ఎవరైనా చాలారోజుల తర్వాత తారసపడితే ‘ఎలా ఉన్నారు?’ అని పలకరించడం సహజం. ఈ ప్రశ్నకు చాలామంది ‘ఏదో అలా నడిచిపోతున్నది!’ అని అనాసక్తంగా జవాబు ఇస్తుంటారు. జీవితంపై సరైన దృక్పథం, అవగాహన లేని వ్యక్తులే ఇలా నిరాశగా స్పందిస్తుంటారు. వాళ్లలో లేని లోటును వెతుక్కుంటూ, కండ్ల ముందున్న సౌకర్యాలను చూడలేరు. జీవితం లభించేది ఒక్కసారే! స్వల్పమైన జీవితాన్ని అనవసరమైన భావోద్వేగాలతో, కోపావేశాలతో మరింత కుంగదీసుకుంటారు. ‘దుర్దశలలో ధైర్యంగా ఉండటమే కర్తవ్యం. ధైర్యం వల్లే సర్వం సానుకూలం అవుతుంది. ఏదైనా అనుభవించడం కన్నా మరో మార్గం లేదు’ అని ధర్మరాజుకు భీష్ముడు ఉపదేశించాడు.
మనిషి తనకు శాంతి కావాలి, తృప్తి కావాలి అని కోరుకుంటున్నాడంటే అవి తనకు లేనట్టే కదా! వాటిని కోరుకోకపోతే అవి మనకు ఉన్నట్టే అని భావించొచ్చు. జీవితాన్ని మించిన గ్రంథం లేదు. మనసును మించిన గురువు లేడు. ఇవన్నీ సూక్ష్మంగా పరిశీలించుకుంటే గొప్ప తత్తం బోధపడుతుంది. అన్నీ తెలిసి కూడా రకరకాల బంధాల కారణంగా, కోరికల కారణంగా తృప్తి లేక, శాంతి లేక అది కావాలి, ఇది కావాలి అనుకుంటాం. కానీ, మనసు మన అధీనంలో ఉంటే.. ఏం కోరుకోవాలో తెలుస్తుంది.
చిత్తమనే నదికి మంగళకరం, అమంగళకరం అనే రెండు రకాల ప్రవాహాలు ఉంటాయి. ఏ ప్రవాహం వైపు ప్రయాణం చేస్తున్నామనే దాన్నిబట్టి ఫలితం ఉంటుంది. కోరిక మనసును వేగవంతం చేస్తుంది. నదిలో అలలు ఉండొద్దు అంటే ప్రవాహమే ఉండదు. అదేవిధంగా కోరికలు లేని మనసు ఉండదు. మరి ఆ కోరిక మంచిదా, చెడ్డదా అనేది మనం వివేచన చేసుకోవాలి. కోరికలపై నియంత్రణ ఉండాలే తప్ప, నిర్మూలన ఉండకూడదు. మంగళకరమైన కోరికలు అంటే ధర్మబద్ధమైనవి. వాటిని కోరుకోవడంలో ఏ తప్పూ లేదు. ‘మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు?- మందార పుష్పంలోని మాధుర్యం అనుభవించే తుమ్మెద.. ఉమ్మెత్త పూలవైపు పోతుందా?’ అని ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడిని ప్రశ్నిస్తాడు. భగవన్నామ మాధుర్యం ఆస్వాదించ లేకపోవడం వల్లే, మన మనసనే తుమ్మెద అమంగళకరమైన కోరికల చుట్టూ గింగిరాలు కొడుతుంటుంది. మంగళకరమైన కోరికలు జనించడానికి, వాటిని నెరవేర్చుకోవడానికి ఆధ్యాత్మిక సంస్కారం అలవర్చుకోవాలి. అప్పుడే మానవజన్మకు సార్థకత చేకూరుతుంది.
– వేముగంటి శుక్తిమతి, 99081 10937