‘వైద్యో నారాయణో హరి’.. ‘కనిపించే దేవుడు వైద్యుడు’.. లాంటి నినాదాలెన్ని ఉన్నా, అవి రాయడానికి, చెప్పడానికే పరిమితం. ఏ వైద్యుడైనా రోగులను బాగుచేయాలనే లక్ష్యంతోనే పనిచేస్తాడు. స్టెతస్కోప్తో రోగి గుండె చప్పుడు విన్నప్పటి నుంచి ఆ రోగికి ఆపరేషన్ చేసి ప్రాణాలు నిలబెట్టేవరకు తనవంతుగా ప్రయత్నం చేస్తాడు. తన శక్తిసామర్థ్యాలను, మేధస్సును ఉపయోగిస్తాడు. ఆపరేషన్ విజయవంతమై రోగి ప్రాణాలు నిలబడినప్పుడే కదా ఆ వైద్యుడికి ఆనందం. కానీ ఆరోగ్య ప్రపంచంలో వైద్యులు రెండురకాలు. అన్నిరంగాల్లో ఉన్నట్టు వైద్యరంగంలోనూ స్వార్థపరులున్నారడంలో సందేహం లేదు. ‘పైసామే హై పరమాత్మ’ అని కొందరు వైద్యులు భావిస్తే, కొందరు డాక్టర్లేమో రోగికి సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంటారు. మొదటిరకం వైద్యులేమో వైద్యాన్ని వ్యాపారమయం చేస్తూ వైద్యరంగానికే కళంకం తెస్తున్నారు.
మొన్నటి కరోనా విలయ తాండవాన్నే తీసుకుందాం. యావత్ ప్రపంచాన్ని గజాగజా వణికించిన వైరస్ను ఏ దేశ ప్రభుత్వమూ అడ్డుకోలేదు. కరోనా పని కరోనా చేసుకుంటూ వెళ్తే పాలకుల నుంచి ప్రజల వరకు అందరూ బిక్క మొహం వేసుకొని చూస్తూ కూర్చున్నారు.పోయే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కనీసం అంత్యక్రియలకూ నోచుకోలేని దేహాలెన్నో. విగత జీవులుగానే కుళ్లిపోయిన భౌతికకాయాలెన్నో…
రెండోరకం వైద్యుల విషయానికి వస్తే.. రోగుల ప్రాణాలను కాపాడటమే వీరి లక్ష్యం. ఉదాహరణకు కరోనా కాలంలో సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరలైంది. ఆ వీడియో సందేశం ఏమంటే.. ఓ డాక్టర్ రోజుల తరబడి దవాఖానలో సేవలు చేసి చాలారోజులకు ఇంటికివెళ్తాడు. తన పాపను చూసిన ఆ డాక్టర్ ఉండలేక ఒక్కసారిగా పాపను హత్తుకుంటాడు. ఆ సమయంలో ఆ వైద్యుడు పీపీఈ కిట్ ధరించి ఉంటాడు. ఆ పీపీఈ కిట్ ఉండగానే తన బిడ్డను తనివి తీరా ముద్దాడుతాడు. ఇంకో ఉదాహరణ.. ఓ వైద్య యువతి చాలా రోజులు గా కరోనా రోగులకు సేవచేసి తాను నివసించే అపార్ట్మెంట్కు వస్తుంది. ఆ అపార్ట్మెంట్ వాసులందరూ ఆ యువతిపై పూల వర్షం కురిపిస్తూ, చప్పట్లతో స్వాగతం పలుకుతారు. కొద్దిసేపు కరతాళ ధ్వనుల మధ్య ఆ వైద్య యువతి అందరికీ రెండుచేతులా అభివాదం చేస్తుంది. ఆనందం ఆపుకోలేక ఆనందబాష్పాలూ రాలుస్తుంది. ఈ రెండు వీడియోలు చూసిన వారెవరైనా కన్నీరు రాల్చకుండా ఉండలేరు.
