బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గిరిజనుల వినాశనానికి శ్రీకారం చుట్టింది. 2022 జూన్ 28న ‘ఫారెస్ట్ కన్సర్వేషన్ నిబంధనలు-2022’ను తీసుకువచ్చింది. ‘కన్సర్వేషన్’ (పరిరక్షణ) పేరుతో వచ్చిన ఈ నిబంధనలు అంతులేని విధ్వంసం చేయబోతున్నాయి.
ఆదివాసీలను, అడవులను, వన్యప్రాణులను, పర్యావరణాన్ని ధ్వంసం చేయడమే వీటి ప్రధాన ఉద్దేశం. ఈ నిబంధనల ప్రకారం ఎంత పెద్ద అడవినైనా అటవీయేతర భూమిగా మార్చుకోవచ్చు. వ్యాపార అవసరాలు, లాభాల కోసం బడా కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయవచ్చు.
రాష్ట్రంలో స్క్రీనింగ్ కమిటీ, కేంద్రంలో రీజినల్ ఎంపవరింగ్ కమిటీ, ఎడ్వైజరీ కమిటీలు, మొత్తం మూడు కమిటీలు ఏర్పాటవుతాయి. వీటిలో పర్యావరణవేత్తలకు, ఆదివాసీలు, సామాజిక కార్యకర్తలకు ప్రాతినిధ్యం లేదు. కొత్త నిబంధనల కింద ఎంత అడవిని, ఎంత కాలపరిమితిలో కార్పొరేట్లకు అప్పగించాలో వివరాలు ఉండటం గమనార్హం. 5 నుంచి 40 హెక్టార్ల అడవిని 60 రోజుల్లో నాన్మైనింగ్ అవసరాల కోసం, మైనింగ్ అవసరాల కోసం 75 రోజుల్లో అప్పగించాలి (హెక్టారు అంటే రెండున్నర ఎకరాలు). 41 నుంచి 100 హెక్టార్ల అడవిని 75 రోజుల్లో నాన్మైనింగ్ అవసరాల కోసం, మైనింగ్ అవసరాల కోసం 90 రోజుల్లో ఇవ్వాలి. 100 హెక్టార్ల నుంచి ఆ పైనున్న అడవిని 120 రోజుల్లో నాన్మైనింగ్ అవసరాల కోసం, మైనింగ్ అవసరాల కోసం 150 రోజుల్లో ధారాదత్తం చేయాలి. పై మూడు కమిటీలు మొత్తం ప్రక్రియను ఈ కిందివిధంగా పూర్తిచేసి అడవిని కార్పొరేట్లకు అప్పగించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశించబడిన కాలపరిమితికి లోబడి ఎటువంటి జాప్యం చేయరాదు.
ఎలా ధ్వంసం చేయాలి?: మొదటి దశలో ఆదివాసులను, వన్యప్రాణులను అక్కడినుంచి ఖాళీ చేయించాలి. తర్వాత అడవిని ప్రైవేటు వ్యక్తులకు, బడా కార్పొరేట్లకు దఖలు చేయాలి. ఆ తర్వాత ఏయే పద్ధతుల ద్వారా అడవిని ఎంత క్రూరంగా ధ్వంసం చేయవచ్చో కూడా ఈ నిబంధనల్లో పేర్కొన్నారు. 1. క్లియర్ ఫెల్లింగ్ (పూర్తిగా నరికివేయడం), 2. అప్ రూటింగ్ (కూకటివేళ్ళతో పెకలించడం), 3. బర్నింగ్ (అడవిని తగలబెట్టడం). ఇలాంటి విధ్వంసకర చర్యల ద్వారా అటవీభూమిని, అందులో ఉన్న సంపదను కొల్లగొట్టడం కోసం వన్యప్రాణులను, ఆదివాసులను, ఇతర పేదలను నిరాశ్రయులను చేస్తారు. తద్వారా అటవీయేతర భూమిగా మార్చుకొని వారి అవసరాల కోసం వాడుకుంటారు.
