ఏదైనా ఒక దేశం సామాజికరంగంలో ఏ మేరకు అభివృద్ధి సాధించిందనే విషయం కార్మికులు, కర్షకులు
ఉత్పత్తి చేసిన సంపద మళ్లీ వారికి ఏ మేరకు తిరిగి లభిస్తున్నదన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కానీ దేశంలోని
కేంద్ర ప్రభుత్వ పాలనను మూల్యంకనం చేస్తే రైతులను ఆగం చేస్తున్న విస్మయకర అంశాలు మనకు కనిపిస్తున్నాయి.
ఈనెల 1న లోకసభలో జార్ఖండ్కు చెందిన బీజేపీ ఎంపీ నిశాంక్ దూబే మాట్లాడుతూ ‘ఎనిమిదేండ్ల మోదీ పాలనలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేద’ని ప్రకటించాడు. ఇటీవల మునుగోడు సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ‘కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల దేశ రైతాంగం సంతోషంగా ఉన్నదని, అయినప్పటికీ ఫసల్ బీమా యోజనలో తెలంగాణ ప్రభుత్వం చేరలేద’న్నారు. వీరి అబద్ధాలు, అసత్య ప్రచారాలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్నాయి. మోదీ పాలన రైతు గుండెలను ఎంత క్షోభలోకి నెట్టిందో కేంద్ర ప్రభుత్వ విధానాలను పరిశీలిస్తే అర్థమవుతుంది.
దేశంలో 10,677 మంది రైతులు, 5,098 మంది వ్యవసాయ కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని ‘నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో-2020’ నివేదిక తెలిపింది. 2014-20 వరకు మొత్తంగా 78,303 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆ నివేదిక వెల్లడించింది. రైతాంగ నిరసన కార్యక్రమాలు ఏటా పెరుగుతూ 2020 నాటికి తీవ్రరూపం దాల్చాయి. వరుస సంక్షోభాలతో పెద్ద రైతుల ఆస్తులు కరిగిపోతూ సన్నకారు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పేందుకు మూడు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. వాటికి వ్యతిరే కంగా భారత రైతాంగం ప్రపంచ చరిత్రలోనే లేని విధంగా సుదీర్ఘ పోరాటాన్ని 2020 నవంబర్ 20న ప్రారంభించింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఈ పోరులో 700 మంది రైతులు అమరులయ్యారు. కేంద్రం 2021 నవంబర్ 29న వ్యవసాయ నల్లచట్టాలను రద్దుచేసింది.
‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్’ చేసిన సర్వే ప్రకారం.. మోదీ ప్రభుత్వం తెచ్చిన ఫసల్ బీమా పథకం ఎక్కువగా బీమా కంపెనీల లాభాల కోసమే ఉపయోగపడిందని తేల్చింది. మొత్తం 18 బీమా కంపెనీలు ఈ పథకంలో భాగమయ్యాయి. కేంద్రంతో పాటు, ఈ పథకాన్ని ఒప్పుకున్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏడాది ప్రాతిపదికగా రైతుల నుంచి ప్రీమియంను వసూలు చేశాయి. మహారాష్ట్రలో ఐఐఎం జరిపిన పరిశీలన ప్రకారం 2017లో 6,459 కోట్లు, 2018లో 7,300 కోట్ల లాభాలను బీమా కంపెనీలు ఆర్జించాయి. రైతులకు పంట నష్టం కింద అందిన బీమా తక్కువగా ఉందని, లక్షల మంది రైతులకు బీమా సొమ్మును చెల్లించకుండా పెండింగ్లో ఉంచారని తెలియజేసింది. ఈ పథకం డొల్లతనం తెలిసిన కేసీఆర్.. దీంట్లో తెలంగాణను చేర్చలేదు. తర్వాత కాలంలో గుజరాత్ సహా అనేక రాష్ర్టా లు ఈ పథకం నుంచి వైదొలిగాయి.
‘పీఎం కిసాన్ పథకం’ కింద రెండు హెక్టార్ల (4.9 ఎకరాలు) లోపు ఉన్న రైతులకు పరిమితం చేసి మూడు వాయిదాల చొప్పున ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్నా రు. కానీ ఒక హెక్టార్ భూమిలో గోధుమలకు సాగు ఖర్చు రూ.60 వేలుగా ఉన్నది. వరికి రూ.70 వేలుగా ఉన్నది. వ్యాపార పంటలైతే రూ.లక్ష ఖర్చవుతుంది. సాగునీరు లేని ప్రాంతాల్లో రైతులకు రెండు నుంచి మూడు హెక్టార్ల భూమి ఉంటుంది. పీఎం కిసాన్ పథకం పరిధిలో ఈ రైతులను చేర్చలేదు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గడం, ఇతర వస్తువుల ధరలు పెరగడం సాధారణ అంశంగా మారింది. రైతులు తక్కువ ధరకు తమ పంట అమ్ముకోవడం, ఎక్కువ ధరకు ఇతర వినిమయ వస్తువులు కొనాల్సి రావడంతో రైతాంగ జీవనం దినదిన గండంగా మారింది.
2014 నుంచి పరిశీలిస్తే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఏటా బడ్జెట్ కేటాయింపులు తగ్గుతూ వస్తున్నాయి. ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజా పంపిణీ వ్యవస్థను కలిగి ఉన్నది. దీని అమలులో ఎఫ్సీఐ కీలకం. దేశ జనాభాలో 67 శాతం ఉన్న ప్రజలకు ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తున్నది. ఎఫ్సీఐ వద్ద బఫర్ స్టాక్గా 412 మెగా మెట్రిక్ టన్నుల ధాన్యాలు మాత్రమే ఉండాలి. కానీ ఎఫ్సీఐ తన నిల్వ సామర్థ్యం కన్నా అధిక ధాన్యపు నిల్వలు కలిగి ఉంది. ఫలితంగా దేశంలోని నిరుపేదలు ఆకలి సమస్యను ఎదుర్కొంటున్నారు.
మోదీ తన ఎన్నికల ప్రణాళికలో రైతులకు ‘అచ్చేదిన్’ రాబోతున్నాయని హామీలు ఇచ్చారు. 2020 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, ఉత్పత్తి వ్యయానికి 50 శాతాన్ని అదనంగా కలిపి కనీస మద్దతు ధరను పంటలకు ముందస్తుగా ప్రకటించడం, 2022 నాటికి వంద బిలియన్ల విలువ గల వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని పూర్తిస్థాయిలో వ్యవసాయానికి అనుసంధానించడం, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేయడం వంటి హామీల్లో మోదీ ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. జీవ నదులున్న భారతదేశంలో ఇప్పటికీ 60 శాతం పంట భూములు వర్షాధారంగా ఉన్నాయి. నెహ్రూ నిర్మించిన ప్రాజెక్టులు తప్ప బీజేపీ పాలనలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కాలేదు. ఈ చరిత్ర కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జార్ఖండ్ ఎంపీ నిశాంక్ దూబేలకు తెలియకపోవడం హాస్యాస్పదం.
(వ్యాసకర్త: అస్నాల శ్రీనివాస్ 96522 75560, అధ్యక్షుడు,దొడ్డి కొమురయ్య ఫౌండేషన్)