వజ్రోత్సవ విశ్లేషణ
ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావని వజ్రోత్సవ వేడుకలు జరుపుకొంటున్న ఈ తరుణంలో పెరగాల్సిన భారత రూపాయి విలువ ఎనభై రూపాయలకు పడిపోవడం యాదృచ్ఛికమేమీ కాదు. దానికి భారత పాలక వర్గాల దార్శనికత లేని ఆర్థిక విధానాలే ప్రధానకారణం. ఒక దేశ ఆర్థిక సామాజిక భవిష్యత్ను నిర్దేశించడానికి 75 ఏండ్ల కాలం తక్కువేమీ కాదు.ఈ దేశ పాలకవర్గాలు మొదటి నుంచి స్వీయ అభివృద్ధి నమూనాపై, స్థానిక ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిసారించకుండా, కార్పొరేట్లు, బడాబాబుల జేబులు నింపడానికి విదేశీ చమురు, వస్తు దిగుమతులకు ద్వారాలు తెరిచారు.
ఫలితంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చమురు ధర పెరుగుదల ప్రధానంగా డాలర్తో ముడిపడింది. ఈ డెబ్బయి అయిదేండ్లలో భారత కరెన్సీ మారకం రేటు రికార్డు స్థాయిలో డాలరుకు దాదాపు 80 రూపాయలకు క్షీణించింది. అయిదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ దిశగా పరుగులిడుతున్నామని గొప్పలు చెప్పుకొంటున్న దశలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితిలోకి జారిపోతున్నది. ఈ నేపథ్యంలో డాలర్ ఆధిక్యతతో ఛిద్రమౌతున్న భారత ఆర్థికవ్యవస్థను అవగాహన చేసుకోవాలి.
1944 నుంచి నేటి వరకూ అమెరికా కరెన్సీ డాలర్ విలువ ప్రాతిపదికగా అంతర్జాతీయంగా అన్ని ఇతర దేశాల కరెన్సీల విలువలను నిర్ధారిస్తున్నారు. 1944లో అమెరికాలోని బ్రెట్టన్ ఉడ్స్ అనే చోట ఈ మేరకు వివిధ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా కరెన్సీ డాలర్ను బంగారంతో ముడిపెట్టారు. దీంతో అమెరికా డాలర్ అంతర్జాతీయ కరెన్సీగా ముందుకు వచ్చింది. అప్పటికే అమెరికా అగ్రరాజ్యంగా ఆవిర్భవించింది. 1944 అనంతర కాలంలో వివిధ దేశాలు అంతర్జాతీయ లావాదేవీలకు డాలర్ను వినియోగించాల్సిన అగత్యం ఏర్పడింది. అమెరికా ఈ డాలర్ ఆధారిత వ్యవస్థకు నిర్వాహకకర్తగా, తాను ముద్రించిన ప్రతి డాలర్కు ఆ మేరకు వెలకట్టిన బంగారాన్ని నిల్వ పెట్టాల్సి ఉంటుంది. కానీ 1971 ఆగస్టు 15న అమెరికా ఏకపక్షంగా డాలర్ను బంగారంగా మార్చడా న్ని నిలిపివేసి ఫియట్ కరెన్సీగా ప్రకటించింది. ఫియట్ కరెన్సీ అంటే ప్రభుత్వం ఏర్పాటుచేసిన చట్టపరమైన ద్రవ్యం.
క్రమంగా పెరిగిన డాలర్ విలువ
డాలర్ విలువ 1947లో రూ.4.76 మాత్రమే ఉండేది. అప్పుడు భారత్కు ఆర్థిక పాటవం లేకున్నా, అప్పులు కూడా లేకపోవడం వల్ల నాటి రూపాయి విలువ డాలర్తో కొద్ది తేడాతో నిలిచింది. కాగా 1950 దశకం అనంతరం భారత దేశంలో పంచవర్ష ప్రణాళికలు, పారిశ్రామికీకరణ మొదలయ్యాయి. దీనికోసం విదేశీ రుణాలు అవసరమ య్యాయి. అలాగే 1962, 65లలో మన దేశానికి చైనా, పాకిస్థాన్లతో యుద్ధాలు జరిగాయి. ఆయుధాల కోసం విదేశాల వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే 1966 నాటికి దేశీయంగా ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరగసాగింది. అంటే రూపాయి విలువ, లేదా దాని నిజ కొనుగోలు శక్తి క్షీణించసాగాయి. దీనితో అమెరికా డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువను 1966లో భారీగా తగ్గించుకోవాల్సి వచ్చింది. అనంతర కాలంలో కూడా ద్రవ్యోల్బణ పరిస్థితులు కొనసాగాయి. డాలరు విలువ 1970లో రూ.7.5 కాగా 1980లలో రాజకీయ అనిశ్చితి నడుమ దేశీ య కరెన్సీ విలువ, కొనుగోలు శక్తి మరింతగా రూ.10 మేర క్షీణించాయి.
