మన 75 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని ఒక ‘ఉత్సవం’గా జరుపుకోవడమంటే, 1947కు ముందటి వందల సంవత్సరాల చరిత్రను కూడా ఒక ఉత్సవంగా నిర్వహించుకోవటమే. ఎందుకంటే, ఒక దేశానికి చారిత్రక నేపథ్యమనే పునాది లేకుండా వర్తమానం, భవిష్యత్తు ఉండవు. మరీ ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఒకటున్నది. మనం ఈ 75 ఏండ్ల కాలంలో మన లక్ష్యాలు, విలువలుగా చెప్పుకొంటున్న వాటన్నింటికి పునాదులు ఆ చారిత్రక నేపథ్యంలో ఉన్నాయి తప్ప, 1947లోనే కొత్తగా వచ్చినవి కావు.
మనం స్వాతంత్య్ర కాలంలో లక్ష్యాలు, విలువలుగా చెప్పుకొంటూ వస్తున్నవి అనేకం ఉన్నాయి. వాటిని రాజ్యాంగంలో, చట్టాలలో, ప్రణాళికా పత్రాలలో పొందుపరచుకుంటూ వస్తున్నాం. వివరాల్లోకి వెళ్లినపుడు అవి ఎన్ని కన్పించినా, సారాంశం రూపంలో వాటిని అయిదింటిగా చెప్పవచ్చు. 1. ప్రజాస్వామిక వ్యవస్థ స్థాపన. నియంతృత్వానికి అవకాశం ఇవ్వకపోవటం, 2. దేశంలోని అందరు ప్రజలు, అన్నివర్గాలు, అన్ని ప్రాంతాల సమతుల అభివృద్ధి. చారిత్రకంగా వెనుకబడిన ప్రజలు, ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ- కొత్త అసమానతలు పెరగకుండా చర్యలు, 3.సహకార ఫెడరలిజాన్ని పాటించటం. అన్ని ప్రాంతాలకు తగు అవకాశాలు, అధికారాలు కల్పించటం. కేంద్రం బలంగా ఉంటూనే రాష్ర్టాల ప్రతిపత్తిని గౌరవించటం, 4. సెక్యులరిజం. దేశ చారిత్రక, సామాజిక వాస్తవాలు, పరిస్థితుల దృష్ట్యా అందుకు అనుగుణమైన విధానాలు, పరిపాలన, 5.దేశంలోని అన్ని ప్రాంతాలు, ప్రజలు, వారి భాషలు, సంస్కృతుల పరిరక్షణకు, అభివృద్ధికి అవసరమైన ఆదరణ, అవకాశాలు. ఈ విషయంలో వివక్షలు చూపకపోవటం. ఒకరిపై మరొకరి ఆధిపత్యానికి అవకాశం ఇవ్వకపోవటం.
పైన అనుకున్నట్లు, ఈ అయిదు విధాలైన విలువలు, లక్ష్యాలకు పునాదులు మన గతచరిత్రలోనే ఉన్నాయి. వాటిని బాగా అధ్యయనం చేసినవారు అయినందువల్లనే మన స్వాంతంత్రోద్యమ నాయకులు ఉద్యమ కాలంలోనే వాటి ప్రస్తావనలు చేసి ముందుకుతెచ్చారు. వారికి అటువంటి దార్శనికత ఏర్పడింది. అప్పటి నాయకత్వంలో కుడి-ఎడమ-మధ్యేమార్గవాదులంతా ఉన్నారు. కానీ దేశభక్తి, దేశాభివృద్ధి, దేశ సుస్థిరత, దేశ భద్రత, దేశ భవిష్యత్తుల విషయంలో వారందరి నిజాయితీ, నిబద్ధతలు ఒక్కటే. అందువల్లనే, చర్చోపచర్చలు ఎన్నెన్ని సాగినా, వారంతా కలిసి దేశ ప్రజలకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఏకాభిప్రాయంతో ఇచ్చారు.
స్వాతంత్య్రం సిద్ధిస్తున్న వేళ అహరహం శ్రమించి ఒక గొప్ప రాజ్యాంగపు రూపునిచ్చి దానిని, వలస పాలన నుంచి విముక్తి చెందుతుండిన దేశాలన్నింటికి ఆదర్శంగా నిలిపారన్నది అందరికీ తెలిసినదే అయినందున ఇక్కడ వివరించనక్కరలేదు. ఆ లక్ష్యాలు, విలువలను పాలకులు భంగపరచటం వల్ల కలిగే ప్రతికూల పరిణామాల గురించి కూడా కొత్తగా చెప్పుకోనవసరం లేదు.
