ప్రపంచ సాహిత్యాన్ని ఒక రాశిగా పేర్చితే, ఆ రాశిలో సర్వోన్నత సాహితీ మేరుశిఖరంగా నిలిచే మహత్తర కావ్యం శ్రీమద్రామాయణం. కారణం అది సమకాలీనతను, సార్వకాలీనతను కలిగి ఉండటమే. రామాయణాలెన్ని వెలువడినవో వాటికి సమాంతరంగా వ్యాఖ్యానాలు కూడా అన్ని ఉన్నాయి.
రామాయణం రసానందభరిత కావ్యమే కాదు, యావత్ మానవ సమాజ జీవన విధానానికి దర్పణం. ఇంతకు పూర్వం రామాయణంపై సురవరం ప్రతాపరెడ్డి, పుల్లెల శ్రీరామచంద్రుడు, శేషేంద్రశర్మ, డా.అరుణా వ్యాస్ తదితరులు చేసిన పరిశోధనలు, వ్యాఖ్యాన గ్రంథాలు, కేవలం వాల్మీకి రచనా వైభవానికో, రామాయణ ప్రాశస్త్యానికో, పాత్రల గుణగణాలు, శీలానికి సంబంధించినవిగా ఒక పరిమితిలోనే వెలువడినవి. ఈ నేపథ్యంలో ‘రామాయణ పరివారము’ శీర్షికతో బుర్రా వెంకటేశం (ఐఏఎస్) రామాయణం లోని యాభై పాత్రలను సరికొత్త కోణంలో పరిచయం చేస్తూ ప్రామాణిక గ్రంథాన్ని వెలువరించారు. ఇది పాత్రల పరిచయానికే పరిమితం కాలేదు. ప్రతి పాత్ర విశేషాలు, స్వభావం, ఆలోచనా విధానం, ప్రవర్తన గురించి విశ్లేషించారు. ముఖ్యంగా ప్రతి పాత్ర నుంచి నేర్చుకోవలసిన అంశాలేమిటి, విస్మరించాల్సిన విషయాలేమిటి? అన్నది వివరించడం విశేషం.
ఒక్కో పాత్ర మన జాతి జీవనంలో ఎలా మమేకమైందో చెప్పిన తీరు హృద్యం. వాస్తవానికి మన ఇంటివారే, మన బంధుజన సమూహ సభ్యులే మనకు అర్థం కారు. అలాంటిది 28 మహాయుగాలకు ముందు వెలసిన రామాయణ సమాజం గురించి, అవగతం చేసుకోవాలంటే ఎంతో అంతర్మథనానికి గురికావాలి. మంచివారిని అతి సంతోషంతో ప్రశంసలతో వర్ణించి, చెడ్డవారిని అభిశంసించడం సద్విమర్శకుని లక్షణం కాదు. మంచివారు, ఉత్తములనుకునే వారిలోనూ, చిత్త చాంచల్యం ఉండొచ్చు. సకలగుణ ధర్మసంపన్నుడని కీర్తింపబడిన శ్రీరాముడు, చాలా సందర్భాల్లో సామాన్య మానవుడి కంటే తక్కువ స్థాయిలో మాట్లాడాడు, ప్రవర్తించాడు. పలు సందర్భాలలో నిగ్రహం కోల్పోతాడు. ఉదా.. విరాధుడు సీతమ్మను ఒడి సిపట్టినప్పుడు, సామాన్యుని వలె… ‘ఇంకేం కైకేయికి తన కోరిక తీరింద’ని నిష్ఠూరంగా అంటా డు. (అరణ్య కాండం: 2.17.20).
సీతమ్మ కూడా ఓమారు బేలగా,మరోమా రు ధీరగా, శక్తిగా కనిపిస్తుంది. అడవులకు తనతో రావద్దని రాముడు వారిస్తే.. ‘నువ్వు ఏం మగాడివి- పురుషుడిలా కనిపించే స్త్రీవి’ (అరణ్యకాండం: 30.2.3) అని ములుకుల్లాంటి మాటలతో ఒప్పిస్తుంది సీతమ్మ.‘భరతుని వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ సజీవంగా ఉందని’ చెప్పారు. హనుమంతుని జీవితం నుంచి జిమ్నోసాఫిస్ట్గా ఉండటం (సింపుల్ లివింగ్- హై థింకింగ్) నేర్చుకోవాలని గ్రీకు పరిభాషలో ఉటంకించారు. మారీచుడు, నేటి కాలంలో సామాజిక మాధ్యమం ద్వారా, ఇతరత్రా మభ్యపెట్టి, మోసం చేసే స్కీముల/ స్కాముల/ స్వాములకు ప్రతినిధి అని అన్వయించారు.
