నియంతలు ప్రజలను భ్రమల్లో ఉంచి సర్వాధికారాలను గుప్పిట పెట్టుకొని దేశాన్ని ఏ విధంగా పతనావస్థకు తీసుకువస్తారనే దానికి చరిత్రలో అనేక ఉదాహరణలున్నాయి. తాజా ఉదాహరణ శ్రీలంక. అయితే భ్రమల్లోంచి భయటపడిన ప్రజానీకం ఆ నియంతల అధికారాన్ని కుప్పకూలుస్తుంది అనే దానికి కూడా శ్రీలంక నిదర్శనంగా నిలుస్తున్నది. ఒక హిట్లర్, ఒక ముస్సోలిని లాగా రాజపక్స సోదరులు కూడా చరిత్ర చీకటి కోణంలోకి వెళ్లిపోయారు.
‘విష బీజాలు నాటిన వారు, వాటి ఫలాలను అనుభవించక తప్పదు’ బంగ్లా సైనిక పాలకుడు ముజిబుర్రహ్మాన్ హతుడైనప్పుడు వాజ్పేయి చేసిన వ్యాఖ్య ఇది. విద్వేష రాజకీయాలు నడిపిన వారు, ఆ విద్వేషాలకే బలికాక తప్పదు. ఇది చరిత్ర చెబుతున్న పాఠం! ప్రపంచ వ్యాప్తంగా నియంతలందరిదీ అదే కథ, అదే గతి!
2005లో మహింద రాజపక్స అధ్యక్షుడిగా ఎన్నికయ్యే నాటికి కొద్దికాలం ముందే శ్రీలంక ప్రభుత్వానికి, తమిళ టైగర్స్కు మధ్య అవగాహన కుదిరింది. కానీ మహింద విద్వేష, హింసోన్మాద అజెండా అమలు చేయదలుచుకున్నాడు. తమిళ టైగర్లపై యుద్ధాన్ని ప్రకటించాడు. గతంలో సైన్యంలో పనిచేసిన మహింద రాజపక్స సోదరుడు గొటబయ రక్షణ కార్యదర్శిగా ఉండి మహిందకు సహకరించాడు. సింహళులలో జాతి ఉన్మాదాన్ని రెచ్చగొట్టారు. తమిళటైగర్లను నిర్మూలించిన మహింద రాజపక్స సింహళీయులకు ఆరాధ్య నాయకుడు అయ్యాడు. ప్రజలలో జాత్యహంకారాన్ని రెచ్చగొట్టిన మహింద రాజపక్స రెండవ సారి కూడా (2019లో) దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో అహంకారం అతడిని కమ్మేసింది.
ప్రజల మధ్య మతాల పేర చిచ్చుపెడితే, అది రగులుతున్నంత వరకు తమ అధికారానికి ఢోకా లేదని రాజపక్స సోదరులు భావించారు. ఇందుకోసం ‘బోడు బాల సేన’ అనే దళాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉగ్రవాద దళం భారీ ఎత్తున మైనారిటీ ముస్లింల మీద దాడులు సాగించింది. తాము ఎంత అవినీతికి పాల్పడినా, అరాచకానికి పాల్పడినా, చట్టాన్ని ఉల్లంఘించినా ఎదురు లేదని భావించారు. ఎదురు మాట్లాడినవారిని దేశద్రోహులుగా ముద్రవేయడం, వారిపై ప్రచారాలు సాగించడం, బెదిరింపులు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయి.
తమిళులను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోయించిన వాడు, సింహళులను కూడా అదే రీతిలో ఊచకోత కోయిస్తాడు అనేది అవగాహనకు వచ్చింది. రాజపక్స సోదరుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాజకీయ పక్షాలన్నీ ఏకమయ్యాయి. ఫలితంగా 2015 అధ్యక్ష ఎన్నికలలో మహింద రాజపక్స ఓటమి చెందాడు. పార్లమెంటు ఎన్నికలలో కూడా వీరి ముఠా పరాజయం పాలైంది.