రాజ్యాంగం-చట్టాల ఉల్లంఘన: రాజ్యాంగంలో 5, 6వ షెడ్యూళ్ల ద్వారా దేశంలోని వివిధ రాష్ర్టాలలో ఆదివాసులకు పలు హక్కులు, రక్షణ లభిస్తున్నాయి. గిరిజన భూముల బదలాయింపు నిరోధక చట్టం, గ్రామసభలకు అధికారాలను కలగజేస్తున్న పెసా చట్టం, అటవీహక్కుల గుర్తింపు చట్టం-2006, భూ నిర్వాసితుల చట్టం-2013, వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు, తదితర కోర్టులు ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఇచ్చిన తీర్పులతో సహా అన్ని హక్కులు బుల్డోజర్తో నేలమట్టం చేయబడ్డాయి.
ప్రత్యామ్నాయ అడవుల పెంపకం లేనట్టే..: ఇప్పటివరకు అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ఎంత విస్తీర్ణం గల అడవిని అటవీయేతర భూమిగా మారుస్తారో, అంత విస్తీర్ణం గల భూమిని మరోచోట కేటాయించి ప్రత్యామ్నాయంగా అడవిని పెంచాలి. కానీ కొత్త విధానం ప్రకారం ప్రత్యామ్నాయ అడవుల పెంపకం నామమాత్రమే. రాష్ర్టాల మీదికి ఆ బాధ్యత నెట్టివేసి కేంద్రం చేతులు దులుపుకొన్నది.
నష్ట పరిహారం, పునరావాసం: అడవి నుంచి, భూమి నుంచి గెంటివేయబడిన ఆదివాసీలు, ఇతర పేదలకు పునరావాసం గానీ, నష్ట పరిహారం గురించి గానీ కేంద్రం ఎలాంటి బాధ్యత తీసుకోలేదు. నిర్దిష్ట ప్రతిపాదనలు కూడా లేవు. అడవిని పూర్తిగా వ్యక్తిగత ఆస్తిగా మార్చుకొని, ఆ యజమాని లబ్ధిని పొందడం ప్రారంభమైన తర్వాతనే నిర్వాసితుల పునరావాస ప్రక్రియపై దృష్టిపెట్టాలి. ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షణ చేయాలనేది ఈ నిబంధనల్లోని అంశం. బడా కార్పొరేట్లను నిలువరించటం రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆదివాసులకు, హక్కుల సంఘాలకు సాధ్యమవు తుందా? ఇది కేంద్రం పలాయనవాదం కాదా?
గిరిపుత్రులు అడవిలో పుట్టి, అడవినే నమ్ముకొని, అడవే జీవనాధారంగా ఏర్పరచుకొని, అడవిలో లభించే కందమూలాలు తింటూ నాగరికపు సమాజానికి దూరంగా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. వారిని అడవి నుంచి దూరం చేయాలని, అటవీ సంపదను కార్పొరేట్ బడా బాబులకు, ప్రభుత్వ ఆశ్రిత పెట్టుబడిదారులకు దోచిపెట్టాలని కేంద్రం తహతహలాడుతున్నది. అనేక రాష్ర్టాల్లో అటవీ సంపదను కొల్లగొట్టడానికి బొగ్గు గనుల తవ్వకం, బా క్సైట్, యురేనియం లాంటి ఖనిజాల వెలికితీతకు జిందాల్, వేదాంత లాంటి బహుళజాతి సంస్థలు, అంబానీ, అదానీల సంస్థలు పోటీపడుతూ గిరిజన జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. రా జ్యాంగ విలువలకు ప్రాధా న్యం ఇచ్చి, ఆదివాసీల అభివృద్ధికి రాజ్యాం గం కల్పించిన చట్టాలను అమ లు చేస్తేనే గిరిజనుల ఆకాంక్షలు నెరవేరుతాయి.
నాదెండ్ల శ్రీనివాస్
96764 07140