శాంతిభద్రతలకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికీ వినూత్నమైన పరిష్కారాలు రాష్ట్రంలో ఆవిష్కృతమయ్యాయి. ఇవి ఇతర రాష్ర్టాలకు చెందిన వారినీ ఆకర్షిస్తున్నాయి. ఉత్తరాదికి చెందిన రజనీశ్ కపూర్ ఇటీవల హైదరాబాద్కు వచ్చిన ప్పుడు.. ట్రాఫిక్ నియంత్రణ చూసి ఆశ్చర్య, ఆనందాలకు లోనయ్యారు. ఆ వివరాలను ‘రాష్ట్రీయ్ సహారా’ అనే హిందీ పత్రికలో వ్యాసం రాసి ఉత్తరాది పాఠకులతో పంచుకున్నారు.
ఆ వ్యాసంలోని ముఖ్యాంశాలు..
గతవారం నేను తెలంగాణ రాజధాని హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కొన్ని సమస్యలకు కనుగొన్న పరిష్కారాలు చూసిన తర్వాత నా పరిశీలనను పాఠకులతో పంచుకోవాలనిపించింది. ఒక చౌరస్తాలో ట్రాఫిక్ నియంత్రణను గమనిస్తే చాలా సాఫీగా జరుగుతున్నట్టనిపించింది. ట్రాఫిక్ పోలీసు కూర్చుండే క్యాబిన్ ఖాళీగా లేదు. అందులో కొన్ని మీటలున్నాయి. అవి ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను కంట్రోల్ చేసేవి. అక్కడ కూర్చున్న పోలీసు చాలా నైపుణ్యంతో వాటిని ఆపరేట్ చేస్తున్నాడు. చాలా నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఉద్దేశించిన సిగ్నళ్లు అటోమెటిక్గా పనిచేస్తాయని పాఠకులకు తెలుసు. దానికి టైమర్ అమర్చి ఉంటుంది. జనసమ్మర్దం ఉన్నా, లేకున్నా ఒకేతీరుగా పనిచేస్తాయి. దానివల్ల ఒక దిశగా ఖాళీ, మరోదిశగా రద్దీ, జామ్లు ఏర్పడుతాయి.
కానీ, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎత్తయిన క్యాబిన్ నుంచి దూరంగా ఉన్న ట్రాఫిక్ను గమనించడమే కాకుండా, అవసరాన్ని బట్టి రెడ్, గ్రీన్ సిగ్నళ్లను వాడుతుంటారు. దీంతో ట్రాఫిక్ సమస్యను చాలావరకు నివారించవచ్చు. ఢిల్లీ, ముంబై, ఢిల్లీ వంటి ఇతర మహా నగరాల్లో ఇలాంటి విధానం కేవలం వీఐపీ రూట్లలోనే కనిపిస్తాయి. సాధారణ రూట్లలో వాహనదారులు అటోమెటిక్ సిగ్నల్ మీదే ఆధారపడతారు. ఇతర నగరాల్లో కూడా పోలీసులు అటోమెటిక్ సిగ్నల్ వ్యవస్థను అదుపు చేస్తారు. కాకపోతే ఆ సిగ్నల్ వ్యవస్థ దూరంగా ఎక్కడో ఉంటుంది. దానికి ఇతరుల సహాయం తీసుకోవాలి. కానీ, ఈ వినూత్న విధానం తెలంగాణలోనే ఆవిష్కృతమైంది. తెలంగాణ ప్రత్యేకతలు ఇంతటితో అయిపోలేదు.
తెలంగాణ ట్రాఫిక్ పోలీసులకు ఉన్న కాలుష్య సమస్యను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం వారికి 30 శాతం ఆరోగ్య భత్యం చెల్లిస్తున్నది. ‘హాక్ ఐ యాప్’ కూడా అమల్లోకి తెచ్చింది. దీనిద్వారా పౌరులు ట్రాఫిక్ ఉల్లంఘనలు, నేరాలపై ఫిర్యాదు చేయవచ్చు. నేర సమాచారాన్ని, పోలీసుల ఉల్లంఘనలపై కూడా రిపోర్టు చేయవచ్చు. పోలీసు వ్యవస్థను మెరుగుపర్చేందుకు సలహాలు, సూచనలు కూడా ఇవ్వొచ్చు. ఇప్పటిదాకా 5 లక్షల మందికిపైగా జనం ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడమే ఇందుకు సాక్ష్యం. పోలీసు వ్యవస్థ నిర్వహణలో ఎదురయ్యే ఇలాంటి సాధారణ సమస్యలకు సులభ పరిష్కారం కనుగొన్న తీరు నన్ను ముగ్ధుడిని చేసింది. పోలీసు విభాగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఒక అపూర్వమైన కార్యాచరణ చేపట్టినట్టు తెలిసింది.
తెలంగాణ ప్రభుత్వం పోలీసు స్టేషన్ల నిర్వహణకు ప్రత్యే క నిధులను కేటాయిస్తున్నది. నెలకు గ్రామీణ పీఎస్లకు రూ.25 వేలు, పట్టణ ప్రాంత పీఎస్లకు రూ.50 వేలు, మెట్రో పోలీసులకు రూ.75 వేలు ఇస్తున్నారు. గతంలో పోలీస్స్టేషన్ల నిర్వహణా వ్యయం కింద సర్కార్లు జరిపే కేటాయింపులు చాలా తక్కువస్థాయిలో ఉండేవి. ఈ కారణంగానే పోలీసులు ప్రజల్ని పిండి ఖర్చుకు సొమ్ములు రాబట్టుకునే పరిస్థితి ఎదురయ్యేది. తగిన నిధులు సమకూర్చిన ఫలితంగా పోలీసు స్టేషన్ల నిర్వహణ ఇప్పుడు మెరుగుపడింది. పోలీసులు ఇప్పుడు చాయ్, కాగితాల కోసం ఫిర్యాదుదారుల నుంచి డబ్బులు వసూలు చేయ డం లేదు. ప్రతి పీఎస్లో రిసెప్షన్ కౌంటర్ కూడా ఏర్పాటైంది. ఇది ఫిర్యాదుదారులకు ఎంతో ఊరట కలిగిస్తున్న ది. సమస్యల మీద కన్నా వాటిని పరిష్కరించడం మీద ఎక్కువ దృష్టి పెట్టాలనే ఆలోచన దీనంతటికీ కారణం. ఇలాంటి ఆలోచనలే ఇతర రాష్ర్టాల నేతలకూ వస్తే అక్కడి ప్రజలకు ఎంతో ఊరట లభిస్తుంది.
రజనీశ్ కపూర్