1991లో దేశంలో ఎగుమతి-దిగుమతి సంక్షోభం ఏర్పడింది. అంటే మన ఖజానాలోని విదేశీ మారక నిల్వలు, మూడు వారాల దిగుమతులకు మాత్రమే సరిపడే పరిస్థితి. దీంతో మనదేశం కొంత బంగారాన్ని విదేశాలకు తాకట్టు పెట్టింది. అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) నుంచి రుణం కోరింది. ఈ క్రమంలో మనదేశంలో ఐఎంఎఫ్ షరతుల ప్రకారం ఆర్థిక సంస్కరణలు ఆరంభమయ్యాయి. ఈ పరిణామాలలో భాగంగానే 1992లో రూపాయి విలువను- పాక్షికంగా మార్కెట్ ఆధారితంగా మార్చారు. అప్పుడు డాలర్కు రూ.30. అనంతరకాలంలో డాలర్తో రూపాయి మారకం విలువ- ప్రభుత్వాలు, బ్యాంకుల మధ్య జరిగే నిర్ణయాల మేరకు కాక, మార్కెట్లోని డిమాండ్-సరఫరాల ఆధారితమైనదిగా మారింది. ఈ నేపథ్యంలోనే 2011లో, మళ్లీ 2013లోనూ రూపాయి విలువ కొద్ది మాసాలపాటు భారీగా క్షీణించింది. 2014లో ఎన్డీయే కేంద్రంలో అధికారం చేపట్టే నాటికి 63 రూపాయలకు చేరింది. ఈ ఏడాది డాలర్తో మారకం రేటు 7 శాతం క్షీణించడంతో, ఇప్పుడు ఒక్కో డాలరూ ఎకాఎకి 80 రూపాయల స్థాయిని తాకి, గగ్గోలు పుట్టిస్తున్నది. ద్రవ్యోల్బణం ప్రజ్వరిల్లుతున్నది. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో ఒకటిన్నర శాతం దాకా ఉన్న కరెంటు ఖాతా లోటు మూడు శాతానికి ఎగబాకడమే పొంచి ఉన్న ముప్పును తెలియజేస్తున్నది.
డాలర్ ధర పెరిగిందంటే నిత్యావసరాలకు రెక్కలు డాలర్ ధర పెరిగిందంటే చమురు ధరలు పెరుగుతాయి. అంతర్జాతీయంగా చమురును డాలర్లలో కొనుగోలు చేస్తుంటారు. అంటే చమురు ధరలు పెరిగితే డాలర్కు డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇతర కరెన్సీలతో పోల్చినప్పుడు డాలర్ బలపడుతుంది. మన దేశ కరెన్సీ బలహీనపడటంతో ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలకు రెక్కలు వస్తుంటాయి. ఫలితంగా కూరగాయల వంటి నిత్యావసరాల ధరలు కూడా ఎగబాకుతాయి.
