పూర్వపు మహబూబ్నగర్ జిల్లాలోని అలంపూరు తాలూకాలో ఆముదాలపాడు గ్రామం ఉన్నది. ఇక్కడ పశ్చిమ చాళుక్యులకు చెందిన ఒకటవ విక్రమాదిత్యుడు వేయించిన శాసనం ఉన్నది. ఈ శాసనాన్ని ఆముదాలపాడు శాసనం అని కూడా అంటారు. ఈ శాసనం గురించి మొదట గడియారం రామకృష్ణశర్మ భారతి పత్రికలో ప్రచురించారు. తెలంగాణ ప్రాంతంలో మహబూబ్నగర్, నల్లగొండ తదితర ప్రాంతాల్లో బాదామీ చాళుక్యులు రాజ్యపాలన నిర్వహించి అనేక కన్నడ, తెలుగు శాసనాలు వేయించారు. విక్రమాదిత్యుని 5వ రాజ్య సంవత్సరంలో అనగా క్రీ.శ. 660, వైశాఖ పూర్ణిమరోజు తన గురువుకు గురుదక్షిణగా మర్రూరు అనే గ్రామాన్ని సమర్పిస్తూ వేయించిన శాసనం చాలా విశిష్టమైనది.
శాసనం వరాహ స్తుతితో ప్రారంభమైంది. చాళుక్య వంశ ప్రశస్తి, పూర్వరాజుల ప్రశం స, మొదటి పులకేశి, కీర్తివర్మ, రెండవ పులకేశి, స త్యాశ్రయ పృథివీ వల్లభ మహారాజుల ఘనత కొనియాడబడింది. శాసనంలో విక్రమాదిత్యుడు తనను తాను విశేషంగా పేర్కొంటూ శాసనాన్ని ఇచ్చాడు.
‘సత్యాశ్రయ పృథివీ వల్లభ మహారాజు ప్రియ పుత్రుడను, అనేక యుద్ధాల్లో చిత్ర కంఠమనే అశ్వాన్ని ఎక్కి శత్రురాజుల రక్తాన్ని పీల్చ గల ఖడ్గధారను కలిగి, భూభారాన్ని వహిస్తున్న వాడిని, పూర్వం ముగ్గురు రాజులు వశం చేసుకున్న ఆ రాజ్యాలను తిరిగి స్వాధీనం చేసుకున్నవాడను, ఆ రాజ్యాల్లో నష్టమైన దేవబ్రాహ్మణ వృత్తులను పునరుద్ధరించినవాడను, విక్రమాదిత్య సత్యాశ్రయ శ్రీ పృథివీ వల్లభ మహారాజాధిరాజ పరమేశ్వరుడైన నేను అందరినీ ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాను.
తాను శివమండల దీక్షలో ఉండి గురువైన సుదర్శనాచార్యులకు త నకు, తన తల్లిదండ్రులకు పు ణ్యం, కీర్తి కలగడానికి వంగూరు వాటి విషయంలోని ఈ పరుంకల్లు గ్రామాన్ని, అన్ని అధికారములతో దానమిచ్చినాడు. దాన్నే సుదర్శనాచార్యులవారు ఇతర బ్రాహ్మణులకు, తన భార్యకు దానమిచ్చినాడు. కాశ్యపస గోత్రుడైన రుద్రశివ, కౌండిన్యస గోత్రుడైన గాయత్రీ శివ, మైత్రేయగోత్ర కోకిల స్వామి… మొత్తం 27 మంది ప్రతి గ్రహీతలకు దానం చేయబడింది.
శాసనం చివర మూడు వ్యాసగీత శ్లోకములు ‘సుదర్శనస్య భాస్కర’ అని ఉంది. హుశః లేఖకుడి పేరు అయి ఉండవచ్చని గడియారం అభిప్రాయపడ్డారు.
ఒక మహారాజైన విక్రమాదిత్యుడు శివదీక్షను స్వీకరించటం, దానికి సుదర్శనాచార్యుడు ఆధ్వర్యం వ హించడం, అందుకు గురుదక్షిణగా గ్రామాన్ని దత్తం చేయ డమన్నది చాళుక్యులు శైవమతానికి ఇచ్చిన ఆదరణ, గౌరవాన్ని మనం గమనించవచ్చు. శాసనంలో విక్రమాదిత్యుడికి ‘పరమేశ్వర, అనివారిత’ బిరుదాలు ఉన్నట్లు తెలుస్తున్నది.
-భిన్నూరి మనోహారి