ఆత్మహత్యలు, అప్పుల బాధలు, పేదరికం, పౌష్టికాహారలోపం, నిరక్షరాస్యత వంటి పలు సమస్యల్లో కూరుకుపోయిన భారతీయ రైతుల మీదికి ద్రవ్యోల్బణం అనే కొత్త పిడుగు వచ్చి పడింది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చిన్న రైతులకు సాగు మోయలేని భారంగా మారింది.
యూరియా ధరలను కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుంది.. పైగా, డిమాండ్కు తగినవిధంగా దేశంలోనే యూరియా ఉత్పత్తి అవుతున్నది. కానీ డీఏపీ, ఎంఓపీలపైన ప్రభుత్వ నియంత్రణ లేకపోవటమేగాక వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఎంఓపీ మార్కెట్లో రష్యా, ఆ దేశ మిత్రదేశం బెలారస్లదే ప్రధాన వాటా. కేవలం రష్యాకే 17 శాతం మార్కెట్ ఉంది. ఎన్పీకే (నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం) మార్కెట్లోనైతే 60 శాతం ఆ దేశానిదే. రష్యా ప్రస్తుతం యుద్ధంలో మునిగి ఉండటం, ఆ దేశంపై అంతర్జాతీయ సమాజం అనేక ఆంక్షలను మోపటంతో ఎరువుల మార్కెట్ ఒడిదొడుకులకు లోనవుతున్నది. ఫలితంగా పెరిగిన ఎరువుల ధరలతో భారతీయ రైతులు తీవ్ర ఆర్థికభారం ఎదుర్కొంటున్నారు.
‘కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్’
మార్చి 29న విడుదల చేసిన పరిశోధన నివేదిక ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరంలో సాగురంగం ఉత్పత్తి వ్యయం 11-15 శాతం పెరిగింది. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటించటం మినహా ప్రభుత్వాల ముందు మరొక దారి ఉండకపోవచ్చని, అయితే, దీని వల్ల ఆహార ద్రవ్యోల్బణం పెరిగి తద్వారా ఆర్థికరంగంలో మొత్తంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది.
వ్యవసాయ కూలీల సాధారణ సగటు ఆదాయం గత కొంతకాలంగా బాగా తగ్గింది. గత ఏడాది ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో వారి ఆదాయం వృద్ధిరేటు అంతకుముందు ఏడాదిలో అదే కాలవ్యవధితో పోల్చితే 6.6 శాతం నుంచి 2.35 శాతానికి తగ్గింది. వ్యవసాయేతర కూలీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 7.95 శాతం నుంచి 1.8 శాతానికి తగ్గింది. పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా లెక్కిస్తేనే ఇలా ఉంటే.. దాన్ని కూడా కలుపుకొని కూలీల నిజ వేతనాలను లెక్కిస్తే మరింత దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. చేతిలో సొమ్ము అంతే ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణం తోడైతే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. 2016-20 ఆర్థిక సంవత్సరాల మధ్య వ్యవసాయ కూలీల నిజ వేతనాలు ఒక్క శాతంలోపు మాత్రమే పెరిగాయి. 2020లోనైతే వారి నిజ వేతనాలు పెరుగకపోగా తగ్గాయి. అంటే చేతిలో పడే డబ్బులు కాస్త పెరిగినప్పటికీ.. వాటితో కొనే వస్తువుల సంఖ్య తగ్గింది. దీనివల్ల గ్రామీణప్రాంతాల ప్రజలు ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, ఇతరత్రా కూలీలు అప్పులు తీసుకోక తప్పని పరిస్థితిలో పడిపోయారు. రుణభారం వారి మీద అధికమైందని ‘కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్’ నివేదిక వెల్లడించింది.
కరోనా కారణంగా భారతదేశంలో ఎన్నడూ చూడనటువంటి తిరుగు వలస పెద్ద ఎత్తున జరిగింది. పట్టణాల్లోని ఫ్యాక్టరీలు, సంస్థల నుంచి స్వగ్రామాలకు కోట్ల మంది తిరిగి వెళ్లిపోయారు. వీరంతా వ్యవసాయరంగంలో ఏదో ఒక పని చేసి పొట్ట నింపుకోవాలని అనుకున్నవాళ్లే. దీంతో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఆ పథకానికి మరిన్ని నిధులు ఇచ్చి, కోట్లాదిమంది పేదప్రజలకు ఆదాయ భద్రతను కల్పించాల్సిన కేంద్రప్రభుత్వం దీనికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. ఈసారి బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి కేంద్ర ఆర్థికమంత్రి 25 శాతం మేర నిధులను తగ్గించారు.
యుద్ధం నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ కోల్పోయిన ఆహారధాన్యాల ఎగుమతుల మార్కెట్ వాటాలో కొంతభాగాన్ని సొంతం చేసుకోవాలని భారత్ భావించింది. ఈ ఏడాది కోటి టన్నులకుపైగా గోధుమలను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల కేంద్రసర్కారుకు ఆర్థికంగా లాభం జరుగుతుండవచ్చుగానీ, దాదాపు పది కోట్ల వ్యవసాయదారుల కుటుంబాలకు ఎటువంటి లబ్ధి దక్కదని ‘కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్’ నివేదిక చెప్తున్నది. అంటే ప్రభుత్వ ఆదాయం పెరిగినప్పటికీ.. రైతుల ను ఆదుకోవటానికి సర్కారు వ్యయం చేయకపోవచ్చని ఈ నివేదికలో సందేహాలు వ్యక్తమయ్యాయి.
రైతుల పట్ల కేంద్రంలోని మోదీ సర్కార్ ధోరణి తొలి నుంచీ ఇలాగే ఉంటున్నది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అనేకమార్లు బీజేపీ నేతలు, కేంద్రం వాగ్దానాలు చేసింది. కానీ, ఆ దిశగా ఇప్పటికీ ఎటువంటి పురోగతి లేకపోగా.. రైతుల, వ్యవసాయ కూలీల నిజ వేతనాలు తగ్గుతున్నాయి. మోదీ సర్కార్ ఇచ్చే హామీల తెర తీసి చూస్తే కనిపించే వాస్తవం ఇదే.
– ఎడిటోరియల్ డెస్క్