అన్నదమ్ముల అనుబంధంలో గల వ్యత్యాసాన్ని సుగ్రీవుని పరంగా చేసిన వ్యాఖ్య ఎంతో అర్థవంతమైనది. ‘అన్న కోసం జీవితాన్నే త్యాగం చేసిన లక్ష్మణుడున్న రామాయణంలోనే, అన్న ప్రాణాన్ని కోరిన సుగ్రీవుడూ ఉన్నాడు.’ అని చెప్తూ అపోహలు తొలగించుకోకుంటే వాటిల్లే అనర్థాల గురించి పేర్కొన్నారు. ఈ విషయానికి కొనసాగింపుగా, తర్వాతి పుటలో ‘వాలి’ గురించి వివరించారు.
తార, సుమిత్ర, కైకసి, త్రిజట, ఊర్మిళ మొదలైన పాత్రలకు రామాయణంలో అంతగా ప్రాధాన్యం లేదు. ఈ పాత్రల తత్వాన్ని, మనస్తత్వాన్ని బుర్రా విశ్లేషించిన తీరు అభినందనీయం. సౌమ్యతకు మారుపేరుగా సుమిత్రను, త్యాగమయిగా ఊర్మిళను, మాటల నేర్పునకు తారను, మంచిని మానవతను అందించే సుమనస్విగా త్రిజటను (ఆమె రాక్షస స్త్రీ అయినప్పటికీ) చిత్రించిన విధానం రచయిత లోతైన ఆలోచనా విధానాన్ని సూచిస్తుంది. ఈ గ్రంథం లో కొన్ని అంశాలు ఎవరికీ తట్టని, స్ఫురించనివీ కనిపిస్తాయి. మహర్షియైన దూర్వాసుడి పాత్ర రేఖామాత్రంగానే కనిపిస్తుంది. దూర్వాసుడి గురించి చేసిన చర్చ మాత్రం మన మనసులో కలకాలం ఉంటుంది. కదళీవృక్ష (అరటి) ఆవిర్భావానికి, ఐరావతం తల తెగిపోవడానికి, ఇంద్రుని ఐశ్వర్యం నశించి పోవడానికి దూర్వాసుడు కారకుడని చాలా తక్కువమందికే తెలు సు. భల్లూక జాతికి చెందిన జాంబవంతుడు బ్రహ్మదేవుని పుత్రుడని, భూమ్యాకాశాల చుట్టూ ప్రదక్షిణ చేసిన ఘనుడని, భూగోళం పైనగల ఓషధుల గురించి విజ్ఞానమున్నవాడని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
రామాయణంలో శబరి, తదుపరి రామలక్ష్మణులకు సీతాన్వేషణ రూపంలో ‘క్లూ’ ఇచ్చిన వాడు కబంధుడు. కబంధుని పూర్వాపరాలను రచయిత చిత్రించి ఈ పాత్ర ద్వారా అహంకారాన్ని త్యజించాలనే అంశాన్ని తెలియజేశాడు. అన్నింటిని మించి నలుడు, నీలుడు గురించి ఎంతో ఆసక్తికరమైన సమాచారాన్ని అందించారు రచయిత.
‘రామాయణ పరివారము’లో పాత్రల నుంచి నేర్చుకోవలసిన అంశాలను వ్యాఖ్యానించారు. అయితే రామాయణంలో మరికొన్ని కీలక పాత్రల ప్రస్తావన చేస్తే బాగుండేది. అలాంటి వాటిలో దధిముఖుడు, సుషేణుడు,మైనాకుడు, సురస, లంఖిణి,సాగరుడు మొదలైనవి. ఇవి స్వల్ప కాల వ్యవధిలో తళుక్కున మెరిసిన పాత్రలు.
వాల్మీకి రామాయణంలో ఉడత ప్రస్తావన లేదు. కానీ అనేక రామాయణాల్లో ఉడత పాత్ర ప్రక్షిప్తమైనది. ఒక గొప్ప కార్యక్రమం చేపట్టినపుడు అల్పప్రాణి కూడా ‘నేను సైతం’ అంటూ భాగస్వామ్యమవుతుందని ఉడత పాత్ర సూచిస్తుంది. తరువాతి కాలంలో ఉడతాభక్తి, ఉడతా సాయం అనేవి తెలుగునాట జాతీయాలుగా మారాయన్నది జగద్విదితం. అలాగే సురస, మైనాకుడు, లంఖిణి, సాగరుడు, సుషేణుడు, అగ్ని, వాయువు మొదలగు పాత్రలు కూడా ‘రామాయణ పరివారము’లో చేర్చదగినవే. రామాయణంలో పంచభూతాలూ పాత్రలుగా కనిపించటం మరో విశేషం.
‘రామాయణం’ కేవలం పుస్తకం కాదని చిమ్మ చీకట్లో దీపమని తెలిపి, ఈ కావ్యం మన జాతి సంపద అనే భావాన్ని పాఠకుల హృదయాలకు చేర్చారు రచయిత.
(వ్యాసకర్త: – డాక్టర్ వి.వి. రామారావు 98492 37663 ,సాహితీవేత్త,ఆకాశవాణి ప్రయోక్త)