ్యులేటరీ ప్రయోగాలు జరుగుతాయి. ఔషధ వృద్ధి రంగంలో మా వద్ద 3,200 మంది నిపుణులు పని చేస్తున్నారు. ఈ అంశంలో ప్రపంచంలోనే మేం నెంబర్ వన్ లేదా నెంబర్ టూ లో ఉంటాం. ఇక్కడ మేం చేపట్టిన వివిధ దశలను విశ్లేషిస్తాం. డేటా సైన్స్, కృత్రిమ మేధ సులభతరమైనవి. ప్రీ క్లినికల్ ట్రయల్స్ను దశల వారీగా పరిశీలిస్తాం. ఆ తర్వాత వాల్యూచైన్పై దృష్టిపెడతాం. ప్రపంచంలోని ప్రధాన ఫార్మా కంపెనీల మౌలిక ఔషధ పరిశోధనలు ఇక్కడ జరగాలంటే భారత్లో రెగ్యులేటరీ డేటా ప్రొటెక్షన్ సిస్టం ఉండాలి. మేధో హక్కు ల అంశాల ప్రక్షాళనకు భారత్లో ఎంతో కృషి జరిగింది, అయినా ఇంకా జరగాల్సింది ఉంది. భారత్లో రెగ్యులేటరీ డేటా ప్రొటెక్షన్ సరిగా లేదు. చైనాతో సహా ఎక్కడైతే రెగ్యులేటరీ డేటా ప్రొటెక్షన్ ఉందో అక్కడే మల్టీనేషనల్ సంస్థల ఔషధ పరిశోధనలు జరుగుతున్నాయి. భారత్లో ఒకప్పుడు క్లినికల్ ట్రయల్స్కు ఆమోదం లభించడం కష్టంగా ఉండేది. అయితే కొత్త విధానం వల్ల ఇది మెరుగు పడిందని విన్నాం. భారత్లో మేధో హక్కుల పరిరక్షణ విధానాన్ని, నియంత్రణపరమైన రక్షణను పటిష్ఠం చేస్తూ ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా భారత్ కోరుకోవలసింది ఇదే. జాతీయ విధానం ఇందుకు అనుగుణంగా ఉండాలి.
కేటీఆర్: ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా, లైఫ్సైన్సెస్ సముదాయాన్ని ప్రారంభించడానికి సిద్ధపడుతున్నాం. పరిమాణాత్మకంపై కాకుండా గుణాత్మకతపై దృష్టిపెడుతున్నాం. మేధోహక్కు ల పరిరక్షణ, నియంత్రణ వ్యవస్థలు ఉండేలా చూస్తాం. మీరు చాట్ జీపీటీని ఉపయోగించారా? కృత్రిమ మేధ మానవ మేధ స్థానాన్ని భర్తీ చేస్తుందని భావిస్తున్నారా?
వసంత్: చాట్ జీపీటీని ఉపయోగించాను. మానవ మేధకు కృత్రిమ మేధ తోడవుతుంది. కానీ దానికీ ఒక పరిమితి ఉంటుంది. వాల్యూ అడిషన్కు తోడ్పడుతుంది. కానీ మానవ పర్యవేక్షణ లేకుండా మరీ ఎక్కువగా ఆధారపడటం ప్రమాదకరం. కృత్రిమ మేధ ద్వారా మనకు 68 శాతం కచ్చితత్వం లభిస్తుంది. కానీ మన కు కావలసింది వంద శాతం కచ్చితత్వం.
కేటీఆర్: నేను ఇటీవల ప్రపంచ ఆర్థిక ఫోర మ్ సదస్సుకు వెళ్లాను. నా దగ్గర యూరోలు ఉన్నాయి. కానీ ఫ్రాంక్లు లేవు. యూరోలు తీసుకుంటారా అని కౌంటర్ దగ్గర ఉన్న మహిళను అడిగాను. క్యాలికులేటర్ లేకుండా యూరోలు తీసుకోలేనని ఆమె చెప్పారు. మన దగ్గర ఉండవలసిన టెక్నాలజీ సమయానికి లేకపోతే, విఫలమైతే లేదా పోగొట్టుకుంటే పరిస్థితి ఏమిటా అని నేను ఆలోచించాను. చాట్ జీపీటీ వంటి టూల్స్పై పూర్తిగా ఆధారపడకుండా మన సహజమైన మేధస్సును కాపాడుకోవాలి. ప్రశ్నలు సంధించాలి. సమాధానాలు రాబట్టాలి. ఆ శక్తిని కోల్పోకూడదు.