తమకు పరాజయం తప్పదని ముందే పసిగట్టిన మహింద రాజపక్స సోదరులు సైనిక తిరుగుబాటు చేయించి అధికారాన్ని కాపాడుకోవాలని భావించారు. పార్లమెంటును రద్దు చేయాలని కూడా కుట్రపన్నారు. సైన్యాధ్యక్షుడిని, పోలీసు శాఖ అధిపతిని, అటార్నీ జనరల్ను పిలిపించుకొని ఎన్నికలను రద్దు చేసి, ఎమర్జెన్సీ విధించాలని, పరిస్థితిని అదుపు చేయడానికి వీధుల్లోకి సైనిక శకటాలను పంపించాలని ఒత్తిడి తెచ్చారు. కానీ వారు తిరస్కరించారు. దీంతో చేసేది లేక ఓటమిని అంగీకరించారు. పార్లమెంటులో మెజారిటీ సాధించి ప్రధాని పదవి పొందాలని కూడా మహింద ప్రయత్నించి విఫలమయ్యాడు.
సిరిసేన దేశాధ్యక్షుడు, రణిల్ విక్రమ సింఘె ప్రధాని అయ్యారు. తదుపరి ఎన్నికలలో గెలువడానికి రాజపక్స సోదరులు కుతంత్రాలు మొదలుపెట్టారు. తమిళుల గొడవ పాతదైపోయింది. ఇక ముస్లింలను బూచిగా చూపించి, మెజారిటీ సింహళ- బౌద్ధ ప్రజలలో భయాందోళనలు సృష్టించి, విద్వేషాలు రగిలించాలని, తాము అధికారానికి రావడానికి అదే మార్గమని భావించారు. రాజపక్స సోదరులు అప్పటికే పార్టీలోని సీనియర్ నాయకులను అణగదొక్కారు. అయినా పార్టీ మొత్తం చేతికి రాలేదు. దీంతో ‘శ్రీలంక పెరుమన పోడుజన’ అనే పార్టీని సొంతంగా స్థాపించుకున్నారు.
తమ వల్లనే దేశం భద్రంగా ఉంటుందని ప్రచారం చేసుకున్నారు. దేశాధ్యక్షుడు సిరిసేన ముందుంటే, తెరవెనుక రాజపక్స సోదరుల పన్నాగాలు సాగుతున్నాయి. రెండు సార్లకు మించి తాను పోటీ చేయకూడదు కనుక, మహింద రాజపక్స తన తమ్ముడు గోటబయకు దేశాధ్యక్ష పదవి అప్పగించి, తాను ప్రధాని పదవి చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. ఎన్నికల సందర్భంలో గోటబయ తన వాగ్దానాలతో అరచేతిలో స్వర్గాన్ని చూపించాడు. తలసరి ఆదాయం 2025 నాటికి 6, 500 డాలర్లు అవుతుందని నమ్మించాడు. ప్రజలు నమ్మి గోటబయకు భారీ మెజారిటీని కట్టబెట్టారు. ఈ మెజారిటీతో సుస్థిర పాలన అందిస్తూ దేశాన్ని అభివృద్ధి చేస్తాడని ప్రజలు భావించారు.
కానీ మందబలం ఉన్నది కదా అని ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నాడు. తనకు కావలసిన వ్యాపారులకు అందినంత పంచిపెట్టాడు. పార్టీలు, పద్ధతులు పాటించకుండా, తన వర్గీయులకు పదవులు కట్టపెట్టాడు. పార్టీని, పార్లమెంటును నామమాత్రం చేశాడు. అంతా ఏకపక్ష పాలన. అధికార కేంద్రం తాను ఒక్కడే. ప్రజాస్వామ్యం అంటే పేరుకు లేకుండా పోయింది. తలసరి ఆదాయం తగ్గిందే తప్ప పెరుగలేదు. ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. 7, 50, 000 మంది అదనంగా పేదరికంలోకి దిగజారారు.