ఆర్థిక వ్యవస్థలోని బలహీనతలు
దేశ ఆర్థిక వ్యవస్థలోని బలహీనతల వల్ల రూపాయి విలువ అత్యధిక స్థాయిలో పతనమయింది. ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 2021-22లో జరిపిన అంతర్జాతీయ వాణిజ్యం విలువ ఒక లక్ష కోట్ల డాలర్లు. ఇందులో ఎగుమతుల విలువ 40,000 కోట్ల డాలర్లు కాగా, 60,000 కోట్ల డాలర్ల దిగుమతులున్నాయి. దీనితో పాటుగా 8,300 కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వీకరించింది. దిగుమతులు ఎక్కువైతే వాణిజ్యలోటు పెరిగిపోయి కరెన్సీ విలువ క్షీణిస్తుంది. భారతదేశం ఎగుమతుల కంటే అధికంగా దిగుమతుల మీద ఆధారపడింది. ముడి చమురుతోపా టు, బంగారం, వజ్రాలు, ఎరువులు, వంట నూనెలు, బొగ్గుతో పాటు అతి సాధారణమైన పెన్ను, పెన్సిల్ మొదలుకొని అతి ఖరీదైన విమానాలు, యుద్ధ విమానాలు , నౌకలు, అణుశక్తి వరకు దిగుమతి చేసుకుంటున్నది. దీనితో విదేశీమారక చెల్లింపుల సంక్షోభం ఏర్పడుతుంది. రూపాయి విలువ పడిపోయే కొద్దీ దిగుమతి చేసుకునే సరుకుల ధరలు, వాటితో ఉత్పత్తి చేసే వస్తువులన్నింటి ధరలు పెరుగుతాయి.
వస్తు సేవలపై డాలర్ ప్రభావం
ఉత్పాదకాల ధరలు పెరిగి చివరికి వస్తు గిరాకి తగ్గడంతో పరిశ్రమలు మూతపడుతాయి. దిగుమతుల మీద ఆధారపడితే రూపా యి విలువ మరింత పలుచనవుతుంది. రూపాయి ఎంత చిక్కితే మనం దిగుమతి చేసుకునే వస్తువులపై అంత ప్రభావం పడుతుంది. మనం చెల్లించాల్సిన డబ్బు పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు- సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, డిజిటల్ కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల్లో వాడే సర్క్యూట్ బోర్డులను దిగుమతి చేసుకుంటున్నందు వల్ల వాటన్నింటి ధరలపై రూపాయి క్షీణత ప్రభావం ఉంటుంది. దిగుమతి చేసుకునే విలాసవంత కార్లు, బైక్లతోపాటు కార్ల విడిభాగాల ధరలు మరింత పెరగవచ్చు. రూపాయి పతనంతో విదేశీ ప్రయాణం, విద్య ఖరీదు అవుతాయి. విదేశాల్లో విద్యాభ్యాసం చేయబోయే వారి ఫీజులు, ఖర్చుల రూపేణా అధిక మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది.
భవిష్యత్ భారతావనికి ఒక స్పష్టమైన విజన్, ప్రణాళికలను ఆవిష్కరించి ఎగుమతులు పెంచడం కోసం ప్రభుత్వం కృషి చేయాలి. సాంకేతికంగా జరిగిన అభివృద్ధితో నేడు మన ఎగుమతులు విస్తరించడానికి ఎన్నో అవకాశాలున్నాయి. వాణిజ్యం, ఎగుమతుల బలంతోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యధిక వాటా సాధించగలుగుతాం.
నిజానికి ఈరోజు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలతోనూ మన దేశానికి వాణిజ్య, వ్యాపార మార్గాలు అనుసంధానమై ఉన్నాయి. దీనిని సానుకూలతగా మార్చుకొని, దేశంలో తయా రీ రంగాన్ని మరిన్ని రెట్లు పెంచాలి. నాణ్యతలో కూడా పోటీ పడాలి. ధర కన్నా వస్తువు నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చినపుడే వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్ లభిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని, నిరుద్యోగాన్ని సాధ్యమైనంతగా నియంత్రించాలి. దీర్ఘకాలికంగా ఇంధన రంగంలో ప్రత్యామ్నాయాల అన్వేషణ చురుగ్గా సాగాలి. ఏటా వేల కోట్ల రూపాయలు ధారపోసి విదేశాల నుంచి వంటనూనెలు, పప్పులు దిగుమతి చేసుకునే దుర్దశ నుంచి బయటికి రావాలి. ఆహారపంటల్లో ఇప్పటికీ స్వావలంబన సాధించలేకపోయాం. రూపాయి బలపడితేనే ఆర్థిక రంగం కోలుకుంటుంది. పకడ్బందీ కార్యాచరణతో, ప్రతిబంధకాలను అధిగమిస్తూ పురోగమించాల్సిందే. లేకుంటే రాజకీయ, ఆర్థిక రంగాల్లో శ్రీలంక వంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి.
(వ్యాసకర్త: అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలంగాణ విశ్వవిద్యాలయం )
డాక్టర్ ఎ.పున్నయ్య