అందులో, మొదట అనుకున్న అయిదు విధాలైన లక్ష్యాలు, విలువలున్నాయి. వారు ఆ విధమైన రాజ్యాంగాన్ని మనకు ఇవ్వటం వెనుక వారు మన దేశపు వందల ఏండ్ల చరిత్రను, ఈ దేశ సమాజాలను అధ్యయనం చేయటం ఉంది. ఆ అధ్యయనంలో నిజాయితీ, దేశభక్తి, దార్శనికత ఉన్నాయి. మనవంటి ప్రాచీనమైన, మహా వైవిధ్యమైన, సువిశాలమైన దేశానికి, వలస పాలన తర్వాత, మొదటిసారిగా పూర్తిస్థాయిలో స్వయం సత్తాక పరిపాలనావకాశం లభించినపుడు, మన దేశ భవిష్యత్తును మనమే పూర్తిగా దిద్దుకోనున్నపుడు, పైన చెప్పిన విధమైన లక్ష్యాలు, విలువలు తప్పనిసరి అన్నది వారు స్పష్టంగా గ్రహించిన విషయం.
ఆ గుర్తింపు వెనుక మరొక అతి కీలకమైన విషయం ఉంది. పై విధమైన లక్ష్యాలకు, విలువలకు భంగం వాటిల్లినపుడు ప్రజలు ఎప్పుడూ అంగీకరించలేదు. వారి అసమ్మతి, ధిక్కారం వివిధ రూపాల్లో వ్యక్తమవుతూ వచ్చాయి. అందులో శాంతియుత రూపాలతో పాటు అశాంతియుత రూపాలు కూడా ఉన్నాయి. ఇది రాచరికపు కాలం నుంచి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థల వరకు ఉన్నది. సైనిక పాలనల నుంచి సోషలిస్టు సమాజాల వరకు ఏవీ ఇందుకు మినహాయింపు కాలేదు.
భారతదేశ చరిత్ర నుంచి దేశ దేశాల చరిత్రల వరకు అన్నింటిని అధ్యయనం చేసిన భారత నాయకత్వానికి, లక్ష్యాలు, విలువల భంగపాటులో పొంచి ఉన్న ప్రమాదం మొదటి నుంచి తెలిసిన విషయమే. అనగా, చరిత్ర అనేది సమగ్రమే తప్ప పాక్షికం కానపుడు, ఈ విధమైన లక్ష్యాలు, విలువల భంగపాటు వల్ల ప్రజల నుంచి ఎదురైన, ఇక ఎదురయ్యే ప్రమాదాలను కూడా ‘అమృత్ మహోత్సవ్’లో భాగంగా చేసుకుని చూడవలసి ఉంటుందన్నమాట. అమృత మథనంలో ‘విషం’ బయటపడటమన్నది నిజానికి ఆ మథనం జరిపే వారికి ఒక హెచ్చరిక వంటిది. కనుక భంగపాటుపై ప్రజల ధిక్కారాలను హెచ్చరికగా తీసుకోవటంలోనే పాలకుల వివేకం ఉంటుంది. ప్రజాస్వామికత, దేశభక్తి ఉంటాయి. ఆ లక్ష్యాలు, విలువలను నిలుపుకోవటం, వాటికి కలిగే భంగపాట్లను ఎదుర్కోవటం ఇప్పుడు ప్రజల బాధ్యత.
మొదట పేర్కొన్న అయిదు విధాలైన విధాలైన లక్ష్యా లు, విలువలు అనేక వందల ఏండ్లుగా మన చరిత్రలో ఎందువల్ల రూపుదిద్దుకున్నాయి? ఎందుకు స్వాతంత్రోద్యమ కాలంలో నాయకులు వాటిని మరింత స్పష్టమైన రీతిలో అజెండా పైకి తెచ్చారు? స్వాతంత్య్రం సిద్ధిస్తున్న వేళ అహరహం శ్రమించి ఒక గొప్ప రాజ్యాంగపు రూపునిచ్చి దానిని, వలస పాలన నుంచి విముక్తి చెందుతుండిన దేశాలన్నింటికి ఆదర్శంగా నిలిపారన్నది అందరికీ తెలిసినదే అయినందున ఇక్కడ వివరించనక్కరలేదు. ఆ లక్ష్యాలు, విలువలను పాలకులు భంగపరచటం వల్ల కలిగే ప్రతికూల పరిణామాల గురించి కూడా కొత్తగా చెప్పుకోనవసరం లేదు.
టంకశాల అశోక్