మొదటిరకం వైద్యుల విషయానికి వస్తే.. ఇదే కరోనాను సొమ్ము చేసుకొన్న వైద్యులెందరో.. ప్రభుత్వ వైద్యులైనా, ప్రైవేటు వైద్యులైనా.. ప్రభుత్వ వైద్యులందరూ నిస్వార్థపరులని, ప్రైవేటు వైద్యులందరూ స్వార్థపరులని చెప్పలేను. కానీ, ప్రభుత్వ, ప్రైవేటు రెండు రంగాల్లో రెండురకాల వైద్యులుంటారు. సేవ చేయాలి, రోగి ఆరోగ్యమే నాకు సర్వస్వం అనే సేవాతత్పరత ఉన్న ఏ వైద్యుడైనా తన వృత్తికి ద్రోహం చేయలేడు. కళంకం తెచ్చుకోడు. అసలు విషయానికి ఇప్పుడు వద్దాం.. దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ రోగులను కాపాడుకోవాలనే వైద్యులుంటే సరిపోదు. ఆ వైద్యులకు సహకరించే ప్రభుత్వాలుండాలి. ఉదాహరణకు మొన్నటి కరోనా విలయ తాండవాన్నే తీసుకుందాం. యావత్ ప్రపంచాన్ని గజాగజా వణికించిన వైరస్ను ఏ దేశ ప్రభుత్వమూ అడ్డుకోలేదు. కరోనా పని కరోనా చేసుకుంటూ వెళ్తే పాలకుల నుంచి ప్రజల వరకు అందరూ బిక్క మొహం వేసుకొని చూస్తూ కూర్చున్నారు.
పోయే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కనీసం అంత్యక్రియలకూ నోచుకోలేని దేహాలెన్నో. విగత జీవులుగానే కుళ్లిపోయిన భౌతిక కాయాలెన్నో.. అలాంటి రోగి కుటుంబీకులు కూడా దగ్గరికి రాని విపత్కర సమయంలో వైద్యులుగా మేమున్నామంటూ రోగులకు ధైర్యం నూరిపోశారు. ఈ క్రమంలో ఎంతోమంది వైద్యులు, వైద్య సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాలను వదిలి, నిద్రాహారాలు మాని రోజుల తరబడి దవాఖానల్లోనే బస చేశారు. చైనా కేంద్రంగా జరుగుతున్న విపత్తును, ప్రాణ నష్టాన్ని కండ్లా రా చూస్తూనే మన దేశానికి రాకుండా కరోనాను అడ్డుకోలేకపోయాం. సరైన సమయానికి సరైన చికిత్సను అందించలేకపోయాం. తత్ఫలితంగా ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి.
నా దగ్గరికీ మోకాలి నొప్పుల చికిత్స కోసం వచ్చే ఒక రోగి తల్లి ఆవేదనను ఇప్పుడు చూద్దాం. ఇద్దరు కొడుకులు పుట్టగానే భర్త ఆమెకు విడాకులు ఇచ్చి ఒంటరి దానిని చేశాడు. ఇద్దరు పిల్లల్ని చంకనేసుకొని బయటికెళ్లి ఆ తల్లి ఏండ్ల తరబడి వారిలోనే అన్నీ చూసుకుంటూ జీవిస్తున్నది. ఆ ఇద్దరు కొడుకులు 45-50 మధ్య వయస్సు లోపువారే. కరోనా ఆ తల్లి పట్ల కర్కశత్వం చూపింది. కరోనా సోకి మూడు రోజుల వ్యవధిలో ఆ కొడుకులిద్దరూ మరణించారు. పాపం ఆ తల్లి ఒంటరయింది. ఈ తల్లి ఆవేదనను వింటే ఎవ్వరైనా ‘అయ్యో.. పాపం’ అనకుండా ఉంటారా..? ఈమె ఒక్కతే కాదు, ఇలా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇలాంటి వైద్య విపత్తులు వచ్చినప్పుడే మేల్కొంటామనడం పాలకులకు సరికాదు.
‘ఆరోగ్యమే మహాభాగ్యం’.. మనిషి ఆరోగ్యం గా ఉంటే కోట్ల రూపాయలు దగ్గరున్నట్టే అం టారు. కాబట్టి దేశంలో వైద్యులున్నారు, సదుపాయాలు, వనరులున్నాయి. వాటన్నింటిని ఉపయోగించుకోకుండా జరగాల్సిన నష్టం జరిగాక ‘అయ్యో పాపం..’ అంటే ఏం లాభం? కాబట్టి ప్రజల పట్ల పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి. వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తం గా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.
(వ్యాసకర్త: ప్రెసిడెంట్ ఎలక్ట్, స్టేట్ ఐఎంఏ)
డాక్టర్ బి.ఎన్.రావు
98668 34717