అడగకుండానే అన్నీ ఇచ్చే పర్యావరణాన్ని మనం చేజేతులా కలుషితం చేసుకుంటున్నాం. మన చుట్టూ ఉండే ఇతర జీవరాశులతో మమేకమై
అందులో సజీవులు, నిర్జీవులు కలిసి ఏర్పడే సహజమైన ప్రపంచమే ప్రకృతి. మనిషి సాధించిన ప్రగతి వల్ల మొదటగా నష్టం వాటిల్లిందంటే అది అడవులకు, వన్యప్రాణులకే అని చెప్పవచ్చు.
అడవుల నరికివేత వన్యప్రాణుల జీవనానికి అడ్డంకిగా మారింది. అడవులు చెట్లతో కళకళలాడితేనే పశువులు, జంతువులు, ఇతర జీవరాశులు జీవించడానికి వీలుంటుంది. జల, భూ, ధ్వని, సముద్ర, ఉష్ణ, వ్యర్థ, ఘన, ద్రవపదార్థాల కాలుష్యం, రేడియో ధార్మికత, పట్టణీకరణ పెరగడం వల్ల అడవులు నశించిపోతున్నాయి. సరస్సులు, సముద్రాలు, నదులు, భూగర్భ జలాలు మనుషులు చేసే తప్పిదాల వల్ల కలుషితమవుతున్నాయి. అంతేకాకుండా వేటగాళ్ల బారినపడి కొన్నిరకాల జాతుల జంతువులు కాలక్రమేణా కనమరుగవుతున్నాయి.
పూర్వకాలంలో వరిపంట రాగానే ప్రతి రైతు ఇంటిముందల వరికంకులుండేవి. ఇంటిముందు వేలాడదీసిన వరి కంకులను రకరకాల పిట్టలు వచ్చి ఆహారంగా తినేవి. ఈ ఆధునిక కాలంలో ఆ సంప్రదాయమే కనుమరుగైపోయింది. తద్వారా పిట్టల జాతి కనుమరుగైపోతున్నది. అంతేకాకుండా ఇప్పుడు రైతు పండించే పంటలకు విస్తారమైన పురుగుమందులు వేయడం, సెల్టవర్ రేడియేషన్లతో పక్షులు కానరాకుండాపోతున్నాయి.
భారత ప్రభుత్వం అంతరించిపోతున్న వన్యప్రాణుల సంరక్షణే లక్ష్యంగా వాటి పునరుజ్జీవనం కోసం కొన్ని చట్టాలను చేసింది. ఆ చట్టాలు ఇలా ఉన్నాయి. 1972లో వన్యప్రాణి సంరక్షణ కోసం మొదటి చట్టాన్ని చేశారు. ఈ చట్టం ప్రకారం వన్యప్రాణులను వేటాడినా, వాటి స్వేచ్ఛకు భంగం కలిగించినా చట్టరీత్యా అది నేరం. 1972లో సింహాల రక్షణ కోసం Project lion, 1973లో పులుల రక్షణ కోసం Project tiger, 1975లో సముద్ర నక్షత్ర తాబేళ్ల రక్షణ కోసం Project sea tortoise, 1987లో ఖడ్గమృగాల రక్షణ కోసం Project rhino, 1992లో ఏనుగుల రక్షణ కోసం Project elephant, 2009లో మంచు చిరుతల రక్షణ కోసం Project Leopard కార్యక్రమాల ద్వారా వన్యప్రాణులను, వాటి మనుగడను సంరక్షిస్తున్నది.
Community forest Management చట్టం ప్రకారం అడవులకు గాని, అడవి జంతువులకు గాని నష్టం వాటిల్లకుండా గిరిజనులు అడవిని ఉపయోగించుకుంటూ జంతువులను, అడవులను రక్షించాలి. మానవ సంబంధిత వ్యర్థ పదార్థాల వల్ల నదులు, సరస్సులు, చిత్తడి ప్రాంతాలు, సముద్రాలు ఏ విధంగా కాలుష్యానికి గురవుతున్నాయనే విషయాన్ని 1962లోనే Silent Spring అనే గ్రంథంలో రాచెల్ కార్సన్ అనే శాస్త్రవేత్త వివరించారు.
వన్యప్రాణులను రెండు రకాలుగా సంరక్షించవచ్చు. ఎక్కడైతే జంతువులు అంతరించిపోతున్నాయో ఆ ప్రాంతంలో పరిరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం. ఇంకొకటి ఆవాసేతర పరిరక్షణ. ఏవైతే అంతరించిపోయే జంతువులుంటాయో వాటికి సంబంధించిన కణాలను పరిరక్షించడం. మొక్కలైతే కణజాలాలను పరిరక్షించడం.
తెలంగాణలో వన్యప్రాణుల సంరక్షణ కోసం మహావీర్ హరిణవనస్థలి, మృగవని జాతీయ పార్కులను హైదరాబాద్లో నెలకొల్పారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారం, పాకాలలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత, కవ్వాల్ , మెదక్ జిల్లాలో పోచారం, మంజీరా కేంద్రాలను ఏర్పాటుచేశారు.
దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం రాజీవ్గాంధీ పులుల అభయారణ్యం మహబూబ్నగర్, కర్నూల్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నది. పాత గణాంకాల ప్రకారం మన భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు 535, జాతీయ పార్కులు 104, బయోస్పియర్ రిజర్వులు 18. ప్రపంచంలోనే అతిపెద్ద సీతాకోక చిలుకల పార్కు కర్ణాటకలో ఉన్నది. మణిపూర్లోని తేలియాడే జాతీయ పార్క్ కైబుల్ లాంజావ్ ప్రసిద్ధి చెందింది.
అంతరించే జాతుల పునరుద్ధరణ ప్రాజెక్టు ద్వారా ప్రపంచంలోనే అంతరించిపోయే జంతువులను గుర్తించారు. అందులో భాగంగా Great Indian busted, sanghi, dugang, gangtic river dolphin మొదలైనవాటిని రక్షించడం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వాలే కాకుండా ప్రతి ఒక్కరూ తమ విధిగా వన్యప్రాణులను, అడవులను సంరక్షించేందుకు కృషిచేయాలి. ప్లాస్టిక్ వాడకాన్ని, పురుగుల మందు వాడకాన్ని తగ్గించాలి. నేడు సహజసిద్ధంగా బతికే వన్యప్రాణులను కృత్రిమంగా పెంచే పరిస్థితి వచ్చింది. ఏవైనా జంతువులను, పక్షులను చూడాలంటే నేటితరం పిల్లలు జూ పార్కులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అడవుల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వన్యప్రాణుల జీవనానికి కృషిచేద్దాం. జంతువులను అడవి తల్లి ఒడిలో స్వేచ్ఛగా బతుకనిద్దాం. ‘పర్యావరణ సంరక్షణ- సర్వ ప్రాణుల రక్షణ’ నినాదాన్ని మనవంతుగా పాటిద్దాం.
(వ్యాసకర్త: తెలుగు అధ్యాపకురాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల)
కొమ్మాల సంధ్య
91540 68272