మొదటి బేతరాజు అనుమకొండకు చేరేవరకు కాకతీయుల కథ చిన్న ప్రాంతానికి ఏలికలుగా సాగింది. అందుకే కొన్ని శాసనాల్లో వంశావళిలో ఉన్న ప్రస్తావనలు తప్ప ఎక్కువ వివరాలు తెలియవు. ఇంకో విశేషమేమంటే తొలి కాకతీయుల నిర్మాణాలపై ఆ తర్వాత వచ్చిన కాకతీయరాజుల నిర్మాణాలు, ఇంకా ఆ తర్వాత వచ్చిన రాజ్యాల ఆధారాలు చేరి తొలినాళ్ల చరిత్రకు శాసనాలే ఆధారంగా మిగిలాయి. సాహిత్య ఆధారాలు కూడా కొంతమేరకు ఉపయోగపడుతాయి. రుద్రదేవుడు స్వతంత్రుడయ్యే వరకు కాకతీయుల చరిత్ర, భౌతిక ఆధారాలు ప్రస్తుత మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకే పరిమితమయ్యాయి. చరిత్ర ఎక్కువగా చదవనివారికి కాకతీయులనగానే రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, రెండవ ప్రతాపరుద్రుడు మాత్రమే తెలుసు. అయితే స్వతంత్ర కాకతీయులైన ఈ ఐదుగురు, తొలి కాకతీయ రాజులు వేసిన పునాదులపైనే ఎదిగారని తెలుసుకోవాలి.
కాకతి నుంచి కురవి వరకు: శాసనాధారాల నుంచి మనకు తెలుస్తున్న మొదటి కాకతీయ రాజు పేరు వెన్న. ఇతడు కాకతి పట్టణ పాలకుడని అంటారు కాకతీయులపై డాక్టరేట్ సిద్ధాంత వ్యాసం కోసం పరిశోధన చేసిన పరబ్రహ్మ శాస్త్రి. సుమారు క్రీ.శ.800-815 వరకు పాలించిన వెన్న పేరే కాకతీయ వంశావళిలో మొదటి పేరు. ఇతడి తర్వాత వచ్చిన మొదటి గుండన, రెండవ గుండనల గురించి ఎక్కువ వివరాలు ఇప్పటికైతే తెలియవు. అయితే వీళ్లు క్రీ.శ.815-865 వరకు పాలించి ఉంటారని అంచనా.
మూడవ గుండన (గుండ్యన) నుంచి కాకతీయ చరిత్ర ఇంకొంచెం స్పష్టంగా ఉన్నది. క్రీ.శ.895 కాలంలో రాష్ట్రకూట రాజు రెండవ కృష్ణ సామంతుడిగా మూడవ గుండన, వేంగీ (తూర్పు) చాళుక్యులపై చేసిన యుద్ధం ఆంధ్రప్రదేశ్లోని నిడదవోలు దగ్గర పెరువంగూరు దగ్గర జరిగిందని మల్లంపల్లి సోమశేఖరశర్మ గుర్తించారు. వేంగీ చాళుక్యరాజు దానార్ణవ జారీచేసిన మాంగల్లు శాసనంలో ఈ మూడవ గుండన వీరమరణం పొందినట్టు ఉన్నది. ఈ ఆధారంతో రెండు విషయాలు స్పష్టమవుతున్నాయి. మొదటిది, మూడవ గుండ్యన నుంచి మనకు తొలినాటి కాకతీయ స్థలాల గుర్తింపు జరుగుతున్నది, రెండవది, కాకతీయులు రాష్ట్రకూట రాజుల సామంతులన్న విషయం.
మూడవ గుండన తర్వాత రాజు ఎర్ర. ఇతడి కాలంలో కాకతీయులు మొదట తెలంగాణలో స్థిరపడిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ‘కుర్రవాడి’ దాని చుట్టుపక్కల ప్రాంతాల
పాలకుడు ఎర్ర అని బయ్యారం శాసనం ద్వారా తెలుస్తున్నది. మహబూబాబాద్ జిల్లాలోని ‘కురవి’ లేక ‘కొరివి’నే ‘కుర్రవాడి’. వేంగీ చాళుక్యరాజు చాళుక్య భీముడి కాలంలో రాష్ట్రకూట రాజు రెండవ కృష్ణ ఈ ‘కుర్రవాడి’ ప్రాంతంలోని కొంత భాగాన్ని జయించి కాకతీయ ఎర్రను స్థానిక పాలకుడిగా నియమించాడని కొరవి శాసనంలో ఉన్నది. దీంతో కాకతీయులు తెలంగాణలో పాలించిన మొదటి ప్రాంతం కొరివి అనేది స్పష్టమైంది. ఆ తర్వాత వచ్చిన ఎర్ర కొడుకైన బేతియ గురించి ఎక్కువ తెలియదు.
సామంత విష్టి వంశం: కాజీపేట దర్గా శాసనం కాకతీయ వంశాన్ని ‘సామంత-విష్టి వంశహ’ అని వర్ణించింది. క్రీ.శ. 1090 కాలం నాటి ఈ శాసనం కాకతీయ వంశ వృత్తి మూలాలను తెలుపుతున్నదనుకోవచ్చు. పరబ్రహ్మశాస్త్రి ‘విష్టి’ అనే పదాన్ని ‘వృష్ణి’ పదానికి రూపాంతరంగా భావించారు. ఎందుకంటే రాష్ట్రకూటులు కృష్ణుడి వంశమైన ‘వృష్ణి’ నుంచి వచ్చామని చెప్పుకొన్నారు కాబట్టి వారి సామంతులు కూడా ‘వృష్ణి’ రూపాంతరమైన విష్టి అయినారని ప్రతిపాదించారు. ఈ ‘విష్టి’ పదాన్ని రాజకీయార్థిక పరిభాషలో అర్థం చేసుకోవాలి. విష్టి అనే పదం ‘వృష్ణి’గా కాకుండా శాతవాహన కాలం నుంచే ‘బలవంతపు శ్రమ’ను (వెట్టిచాకిరిని) సూచిస్తున్న విష్టి (forced labour) అనే పదంగా చూడాలి.
చాతుర్వర్ణ వ్యవస్థలో నాలుగో వర్ణమైన శూద్ర కులాలు భూస్వామ్యం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ‘బలవంతపు శ్రమ’ నుంచి బయటపడి, రైతులుగా ఎదిగారని, వారే విష్టి కులాలుగా మారినారనుకోవాలి. కర్ణాటకలో ‘బిట్టి చక్రి’ అనే పదం ‘విష్టి’ పదానికి కన్నడ రూపాంతరమే. ఈ ‘విష్టి’నే మనం వెట్టి అని పిలుస్తాం. భూస్వామ్య వ్యవస్థ ఎదుగుతున్న క్రమంలో శూద్రకులాలకు, వెట్టికీ ఉన్న సంబంధం అర్థం చేసుకోగలిగితే కాకతీయుల ‘సామం త విష్టి’ మూలం కృష్ణుడి వంశమైన ‘వృష్ణి’ తో కాకుండా ‘వెట్టి’ అనే భూస్వామ్య సంబంధ పదంగా అనిపిస్తుంది. ఏదేమైనా మన చరిత్రను రాజకీయార్థిక కోణం నుంచి రాసుకునే ప్రయత్నం ఇంకా జరగాల్సి ఉన్నదని ఇలాంటి ప్రశ్నలు, సందర్భాలు మనకు గుర్తు చేస్తుంటాయి.
డా. ఎం.ఎ. శ్రీనివాసన్
81069 35000