1929-30లలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆర్థికమాంద్యం ఏర్పడింది. దేశదేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ అస్తవ్యస్థమైపోయాయి. కానీ, ప్రణాళికాబద్ధమైన కృషితో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆర్థిక మాంద్యం నుంచి రష్యా బయటపడింది. ఈ నేపథ్యంలో భారత్తో సహా ప్రపంచ దేశాలన్నీ రష్యా వైపు చూశాయి. రష్యా అనుసరించిన ఆచరణాత్మక విధానమేదో తెలుసుకొని అనుసరించే ప్రయత్నం చేశాయి. ప్రణాళికలు రచించి అమలు చేయడం ప్రారంభించాయి. ఆ క్రమంలోనే భారత్లో కూడా ప్రణాళికా విధానం గూర్చిన చర్చ, అమలు, ఆచరణ రూపం దాల్చాయి.
దేశానికి స్వాతంత్య్రం రాకముందు 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశం ఆర్థికంగా సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే పదేండ్ల కాలన్ని దృష్టిలో ఉంచుకొని ‘ప్రణాళికాబద్ధమైన ఆర్థికవ్యవస్థ భారతదేశం’ (ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా) అనే గ్రంథాన్ని రచించారు. తదనంతరం భారత జాతీయ కాంగ్రెస్ 1938లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ‘జాతీయ ప్రణాళికా కమిటి’ని నియమించింది. అయితే రెండో ప్రపంచయుద్ధం, అనేక రాజకీయ ఒత్తిళ్ళ వల్ల నివేదిక తయారీలో జాప్యం జరిగి 1948లో ఆ నివేదికను సమర్పించింది.
ఈ కాలంలోనే.. 15 ఏండ్లలో ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు చేయడం, మౌలిక పరిశ్రమలను ఏర్పాటుచేయడం, యువతకు ఉద్యోగ అవకాశాలను రెట్టింపు చేయడం లాంటి లక్ష్యాలతో రూ.10వేల కోట్లు కేటాయించాలని పేర్కొంటూ బొంబాయికి చెందిన 8 మంది పారిశ్రామిక వేత్తలు 1944లో ‘బాంబే ప్రణాళిక’గా పిలువబడే ‘భారత ఆర్థికాభివృద్ధి ప్రణాళిక’ పేరుతో ప్రణాళిక ప్రకటించారు. గాంధీ సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకొని శ్రీమన్ నారాయణ్ అగర్వాల్ ‘గాంధీ ప్రణాళిక’ను రూ.3,500 కోట్లతో రూపొందించారు. రెండో ప్రపంచ యుద్ధానంతర ఆర్థికవ్యవస్థ పునర్నిర్మాణానికి సర్ అదిషర్ దలాల్ అనే ఆర్థికవేత్త స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికను తయారుచేశారు. వ్యవసాయానికి, వినియోగ వస్తు పరిశ్రమలకు ప్రాధాన్య లక్ష్యాలను ఎంచుకొని రూ.15,000 కోట్లతో పదేండ్ల కాలానికి’ మానవేంద్రరాయ్ ‘ప్రజ- ప్రణాళిక’ పేరుతో ప్రణాళికను రూపొందించారు.
ఇలా అనేకమంది ఆర్థిక, తత్వవేత్తలు స్వాతంత్య్రానికి పూర్వమే ‘పేపర్ ప్రణాళికలు’ తయారుచేశారు. వాటన్నింటిని క్రోడీకరించి స్వాతంత్య్రానంతరం లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ 1950 జనవరిలో ‘సర్వోదయ ప్రణాళిక’ను ప్రకటించారు. ఈ అంశాలన్నింటినీ తీసుకొని భారత ప్రభుత్వం 1950 మార్చి 15న స్వతంత్ర ప్రతిపత్తి గల సలహా సంస్థగా ‘ప్రణాళిక సంఘం’ను ఏర్పాటుచేసింది. మొదటి ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా, ప్రధాని నెహ్రూ, ఉపాధ్యక్షుడిగా గుల్జారిలాల్ ఆధ్వర్యంలో ఏర్పడింది. ఇది సాంకేతిక సిబ్బందితో దేశ సంపద, మూలధనం, మానవ వనరులను అంచనా వేయడం, వనరులను పెంచడానికి పరిశోధన చేయడం, దేశ వనరులను సమర్థంగా, సమతుల్యంగా వినియోగించేవిధంగా ప్రణాళికలు రూపొందించింది.
సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికను తయారుచేయడం, ప్రణాళిక పురోగతిని ఎప్పటికప్పుడు అంచనా వేయడం, సర్దుబాట్లు చేయడం లాంటి అనేక లక్ష్యాలను ప్రణాళిక సంఘం రూపొందించుకొని పనిచేసింది. ఇలా 11 పంచవర్ష, 6 వార్షిక ప్రణాళికలు పూర్తయిన సందర్భంలో, 12వ ప్రణాళిక (2012-17) అమల్లోకి రాగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. పూర్తికాలపు ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, వ్యవసాయక, పారిశ్రామిక, వ్యాపార, పాలన సంబంధ అనుభవ మేధావుల జట్టుగా ఉండే ‘ప్రణాళిక సంఘం’ను మార్చి దాని స్థానంలో తమ అనుయాయులు, అనుచరగణం సభ్యులుగా ఉండే కొత్త వ్యవస్థను ‘నీతి ఆయోగ్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
ఇది వచ్చిన సందర్భంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమాఖ్య వ్యవస్థకు స్ఫూర్తినిచ్చేదిగా ఉంటుందని, కేంద్ర రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుందని భావించారు. మారిన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా, పారదర్శకతతో ఇది మేధోకూటమిగా ఏర్పడిందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. కానీ ఈ ఎనిమిదేండ్ల కాలంలో నీతి ఆయోగ్ చేసేందేమీ లేదు. కాలంతో పరిగెడుతున్న అభివృద్ధి చెందుతున్న తెలంగాణ, కేరళ లాంటి రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు కల్పించలేదు.
దేశ జీడీపీ ‘నీతి ఆయోగ్’ కంటే ముందు 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచి 2014-15 నాలుగేండ్లలో, ఏడాదికి 6.81 శాతం వృద్ధి రేటు సాధిస్తే నీతి ఆయోగ్ తర్వాత 2015-16 నుంచి 2019.20 నాలుగేండ్లలో 0.5 శాతం వృద్ధి రేటును కోల్పాయి.
మొత్తంగా 6.31 శాతమే వృద్ధిరేటు నమోదు కావడం నీతి ఆయోగ్ డొల్లతనాన్ని తెలియజేస్తుంది. అసంఘటితరంగంపై ఆధారపడ్డవాళ్లను ఆదుకోవడం విద్య, ఆరోగ్యంపై పెద్ద ఎత్తున ఖర్చుచేయడం, విపత్తులు అనిశ్చితి పరిస్థితుల నుంచి పురోగతి సాధించడానికి, సాంఘిక భద్రతను పటిష్ఠం చేయడం తదితర అభివృద్ధి వ్యూహాల్లో ఘోర వైఫల్యం చెందింది. 2022 ఏప్రిల్ ఈ సంవత్సర బిలియనీర్ల జాబితాలో ప్రతి వంద మందిలో 16 మంది భారతదేశానికి చెందినవాళ్లు ఉండటం ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తున్నది.
2022 ఫోర్బ్స్ పత్రికలో పేర్కొన్నట్లుగా దేశంలో కొత్తగా బిలియనీర్ల జాబితాలో చేరిన వారి సంఖ్య పెరిగిపోయింది. వారి సంపద దేశ సంపదలో 26 శాతం కావడం ఆ వర్గాల సంపదను పెంచడానికి మాత్రమే నీతి అయోగ్ పనిచేస్తుందన్నదని అర్థమవుతున్నది. దేశ పేద ప్రజల ముఖచిత్రాన్ని మార్చడానికి గానీ, పేదరిక నిర్మూలన చేయటంగాని నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత పురోగతి లేదు. దీన్నిబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్లుగా నేతి బీరకాయలో నెయ్యి లేనట్లుగానే ‘నీతి ఆయోగ్’లో నీతి లేదని అర్థమవుతున్నది.
(వ్యాసకర్త: సహాయ ఆచార్యులు, కాకతీయ యూనివర్సిటీ)
డాక్టర్ బైరి నిరంజన్ 93901 15644