గోటబయ రాజకీయ సహచరులను అణగదొక్కాడు. ప్రజలకు హక్కులు లేకుండా పోయాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. గోటబయ ఏది చెబితే అదే శాసనం. దేశ నాయకుడు రాత్రికిరాత్రి తీసుకునే నిర్ణయాలకు అష్టకష్టాలు పడటం ప్రజల వంతు! అచ్చమైన నిరంకుశుడి లక్షణాలు ఇవి. దాని పర్యవసనంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయింది. విదేశీ మారక ద్రవ్య నిలువలు అడుగంటి పోయాయి. దీంతో రసాయన ఎరువులు నిషేధిస్తే ఆమేరకు విదేశీ మారక నిలువలు మిగులుతాయనే అనాలోచిత నిర్ణయానికి వచ్చాడు. కానీ ఈ నిర్ణయం తీవ్ర ఆహార సంక్షోభానికి దారి తీసింది.
ఒక అంచనా ప్రకారం రసాయన ఎరువుల నిషేధం వల్ల శ్రీలంకకు ఏటా 400 మిలియన్ డాలర్లు మిగులుతాయి. వీటిని ఇతర వస్తువులు దిగుమతి చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని దేశాధ్యక్షుడు భావించాడు. హటాత్తుగా రసాయన ఎరువుల నిషేధం వల్ల రైతులు లబోదిబో అన్నారు. ఎరువులు లేక వరి దిగుబడి ఆరు నెలల్లో 20 శాతం పడిపోయింది. ఆహార ఉత్పత్తిలో స్వయం పోషకంగా ఉన్న శ్రీలంక .దిగుబడి తగ్గడంతో 450 మిలియన్ డాలర్ల మేర బియ్యం దిగుమతి చేసుకోవలసి వచ్చింది. రసాయన ఎరువుల నిషేధం వల్ల మిగిలింది బియ్యం దిగుమతితో ఊడ్చుకుపోయింది. ధాన్యం కొరత ఏర్పడి ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. ఫ్యాక్టరీలు మూతపడి ఉద్యోగాలు పోయాయి. పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి పలువురు స్త్రీలు వ్యభిచారంలోకి దిగారు. ఈ కష్టాలు భరించలేకనే జనం తిరుగుబాటు చేశారు.
గోటబయ దేశం విడిచి పారిపోయి విదేశాలలో తలదాచుకుంటున్నాడు. మహింద రాజపక్స నావికా దళం రక్షణలో బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నాడు. నియంతలకు ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే తప్ప, దేశాన్ని పాలించే సమర్థత ఉండదు. అందుకే శ్రీలంక అల్లకల్లోలమైంది.
ఇటలీలో ముస్సోలినీని కాల్చిచంపడమే కాదు, మృతదేహాన్ని తలకిందులుగా వేలాడ దీసి చెప్పులతో కొట్టారు.
హిట్లర్ భార్యతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. తమ మృత దేహాలను పూర్తిగా తగుల బెట్టాలని ముందే ఆదేశాలు జారీ చేశాడు.
నెపోలియన్ ప్రవాస శిక్ష అనుభవిస్తూ ఒక దీవిలో దిక్కులేకుండా మరణించాడు.
రొమేనియా ప్రజలు తిరగబడటంతో నియంత సూసెస్క్యూ భార్యతో పాటు విమానంలో పరారవుతూ దొరికి పోయాడు. చేతులు వెనక్కి విరిచికట్టి కాల్పులు జరుపుతున్న వేళ, తాను మరణిస్తున్నానని తెలిసి దీనంగా ఏడ్చాడట!
ముషార్రఫ్ మరణ శిక్ష పడి, దేశం నుంచి పరారయ్యాడు. ఆ తరువాత రద్దయినా, చావు బతుకుల మధ్య దయనీయంగా బతుకుతున్నాడు.
‘విష బీజాలు నాటిన వారు, వాటి ఫలాలను అనుభవించక తప్పదు’ బంగ్లా సైనిక పాలకుడు ముజిబుర్రహ్మాన్ హతుడైనప్పుడు వాజ్పేయి చేసిన వ్యాఖ్య ఇది.
విద్వేష రాజకీయాలు నడిపిన వారు, ఆ విద్వేషాలకే బలికాక తప్పదు.
ఇది చరిత్ర చెబుతున్న పాఠం!
ప్రద్యుమ్న