నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
1994 డిసెంబర్ 23న మూలవాసులకు సంబంధించి ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి వర్కింగ్ గ్రూపు జెనీవాలో సమావేశమైంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 9వ తేదీని ‘ప్రపంచ మూలవాసుల దినం’గా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రకటించింది. మూలవాసుల హక్కులను పరిరక్షించే రోజుగా తీర్మానించింది. ఇదే క్రమంలో 1995 నుంచి 2004 వరకూ పదేండ్ల కాలాన్ని ‘ప్రపంచ మూలవాసుల తొలి అంతర్జాతీయ దశాబ్దం’గా ప్రకటించింది. దీనిని కొనసాగిస్తూ.. 2005-15ను ద్వితీయ అంతర్జాతీయ దశాబ్దంగా 2004లో ప్రకటిస్తూ.. ‘కార్యాచరణ, ఆత్మగౌరవం’ అనే అంశాన్ని ప్రాతిపదికగా పేర్కొంది.
మూలవాసుల, ఆదివాసీల, గిరిజనుల బతుకు బాటను, జీవనసరళిని ప్రత్యక్షంగా పరిశీలిస్తే.. ఈ దేశ హితం కోసం వారు అసామాన్య కృషి జరిపారు. తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన చరిత్ర వారిది. దేశ నిర్మాణంలో పాల్గొని పునాదిరాళ్లుగా మారారు. ప్రకృతి సంరక్షకులు, పుజారులైన గిరిజనులు వేల ఏండ్లుగా ఈ దేశ జానపద కళలను మౌఖికంగా భద్రపరుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వాటిని ప్రదర్శిస్తూ, దేశ గౌరవాన్ని పెంచుతున్నారు. తద్వారా దేశ చారిత్రక మకుటంలో రత్నమై నిలిచారు.
దేశంలో సుమారు 705 ఆదివాసీ జాతుల అక్షరబద్ధం కాని భాష కారణంగా వారు చేసిన త్యాగాలు చరిత్ర పుటలకు ఎక్కలేదు. ప్రచారంలోకి రాక మసకబారిపోయాయి. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక గిరిజన మహిళ దేశ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం హర్షించదగిన విషయం. కానీ, ఈ పరిణామంతో గిరిజనుల ఆత్మగౌరవం పెరుగుతుందేమో కానీ, వారి బతుకుల్లో సమూల మార్పులు వస్తాయనుకోవడం అసంబద్ధమే. కేంద్ర ప్రభుత్వానికి నిజంగా గిరిజన సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి. అప్పుడే గిరిజన జాతి ఆశించిన లక్ష్యాన్ని సాధిస్తుంది.
అర్హత గల గిరిజనులను ఎస్టీ జాబితాలో చేర్చకుండా రాజ్యాంగ ఉల్లంఘనలు మనదేశంలో చోటుచేసుకుంటున్నాయి. ఆర్టికల్ 15 (4), 16 (4) ప్రకారం.. దేశంలో గిరిజనులకు అన్నిరంగాల్లో సరైన ప్రాతినిధ్యం ఉండాలి. కానీ, 2001 జనాభా లెక్కల ప్రకారం నిర్ధారించిన 7.5 శాతం రిజర్వేషన్లను మాత్రమే కేంద్రం కొనసాగిస్తున్నది. 2011 లెక్కల ప్రకారం 9.9 శాతం మేర పెంచాల్సి ఉంది. కానీ, ఇంకా పెంచలేదు. సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా ఆయా రాష్ర్టాల్లో గిరిజనుల రిజర్వేషన్ల శాతం పెంచడం రాష్ర్టాల పరిధిలోని అంశమని చెబుతూ కేంద్రం దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగాల్లో అరకొర రిజర్వేషన్లే అమలవుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేయడం వల్ల చాపకింద నీరులా రిజర్వేషన్లను సైతం ఎత్తివేస్తున్నారు.
ఆగస్టు 9వ తేదీని ఆదివాసీల దినోత్సవంగా జరుపటానికి కేంద్రప్రభుత్వం ఇప్పటి వరకూ ఎటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ, తెలంగాణలో మాత్రం ఆదివాసీల కోసం పలు పథకాలు అమలవుతున్నాయి. ఆదివాసీ పిల్లల కోసం గురుకులాలను ఏర్పాటు చేసింది. ఆదివాసీల అభ్యున్నతి కోసం ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. కేంద్రప్రభుత్వం కూడా ఆదివాసీల కోసం చర్యలు చేపట్టాలి. ఆదివాసీ దివస్ను గుర్తించాలని, అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా. వివిధ రంగాల్లోని ప్రధాన జనజీవన స్రవంతిలో ఆదివాసీలు కలిసేలా కార్యక్రమాలు తీసుకురావాలి. విద్య, ఆరోగ్యం, మానవహక్కులు, సామాజిక-ఆర్థిక అభివృద్ధితోపాటు సాంస్కృతికరంగంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్రం ఈ చర్యలు చేపట్టాల్సిందిగా సూచిస్తున్నా..
1. పెసా చట్టంతోపాటు అటవీ హక్కులను కచ్చితంగా అమలుపర్చాలి.
2. లిపి లేని గిరిజన భాష అయిన బంజారాను అధికారికంగా గుర్తించి, కొంకిణీ తదితర భాషల సరసన రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలి.
3. గిరిజన యూనివర్సిటీలను, ఏకలవ్య పాఠశాలలను, గిరిజనులు అధికంగా నివసించే ప్రాంతాల్లో గురుకులాలను ఏర్పాటు చేయాలి.
4. మరుగునపడుతున్న ఆదివాసీ, గిరిజన సంస్కృతులను, సంప్రదాయాలను కాపాడాలి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో విలువిద్య అకాడమీలను నెలకొల్పాలి.
5. ఆదివాసీ యువతలో ఉద్యోగ, ఔత్సాహిక పారిశ్రామిక నైపుణ్యాలను పెంచాలి.
(వ్యాసకర్త: మాజీ ఎంపీ, మహబూబాబాద్ )
ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్